YSRCP Leader Illegally Encroaching Lands: విజయనగరం జిల్లాలో ఓ కోటలాంటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే వైసీపీ ప్రజాప్రతినిధి అక్రమార్జనలో ఆరితేరారు. నియోజకవర్గంలో ఎవరైనా లేఅవుట్ వేయాలంటే, విస్తీర్ణాన్ని బట్టి వెయ్యి నుంచి రెండు వేల గజాల స్థలం ఆయనకు సమర్పించుకోవాల్సిందే. ఐదేళ్లలో దాదాపు 40 కోట్ల విలువైన స్థలాలను తన బినామీల పేరిట రాయించుకున్నారు. కొత్తగా లేఅవుట్ వేసే వారు ఆ ప్రజాప్రతినిధి సోదరుడిని తొలుత ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే భూమార్పిడి సహా ఇతర అనుమతులకు మోక్షం లభిస్తుంది. అధికారులు కూడా ఆ ప్రజాప్రతినిధి సోదరుడి ఇంటికి వెళ్లి ఆయనిచ్చిన ఆదేశాల మేరకే పని చేస్తారు. ఎవరైనా అలా చేయకపోతే బదిలీ వేటు తప్పదు.
నియోజకవర్గంలోని ఖాళీ స్థలాలను, వివాదాస్పద భూములను గుర్తించేందుకు ఆ ప్రజాప్రతినిధి ఏకంగా ప్రత్యేక టీమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ బృంద సభ్యులు గ్రామాల్లో సంచరిస్తూ ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తారు. వాటి ఆధారంగా భూముల్ని కబ్జా చేసేందుకు ప్రణాళికల్ని రచించి అమలు చేస్తుంటారు. ఈ పనుల్ని చక్కబెట్టేందుకు కొందరు అధికారుల్ని మోహరించుకున్నారు. పేరుకే ప్రజాప్రతినిధి తప్ప ఐదేళ్లుగా ఆయన దృష్టంతా భూముల కబ్జాపైనే.
కొత్తవలస మండలం అర్థానపాలెం పరిధిలో ఓ రాజు పేరిట ఉన్న 14.40 ఎకరాల భూమిని ఆ ప్రజాప్రతినిధి అత్తవారింటి తరఫు బంధువులు గతంలో ఆక్రమించుకున్నారు. తాను గెలిచిన తర్వాత అధికారులపై ఒత్తిడి చేసి పట్టాదారు పాసు పుస్తకాలను చేయించారు. ప్రతిఫలంగా మెయిన్ రోడ్డు పక్కనే అత్యంత విలువైన 25 సెంట్ల స్థలాన్ని వారి నుంచి తీసుకున్నారు. ఆ స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించి, ఓ ఇంటిని నిర్మించుకున్నారు. స్థానిక స్థిరాస్తి వ్యాపారులు కొందరు ఈ భవనాన్ని తమ సొంత డబ్బులతో నిర్మించి ఇచ్చారు.
దోచుకోవడంలో వాళ్లని మించినోళ్లు లేరు! - అన్నదమ్ముల దెబ్బకు కొండలైనా కదలాల్సిందే
రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేయించి: కొత్తవలస మండలం గులివిందాడలో ఒక లేఅవుట్ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకుని 15 కోట్ల విలువైన మూడెకరాల భూమిని నామమాత్రపు ధరకు లాగేసుకున్నారు. చింతలపాలెంలోని 17.23 ఎకరాల ప్రభుత్వ భూమి, 18.71 ఎకరాల గెడ్డ పోరంబోకు భూమి ఓ నాయకుడి ఆధీనంలో ఉంది. ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు విలువైన 35.94 ఎకరాల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయించారు. ప్రతిగా 25 కోట్ల రూపాయల వరకు అందుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని అమ్మచెరువులో 10 కోట్ల విలువైన 4.86 ఎకరాలను, వీరసాగరం చెరువులో 3 కోట్ల విలువైన 2.90 ఎకరాలను ఆక్రమించేశారు. దెందేరు గ్రామంలో పది మంది యాదవులకు సంబంధించిన 3 కోట్ల విలువైన రెండెకరాల భూమిని నకిలీ 1బీతో కాజేశారు.