RAINS IN AP: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. 2, 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా జల్లులు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. చాలాచోట్ల ఉరుములతో జల్లులు పడతాయని సూచించారు.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలు పొంగి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ములగలపల్లి, రౌతుగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎలుకల కాలువ చప్టా కొట్టుకుపోయింది. ఐదేళ్లుగా కాల్వ పరిస్థితిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములగలపల్లిలోని ఉన్నత పాఠశాలకు వెళ్లలంటే రౌతుగూడెం విద్యార్థులు ఈ కాలువ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో.. స్థానికుల సహాయంతో విద్యార్థులు కాలువ దాటారు.