ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'గ్రామ సమస్యలపై స్పందించండి' - వైసీపీ ఎమ్మెల్యేకు వినూత్న స్వాగతం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 9:31 AM IST

Villagers Organized Flexi on Some Village Issues: తమ గ్రామ సమస్యలపై స్పందించండి నాయకులారా అంటూ వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివ‌ వరప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసి గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్లెక్సీలో ముద్రించి రహదారిపై ఏర్పాటు చేశారు. అడుగుకో గుంత‌ గ‌జానికో గొయ్యిలా రోడ్డు దుస్థితి ఉందంటూ ఫ్లెక్సీ ద్వారా ఆవేద‌న వ్యక్తం చేశారు.

గ్రామంలోని సమస్యలను పరిష్కరించండి ఆ తరువాతే ఓట్లు అడగండి అంటూ బ్యానర్లో గుంతల రోడ్డు చిత్రాల‌ను ముద్రించారు.  గత 20 ఏళ్ల నుంచి గుంతలుపడిన తారు రోడ్డుపై మరమ్మతులు మినహా చేసిందేమీ లేదన్నారు. తాగునీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఉన్నందున శారీరక రుగ్మతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడని అనవసరపు హంగులకు చేసే ఖర్చులతో గ్రామ సమస్యలను పరిష్కరించవచ్చు కదా అని సందేశాత్మకంగా ఫ్లెక్సీలో వివరించారు. రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపై ఉన్న గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రానున్న ఎన్నికల తరుణంలో ఆయా సమస్యల పరిష్కారం కోసం ఒత్తిళ్లు పెంచడానికి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.  గ్రామంలో స‌ర‌ఫ‌రా అవుతున్న నీటిలో 300 వ‌ర‌కే ఉండాల్సిన టీడీఎస్ ప‌రిమాణం 1700 వరకు ఉంద‌ంటూ గ్రామస్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details