దళితబంధు (Dalita Bandu) పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై తెలంగాణలో రాష్ట్ర మంత్రివర్గం సుధీర్ఘంగా చర్చించింది. పథకం పూర్వాపరాలను సమావేశంలో వివరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm kcr) అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకుసాగుతోందని... ఆ ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. దళితజాతి రూపురేఖలు మార్చేలక్ష్యంతో దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్న కేసీఆర్... రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో... దళితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దయనీయ స్థితిలో...
రాష్ట్రంలో 20 శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో... కేవలం 13 లక్షల ఎకరాల సాగుభూమి మాత్రమే ఉందని... వారి పేదరికానికి ఇంతకుమించిన గీటురాయి లేదని స్పష్టంచేశారు. ఆ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని సీఎం పేర్కొన్నారు. అరకొర సాయంతో దళితుల అభివృద్ధి సాధ్యం కాదన్న కేసీఆర్... దళితబంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి పది లక్షల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని... తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయం, ఆర్థికస్థితిలో మెరుగుదల రాదని అభిప్రాయపడ్డారు.
ఉపాధి, వ్యాపార మార్గాలను ఎంచుకునే స్వేచ్చ లబ్ధిదారులదేనన్న సీఎం... ప్రభుత్వం, అధికారులు, దళిత బంధు స్వచ్ఛంద కార్యకర్తలు వారికి మార్గదర్శనం చేస్తారని... అవగాహన కల్పిస్తారని వివరించారు. పథకం అమల్లో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు... ప్రతిజిల్లాలో సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ప్రైజ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రత్యేక చట్టం...
తెలంగాణ దళితబంధు పథకాన్ని ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం... పథకానికి చట్టభద్రత కల్పిస్తూ ప్రత్యేకచట్టం తేవాలని అభిప్రాయపడింది. ఎస్సీ ప్రగతి నిధి చట్టం దేశానికే ఆదర్శంగా నిలిచిందని... అదే తరహాలో దళితబంధు దేశానికి దారిచూపే పథకం అవుతుందని మంత్రివర్గం వ్యాఖ్యానించింది. ఈనెల 16 నుంచి దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా... హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం సిద్దం కావాలని కేబినెట్ ఆదేశించింది.