ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RAILWAY BOARD:వెబ్‌సైట్​లో 'దక్షిణ కోస్తా' జోన్.. శుభ సంకేతమంటున్న రైల్వే వర్గాలు

By

Published : Jul 4, 2021, 10:09 AM IST

RAILWAY BOARD
రైల్వేబోర్డు వెబ్‌సైట్‌ 'దక్షిణ కోస్తా' జోన్

విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న "దక్షిణ కోస్తా" జోన్ పేరు రైల్వేబోర్డు వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. ఒడిశాలోని రాయగడ డివిజన్‌, దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు కోసం రైల్వేమంత్రిత్వ శాఖకు పంపిన డీపీఆర్‌లపై ఇప్పటికీ నిర్ణయం పెండింగ్‌లోనే ఉన్నా.. జోన్ పేరు వెబ్‌సైట్‌లో పెట్టడం చూస్తే త్వరలో శుభవార్త వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. రెండేళ్లలోపే జీఎం నియామకానికి అడుగులు పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

రైల్వేబోర్డు వెబ్‌సైట్​లో 'దక్షిణ కోస్తా' జోన్

రైల్వే బోర్డు వెబ్‌సైట్‌ ఆర్గనైజేషన్‌ స్ట్రక్చర్‌ జాబితాలో 18 జోన్‌గా "సౌత్‌కోస్ట్" పేరు కనిపిస్తోంది. దేశంలో 16 రైల్వే జోన్లు ఉన్నాయి. కోల్‌కతా మెట్రోరైల్‌ ప్రాజెక్టు ప్రత్యేక జోన్ ఉంది. వీటన్నింటికి జనరల్‌ మేనేజర్‌లు ఉన్నారు. ఈ 17 జోన్లతో పాటు అదనంగా దక్షిణ కోస్తానూ రైల్వేబోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో జనరల్‌ మేనేజర్ల జాబితాలో చేర్చింది. దీని వల్ల విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ పట్టాలెక్కేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే సంకేతం వెలువడినట్లైంది.

నిధుల కోసం కొత్త జోన్‌ ప్రస్తావన అవసరం

బడ్జెట్‌లో నిధులు కేటాయించాలంటే కొత్త జోన్‌ ప్రస్తావన అవసరం. దీనికోసం ఈ ఏడాది బడ్జెట్‌కు ముందే మంత్రిత్వశాఖలో చర్చించి అధికారిక వెబ్‌సైట్‌లో పేరును చేర్చినట్లుగా రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే బడ్జెట్‌లో దక్షిణకోస్తా జోన్‌ పేరు మీదే నిధులు ఇవ్వొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

అవసరాలకు అనుగుణం ఏర్పాట్లు..

భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడాల్సిన రాయగడ డివిజన్‌ కోసం పలు నిర్మాణాలనూ ఇప్పటికే మొదలు పెట్టారు. రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ప్లాట్‌ ఫారాలనూ 3 నుంచి ఐదుకి పెంచుతున్నారు. రైల్వేస్టేషన్‌లో ఓ వైపు పాత భవనాలను కూల్చి, అదనపు పట్టాలకు అనుబంధంగా వచ్చేలా కొత్త నిర్మాణాలు చేస్తున్నారు. రైళ్ల రాకపోకలకు సిగ్నల్స్‌ అందించే అతికీలక ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ రాయగడలో తీసుకొస్తున్నారు. డివిజన్‌ మొత్తంలో రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యతలను చూసే ఆర్‌పీఎఫ్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం 40కోట్ల విలువైన పనులు జరుగుతున్నట్లు రైల్వేవర్గాల ద్వారా తెలుస్తోంది.

ఆ తర్వాతే కొత్త జోన్​లకు..

విశాఖ జోన్, రాయగడ డివిజన్‌ ఏర్పాట్లకు 170కోట్లు మంజూరైంది. గతేడాది బడ్జెట్‌లో 3కోట్లు, ఈ ఏడాది 40లక్షలు ఇచ్చారు. ఇవన్నీ సిబ్బంది జీత భత్యాలకు, ఇతర అవసరాలకు వాడుతున్నారు. దక్షిణ కోస్తా జోన్‌ అవసరాలకు ప్రత్యేకాధికారిగా వోఎస్​డీ, రాయగడలో ఏర్పాట్ల కోసం నోడల్‌ అధికారిని నియమించారు. రాయగడలో కొత్తగా డివిజన్‌ ఏర్పాట్లు పూర్తయ్యేందుకు రెండేళ్లు పట్టే అవకాశముందని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ తర్వాతే జోన్‌కు జనరల్‌ మేనేజర్‌ను, కొత్త డివిజన్‌కు డీఆర్‌ఎంను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇదీ చదవండి..

ఐఆర్​ఎస్ అధికారి సుందర్ సింగ్‌ నివాసాల్లో సీబీఐ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు!

ABOUT THE AUTHOR

...view details