ఆ సెట్టింగ్స్​ మార్చడం వల్లే ఇంతటి ఘోరం! ఎవరి పని? రంగంలోకి NIA?

author img

By

Published : Jun 4, 2023, 4:06 PM IST

Updated : Jun 4, 2023, 5:23 PM IST

odisha train accident reason

Odisha Train Accident Reason : యావద్దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటన జరగడానికి మూల కారణం ఏంటి? ఇంటర్​ లాకింగ్​ వ్యవస్థలో సెట్టింగ్స్​ మార్చడం వల్లే ఇంతటి విషాదం జరిగిందా? అసలు అది ఎవరు చేసి ఉంటారు? ఉద్దేశపూర్వకంగానే చేశారా?

Odisha Train Accident Reason : ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి! ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్​ వ్యవస్థలో సెట్టింగ్స్​ మార్పు వల్లే ఇంతటి ఘోరం జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. అయితే ఈ ఇంటర్​లాకింగ్​లో మార్పు ఎవరు చేసి ఉంటారు? ఎందుకు చేశారు? ఉద్దేశపూర్వకంగానే చేశారా? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు రైల్వే అధికారులను వేధిస్తున్నాయి. విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు.. ఇంటర్​లాకింగ్​ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ వ్యవస్థలో పొరపాటు జరిగేందుకే ఎటువంటి ఆస్కారం లేదని చెబుతున్నారు. కచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే బయట వ్యక్తులు ఈ సెట్టింగ్స్​ మార్పు చేసినట్లు అనుమానిస్తున్నారు. కోరమాండల్​ ఎక్స్​ప్రెస్​ డ్రైవర్​ది ఎలాంటి తప్పులేదని నిర్ధరించుకున్నారు.

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ ఏమన్నారంటే?
Train Accident Odisha : ఒడిశా రైలు ప్రమాదానికి పాయింట్ మెషీన్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ మార్పే కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. రైల్వే భద్రతా విభాగ కమిషనర్‌ దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని ఆయన తెలిపారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని దర్యాప్తులో గుర్తించారని రైల్వే మంత్రి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారకులను కూడా గుర్తించారని వివరించారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు.

  • #WATCH | The commissioner of railway safety has investigated the matter and let the investigation report come but we have identified the cause of the incident and the people responsible for it... It happened due to a change in electronic interlocking. Right now our focus is on… pic.twitter.com/UaOVXTeOKZ

    — ANI (@ANI) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రైల్వే సేఫ్టీ అధికారి ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ దర్యాప్తు నివేదిక వీలైనంత త్వరగా అందజేస్తారు. ఘోర ప్రమాదానికి మూల కారణమేంటన్నది ఇప్పటికే గుర్తించాం. ఈ సమయంలో నేను ప్రమాద కారణాలపై ఇంకా మాట్లాడడం సమంజసం కాదు. దర్యాప్తు నివేదిక అందనివ్వండి. కానీ ప్రమాదానికి గల కారణాలను, అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మార్పు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్నది దర్యాప్తులో తేలుతుంది"

- అశ్వినీ వైష్ణవ్‌, రైల్వే మంత్రి

ఇంటర్​ లాకింగ్​ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
Interlocking System Railway : సాధారణంగా ఒకే పట్టాలపై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తూ పట్టాలను కేటాయించే సమగ్రమైన సిగ్నల్‌ వ్యవస్థ ఇది. రైలు ప్రయాణాలు సురక్షితంగా జరిగేలా చేయడం.. సిగ్నల్స్‌లో ఎటువంటి అవాంఛిత మార్పులు రాకుండా చూడటమే దీని ప్రాథమిక విధి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణించే మార్గం పూర్తిగా సురక్షితం అని తనిఖీల్లో తేలేవరకు రైలుకు సిగ్నల్స్‌ ఇవ్వకుండా ఈ వ్యవస్థ ఆపి ఉంచుతుంది. ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ వినియోగంలోకి వచ్చిన అనంతరం రైళ్లు ఢీకొట్టడాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పొచ్చు.

  • #WATCH | Sandeep Mathur, Principal Executive Director of Signalling and Jaya Varma Sinha, Member of Operation and Business Development, Railway Board explains the functioning of interlocking. pic.twitter.com/gQ1XuZbBv3

    — ANI (@ANI) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Interlocking System Features : అయితే ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో వేగంగా స్పందించే అవకాశం, రైళ్ల నియంత్రణకు సౌకర్యవంతంగా ఉండటం, కచ్చితత్వం వంటి అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలో ట్రాక్‌పై రైళ్ల లొకేషన్లు గుర్తించడానికి సెన్సర్లు, ఫీడ్‌బ్యాకింగ్‌ పరికరాలు వాడతున్నారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ సురక్షితను పెంచేందుకు ట్రైన్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌, సిగ్నల్స్‌, పాయింట్స్‌, ట్రాక్‌ సర్క్యూట్స్‌ వంటి వాటితో అనుసంధానమై పనిచేస్తుంది. దీంతో వాటిని సమన్వయం చేసుకుంటూ ఏకకాలంలో ఒకే మార్గంపై రెండు రైళ్లు రాకుండా చూస్తుంది. రూట్‌ సెట్టింగ్‌, రూట్‌ రిలీజ్‌, పాయింట్‌ ఆపరేషన్స్‌, ట్రాక్‌ ఆక్యూపెన్సీ మానిటరింగ్‌, ఓవర్‌లాప్‌ ప్రొటెక్షన్‌, క్రాంక్‌ హ్యాండిల్‌ ఆపరేషన్స్‌, లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ ఇంటర్‌లాకింగ్‌, ప్రొవిజన్‌ ఫర్‌ బ్లాక్‌ వర్కింగ్‌ వంటి పనులను చేస్తుంది.

