ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ - మార్కాపురంలో అదనంగా కె-ట్యాక్స్‌ - అక్రమాల్లో అన్నదమ్ములు పోటీ - YSRCP Leaders Irregularities

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 11:02 AM IST

Updated : Apr 28, 2024, 2:16 PM IST

YSRCP Leaders Irregularities: భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో వైఎస్సార్సీపీ నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు.అందరిలోకెల్లా ఓ ప్రజాప్రతినిధిది మాత్రం మొదటి వరస దేవుడి భూములనీ, శ్మశాన స్థలాలనే పట్టింపులేం ఉండవు. జెండా పాతేయడమే ఎజెండాగా సోదర సమేతంగా బరితెగించిన భూబకాసురుడీ నేత!

YSRCP Leaders Irregularities
YSRCP Leaders Irregularities

రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ - మార్కాపురంలో అదనంగా కె-ట్యాక్స్‌ - అక్రమాల్లో అన్నదమ్ములు పోటీ

YSRCP Leaders Irregularities : కాడెద్దులు, బండెడు అన్నం తినే బకాసురుడి కథ వినే ఉంటాం. వైఎస్సార్సీపీ సర్కారులో భూబకాసురుడంటే గుర్తొచ్చేది మాత్రం ఆ ప్రజాప్రతినిధే. ఆ నేతతోపాటు ఆయన సోదరుడి పేరు వింటే చాలు పశ్చిమ ప్రకాశం వణికిపోతోంది. వందల ఎకరాలను కబ్జా చేసి ఇంకా ఆకలి తీరలేదన్నట్లు ఊళ్ల మీద పడుతున్నారు. కాదూ కూడదంటే ఆయన సోదరుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. దోచుకోవడంలో అన్నదమ్ములిద్దరిదీ ఒకేమాట, ఒకే బాట. కాకపోతే అన్న క్లాస్‌ తమ్ముడు మాస్‌. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. అక్కడ ఏ పని చేయాలన్నా కె-ట్యాక్స్‌ కట్టాల్సిందే.

నకిలీ పత్రాలు సృష్టించి కొండలనూ కొట్టేయగల సిద్ధహస్తులు. ఆఖరికి ఆరోగ్యశ్రీలోనూ కమీషన్లు లాగేసేంత కక్కుర్తి. అయినా ఆ ప్రజాప్రతినిధి ఎంతో గొప్ప నాయకుడని వారి పార్టీ అధినేతే మురిసిపోతారు. ప్రజాసేవ కోసమే అమెరికా నుంచి తిరిగొచ్చారని ప్రశంసిస్తారు. మరి అంత గొప్ప నాయకుడైతే, ప్రజలకు అంత సేవ చేసి ఉంటే 2019లో గెలిచిన స్థానం నుంచి కాకుండా, మరో చోటకు బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పడానికి మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు.

మట్టి తవ్వాలన్నా ఇసుక అమ్మాలన్నా :ఈయన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలో చెరువులు, కొండలు, కుంటలు, ప్రభుత్వ భూముల నుంచి తట్ట మట్టి తీయాలన్నా, వాగుల్లో ఇసుక తవ్వాలన్నా కప్పం కట్టాల్సిందే. వారికి తెలియకుండా ఎవరైనా మట్టిని తీస్తే భూగర్భ గనుల శాఖ అధికారులు వెంటనే అక్కడ వాలిపోతారు. ఈ ప్రజాప్రతినిధికి కప్పం కట్టమంటారు. కడితే సరి లేదంటే రూ.లక్షల్లో జరిమానా విధిస్తారు. అయిదేళ్ల పాలనలో అక్రమ వసూళ్ల కోసం మండలానికి ఇద్దరు గుత్తేదారుల్ని నియమించారంటేనే దందా ఏస్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అండదండలతో మార్కాపురంలో భారీగా భూ ఆక్రమణలు: వైసీపీ బహిష్కృత నేత

2 శాతం కె-ట్యాక్స్‌ :తన సామ్రాజ్యంలోని 4 మండలాల్లో ఎవరైనా వెంచర్‌ వేయాలంటే ఈ ప్రజాప్రతినిధికి 2 శాతం కె-ట్యాక్స్‌ వెళ్లాలి. లేదంటే అధికారులు తనిఖీల పేరుతో కొర్రీలు పెడతారు. మేతన్నకు పన్ను జమయ్యేదాకా అనుమతులే రావు.

సెటిల్‌మెంట్లు కబ్జాలే నిత్యకృత్యంగా :దేవుడి భూములని చూడరు. దళితులకు కేటాయించిన శ్మశానాలనూ వదలరు. ప్రైవేటైనా, ప్రభుత్వ భూములైనా అనుచరుల ద్వారా ఆక్రమించడం, బినామీల పేర్లతో ఆన్‌లైన్‌లో మార్చుకోవడంలో సోదరులిద్దరూ దిట్టలే. వివాదాస్పద, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వాటితోపాటు కుటుంబ తగాదాల్లో ఉన్న భూములనూ వీరు అవకాశంగా మలుచుకుంటారు. అవసరమైతే వాటికి మరిన్ని చిక్కులు సృష్టిస్తారు. తర్వాత తామే పంచాయితీ చేసి బినామీ పేర్లతో రాయించుకుంటారు. ఇలా కొట్టేసిన భూములు వందల ఎకరాల్లోనే ఉన్నాయి. వీరికి రెవెన్యూ అధికారులూ యథాశక్తి సహకరిస్తుంటారు.

