YSRCP Government Not Revealing Cases Details: అధికారం చేపట్టింది మొదలు టీడీపీ (TDP) సహా ఇతర ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా అయిదేళ్లుగా పెద్ద ఎత్తున అక్రమ, తప్పుడు కేసులు బనాయించిన వైసీపీ (YSRCP) ప్రభుత్వం, ఆ కేసుల వివరాల్ని వారికి తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తనపై ఎక్కడెక్కడ ఏయే కేసులున్నాయో వివరాలివ్వాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. తనపై నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్ కట్టకుండా పెండింగ్లో ఉంచిన ఫిర్యాదుల వివరాల కోసం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి సృష్టించారు.
బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దుస్థితి లేదు. తమపై ఎక్కడెక్కడ ఏయే కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు పోరాడాల్సి వస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష అభ్యర్థులు వారిపైన ఉన్న కేసుల వివరాల్ని పూర్తిగా అఫిడవిట్లో పొందుపరిచేందుకు వీల్లేకుండా చేసేందుకు అధికార వైసీపీ, పోలీసులతో కుమ్మక్కై కుటిల వ్యూహం పన్నింది. తద్వారా వారి నామినేషన్లు ఆమోదం పొందకుండా చేసేందుకు కుట్ర చేస్తోంది.
తనపై ఉన్న కేసుల వివరాలివ్వాలని కోరుతూ డీజీపీకి చంద్రబాబు లేఖ
ఎప్పుడెప్పుడో కేసులు నమోదు చేసేసి రహస్యంగా:ఎవరిపైన అయినా కేసు నమోదు చేస్తే ఆ సమాచారాన్ని సంబంధిత వ్యక్తికి తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ అధికారం చేపట్టినప్పటి నుంచి జీఓలు మొదలు ప్రతి అంశంలోనూ పారదర్శకతకు తిలోదకాలు ఇచ్చేసిన జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసుల వివరాలనూ గుట్టుగానే ఉంచుతోంది. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నందుకు కక్షపూరిత ధోరణితో గత అయిదేళ్లలో ప్రతిపక్ష పార్టీల నాయకులపైన రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లలోనే కాకుండా సీఐడీ (CID), ఏసీబీ (ACB) తదితర ప్రత్యేక విభాగాల్లోనూ పెద్ద ఎత్తున కేసులు పెట్టారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏదైనా కేసు నమోదైన 24 గంటల్లోగా ఆ ఎఫ్ఐఆర్ను వెబ్సైట్లో పొందుపరచాలి. సీఐడీ ఒక్కటంటే ఒక్క ఎఫ్ఐఆర్నూ జనాలకు అందుబాటులో ఉంచట్లేదు. ఎప్పుడెప్పుడో కేసులు నమోదు చేసేసి, వాటిని సీఐడీ రహస్యంగా ఉంచుతోంది. అదే విధంగా తాము కావాలనుకున్నప్పుడే బయటపెడుతోంది. వివిధ పోలీసుస్టేషన్లలో ప్రతిపక్ష నాయకులపైన నమోదైన కొన్ని ముఖ్యమైన కేసుల ఎఫ్ఐఆర్లనూ దాచిపెట్టేస్తున్నారు. మరికొన్ని కేసుల్లో నిందితుల జాబితాలో ‘ఇతరులు’ అని పేర్కొని కొన్నాళ్ల తర్వాత ఆ స్థానంలో ప్రతిపక్ష నేతల పేర్లు చేరుస్తున్నారు. వారిని అరెస్టు చేసినప్పుడో లేదా సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులిచ్చినప్పుడో ఈ కేసుల విషయం వెలుగులోకి వస్తోంది.
ఎన్నికల వేళ టీడీపీ నేతలపై అక్రమ కేసులు- 'జగన్ కక్ష సాధింపు చర్యలు'
నామినేషన్ చెల్లనివ్వకుండా చేసేందుకేనా: మరో నాలుగైదు రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. శాసనసభ, లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు వారిపైన ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తమ అఫిడవిట్లో తెలపాలి. టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీచేయనున్న అభ్యర్థులకు వారిపై ఎక్కడెక్కడ ఏయే కేసులున్నాయనేది పోలీసులు సమాచారమివ్వకపోతే వారు అఫిడవిట్లో ఆ వివరాలు పొందుపరచటం సాధ్యం కాదు.