గూడ్స్​ రైలులో ఇనుము.. ప్రమాదానికి ఇదీ కారణమే..
Odisha Train Accident Goods : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు సభ్యురాలు జయవర్మ సిన్హా మీడియాతో మాట్లాడారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదని.. కానీ అందులో ఇనుప ఖనిజం ఉన్నందున దాని ప్రభావం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై ఎక్కువగా పడిందని తెలిపారు. అదీ భారీ సంఖ్యలో మరణాలు, గాయాలకు దారితీసిందని వివరించారు. అందుకే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయని తెలిపారు. కోరమాండల్ రైలు డ్రైవర్ ఏం చెప్పారనే విషయాలనూ వెల్లడించారు.

  • #WATCH | Safety is the top priority for Railways. We are making sure that the evidence does not get tampered & that any witness does not get affected. The driver of the train who sustained serious injuries said that the train moved forward only after it received a 'Green' signal.… pic.twitter.com/6zER9dRAUl

    — ANI (@ANI) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కోరమాండల్​ రైలుకు చెందిన కొన్ని బోగీలు డౌన్‌లైన్‌లోకి వచ్చి దానిపై 126కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్ చివరి రెండు బోగీలను క్షణాల వ్యవధిలో ఢీకొట్టాయి. దీంతో యశ్వంత్‌పుర్‌ ఎక్స్​ప్రెస్ రెండు బోగీలు ఎగిరిపడ్డాయి. ఆ రెండు బోగీల్లోనూ చాలామందికి గాయాలవ్వగా కొందరు మరణించారు. ఘటనాస్థలిలో రైల్వే ట్రాక్​ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కనీసం రెండు రైల్వే లైన్లు ఆదివారం రాత్రి 8 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. ఘటనపై విచారణ జరుగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. రైల్వేకు భద్రతే అత్యంత ప్రాధాన్యత. 'గ్రీన్' సిగ్నల్ వచ్చిన తర్వాతే కోరమాండల్​ రైలు ముందుకు కదిలిందని తీవ్ర గాయాలపాలైన రైలు డ్రైవర్ తెలిపారు. అతడు సిగ్నల్ జంప్ చేయలేదు. రైలు కూడా అతివేగంగా వెళ్లలేదు. దర్యాప్తులో హోం మంత్రిత్వ శాఖ మాకు సహాయం చేస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ కాదు."

-- జయవర్మ సిన్హా, రైల్వే బోర్డు సభ్యురాలు

"ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థను ఫెయిల్​ సేఫ్​ సిస్టమ్​ అంటారు. అందులో ఏమైనా తప్పుజరిగితే.. రెడ్​ సిగ్నల్స్ వచ్చి రైళ్ల రాకపోకలన్నీ ఆగిపోతాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ చెప్పినట్లు ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ సెట్టింగ్స్ మార్చడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అయితే కేబుల్స్‌ను చూడకుండా ఎవరైనా ఆ ప్రాంతంలో తవ్వడం కూడా ఓ కారణం కావచ్చు" అంటూ రైల్వే బోర్డు సభ్యురాలు జయవర్మ సిన్హా అనుమానం వ్యక్తం చేశారు.

కోరమాండల్​ రైలు డ్రైవర్​కు వర్చువల్ క్లీన్​చిట్​
Coromandel Express Driver Dead or Alive : కోరమాండల్​ ఎక్స్​ప్రెస్​ రైలు డ్రైవర్​కు రైల్వేబోర్డు ఉన్నతాధికారులు 'క్లీన్​ చిట్​' ఇచ్చారు. గ్రీన్​ సిగ్నల్​ వచ్చిన తర్వాత రైలును డ్రైవర్​ ముందుకు పోనిచ్చాడని తెలిపారు. అతివేగంగా కూడా వెళ్లలేదని చెప్పారు. ఆ ప్రాంతంలో గరిష్ఠ వేగం 130kmph ఉండగా.. అతడు రైలును 128 kmph వేగంతో నడిపాడని వివరించారు. పస్తుతం ఆ డ్రైవర్​ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సుప్రీం కోర్టులో పిల్​
Odisha Train Accident Supreme Court : ఒడిశాలో రైలు ప్రమాద ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలైంది. రైల్వేలో రిస్క్‌ అండ్‌ సేఫ్టీ ప్రమాణాలను విశ్లేషించి సూచనలు జారీ చేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్‌ తివారీ పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణులను సభ్యులుగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సదరు నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసేలా చూడాలన్నారు.

ఘోర ప్రమాదం.. 270మందికిపైగా మృతి
Odisha Train Accident Death Toll : ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు. 11 వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న వారిని స్వస్థలాలకు తరలించేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, రాంచీ, కోల్‌కతా సహా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Last Updated :Jun 4, 2023, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.