  • మార్కాపురంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానానికి చెందిన సుమారు రూ.10 కోట్ల విలువైన భూమిని తాము కొనుగోలు చేశామంటూ అనుచరులతో రాత్రికి రాత్రే కంచె వేయించారు.
  • మార్కాపురం రాజ్యలక్ష్మీనగర్‌ సమీపంలో దళితులకు చెందిన శ్మశానాన్నీ వదల్లేదు. నకిలీ పత్రాలు సృష్టించి 4 ఎకరాలు కబ్జా చేశారు. కళాశాల రహదారిలోని ఎస్సీలకు చెందిన శ్మశానాన్ని సైతం ఆక్రమించి కంచె వేశారు.
  • ఈ ప్రజాప్రతినిధుల అనుచరుడైన ఒక వైఎస్సార్సీప కౌన్సిలర్‌ గోగులదిన్నెలో రైతులకు చెందిన భూమిని దొంగ పత్రాలతో ఆక్రమించేశారు.
  • యర్రగొండపాలెం కేంద్రంగా ఈ ప్రజాప్రతినిధి సోదరుల అనుచరులు భూకబ్జాలకు తెరతీశారు. మార్కాపురం నుంచి కంభం రహదారిలో ఉన్న ఓ విలువైన స్థలానికి నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. బాధితుడు సిట్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన అధికారులు, బాధ్యులపై కేసులు నమోదు చేశారు. ఇదే ప్రాంతంలో ఓ నిరుపేదకు చెందిన ఎకరా భూమికి దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించారు.
  • మార్కాపురం పట్టణంలో వాసవీ కన్యకా పరమేశ్వరి డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఆర్‌అండ్‌బీ రహదారికి పక్కన 70 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వారికి నామమాత్రంగా ఎంతోకొంత ఇచ్చి బలవంతంగా ఖాళీ చేయించారు. అక్కడ అనుచరులతో పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు.

ఆరోగ్యశ్రీ నిధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే వెయ్యి కోట్ల అవినీతి : పెద్దిరెడ్డి

  • 2021లో మార్కాపురంలో 350 ఎకరాల ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూములను వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల పేర్లతో ఆన్‌లైన్‌ చేశారు. ఈ అక్రమాల్లో విశ్రాంత తహసీల్దారును అరెస్టు చేయడంతోపాటు 17 మంది రెవెన్యూ ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఏడాది తర్వాత వారందరికీ వివిధ జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. అయినా భూముల చెర ఇంకా వీడలేదు.
  • మార్కాపురం మండలం రాయవరంలో వైద్య కళాశాలకు సమీపంలో 80 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజాప్రతినిధే తమ అనుచరుల పేర్ల మీద అక్రమంగా ఆన్‌లైన్‌ చేయించారు. ఆ తర్వాత బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ ప్రాంతంలోనే ఉద్యోగులకు పట్టాలు ఇవ్వడానికి జగనన్న స్మార్ట్‌ సిటీకి కేటాయించిన 10.22 ఎకరాల భూమికి వైఎస్సార్సీపీ నాయకుడొకరు కంచె వేసి కబ్జా చేశారు.
  • మార్కాపురం శివారు డ్రైవర్స్‌ కాలనీలో రూ.కోట్ల విలువ చేసే భూమిని వైసీపీ కౌన్సిలర్‌ ఆక్రమించి, చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు.
  • తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడులో ప్రజాప్రతినిధుల పేర్లతో వైసీపీ నాయకులు సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆన్‌లైన్‌ చేసుకున్నారు. జాతీయ రహదారికి సమీపంలో 50 ఎకరాలను రెవెన్యూ అధికారుల ద్వారా ఆన్‌లైన్‌లో తమ పేర్లపైకి మార్చుకున్నారు.
  • కొనకనమిట్ల మండలం కాట్రకుంటలో 80 ఎకరాల పశువుల మేత భూమినీ కొందరు ఆక్రమిస్తే వారికి తమవంతు అండదండలు అందించారీ సోదరులు.
  • తర్లుపాడు మండలం మంగలకుంటలో వైసీపీ నాయకులు ఎర్రమట్టిని అక్రమంగా రవాణా చేసి రూ.లక్షల్లో ఆర్జించారని స్థానికుడొకరు అధికారులకు ఫిర్యాదు చేస్తే, ఆయనపై దాడికి తెగబడ్డారు.

జగన్‌ బొమ్మతో గిఫ్ట్ ప్యాకెట్స్ - ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో బయటపడ్డ ఖరీదైన వస్తువులు - flying squad find ycp gift packs

Last Updated :Apr 28, 2024, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details