ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నోరు విప్పితే బీప్‌, అవినీతికొస్తే బాప్‌ - దోపిడిల్లో 'నా' 'నీ' భేదాలుండవ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 9:19 AM IST

Representative Anarchy in Joint Krishna Districts: ఆయన మాట్లాడుతుంటే టీవీలో బీప్‌ శబ్దాలే ఎక్కువగా వినబడతాయి. నోరు విప్పితే 'అంత కంపు' కొడుతుంది మరి. వైసీపీ సర్కారులో ఆయనో కీలక నేతగా మారడానికి ఈ లక్షణాలే ప్రధాన అర్హతగా నిలచాయనే వాదన ఉంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, కొన్నాళ్లు మంత్రిగా వెలగబెట్టిన సదరు నేత. కృష్ణా జిల్లాకి క్యాసినోను పరిచయం చేసిన ఘనతను పొందాడు. ఇక అక్రమాలు, అరాచకాలలో కబ్జాల నుంచి కాల్​మనీ వరుక ఎవరైన తన తరువాతే అన్నట్లుగా కోట్లకు పడగలెత్తాడు.

representative_anarchy
representative_anarchy

Representative Anarchy in Joint Krishna Districts:కబ్జాల నుంచి కాల్‌మనీ వరకు వడ్డీ వ్యాపారం నుంచి క్యాసినోల వరకు గుట్కా నుంచి మట్కా వరకు అన్నింటా ముందుండే ఆ ప్రజాప్రతినిధి అభివృద్ధి విషయంలో మాత్రం అధమస్థాయిలో ఉంటారు. ఎవరో ఎక్కడో గాడిదకు నల్లబెలూన్లు కట్టినా కచ్చితంగా తననే అవమానించారని భుజాలు తడుముకునే మహాజ్ఞాని. మంత్రిగా వెలగబెట్టినప్పుడు తన శాఖ మీద పట్టులేని విజ్ఞాని. ఒక్కసారీ ఆ శాఖను సమీక్షించిన దాఖలాలు లేవనుకోండి. సన్నబియ్యం ఇస్తామని మాటమార్చిన వ్యక్తి ఆ విషయాన్ని అడిగితే ‘నీ అమ్మ మొగుడు’ అని బూతు పురాణం మొదలుపెడతారు. తన నియోజకవర్గానికి గతంలో ఉన్న కీర్తిని ఆ ప్రజాప్రతినిధి దిగజార్చారనేది ప్రజల అభిప్రాయం.

ఇనాం భూములకే గాలం:కృష్ణా జిల్లాలో ఓ ప్రముఖ పట్టణానికి శివారున ఉన్న దాదాపు 150 ఎకరాల ఇనాం భూములకే గాలం వేశారు. వస్తే 500 కోట్ల రూపాయల ఇనాం కొండ పోతే ఆయన భాషలో ఒక వెంట్రుక. ఆ భూముల్ని కొంతమందికి ఇనాం ఇచ్చినా తర్వాత రైత్వారీ పట్టాలు చేయలేదు. కాలక్రమంలో చేతులు మారి దేవదాయ భూములుగా ఉన్నాయి. మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్‌ అధికారితో కలిసి ఆక్రమణకు స్కెచ్‌ వేశారు. అంతా సిద్ధమైంది.

రెవెన్యూ శాఖ కూడా నిరభ్యంతర పత్రం జారీ చేసింది. ఆ ఐఏఎస్‌ ఇవి దేవదాయశాఖకు చెందిన భూములు కావని ఎన్‌వోసీ జారీ చేశారు. ఈ దస్త్రం దేవదాయ శాఖ కమిషనర్‌ దగ్గరకు వెళ్లింది. అక్కడ క్లియరెన్స్‌ దొరక్కపోవడంతో ఆ వ్యవహారం పెండింగ్‌లో పడింది. అప్పటికే నాటి మంత్రికి కోట్లు ముట్టాయంటున్నారు. ఇప్పటికీ ఆ భూములు ఆక్రమణదారుల కబ్జాలోనే ఉన్నాయి. ఇటీవల కంచెలు కూడా వేశారు.

ఓ పట్టణ పరిధిలో వక్ఫ్‌ బోర్డు భూముల్లో కొంత భాగం భీమవరం వ్యాపారులు కొన్నారు. తన అధికారాన్ని ఉపయోగించి వారికి హక్కులు కల్పించి బదులుగా కోట్లు గుంజారు. ఆ పట్టణానికి సమీపంలోనే 8.64 ఎకరాల డీటీసీపీ అనుమతి ఉన్న లేఅవుట్‌ను 'బీప్‌' ప్రజాప్రతినిధి ఆక్రమించేశారు. ఒక ప్రముఖ వ్యక్తి మరో వ్యక్తికి ‘పవర్‌ ఆఫ్‌ అటార్నీ’ జారీ చేశారు. ఆ మేరకు కొంతమంది ఈ భూములను కొనుగోలు చేసుకుని సొసైటీ పేరుతో లేఅవుట్‌ వేసుకుని స్థలాలు పంపిణీ చేసుకున్నారు. అన్ని అనుమతులూ వచ్చాక విద్యుత్తు స్తంభాలు వేసే సమయంలో ఆ ప్రజాప్రతినిధి గ్యాంగ్‌ అడ్డుపడింది. తాను పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఎవరికి ఇవ్వలేదని మెలిక పెట్టి అసలు వ్యక్తి ఎదురు తిరిగారు. ఆయనకు ఈ నేత మద్దతుగా నిలిచారు. స్థలాన్ని తన అనుచరుల పేరుమీదకు మార్చుకుని స్వాధీనం చేసుకున్నారు. సొసైటీ సభ్యులు లబోదిబోమంటున్నారు.

దోచుకోవడంలో వాళ్లని మించినోళ్లు లేరు! - అన్నదమ్ముల దెబ్బకు కొండలైనా కదలాల్సిందే

ఆత్మహత్యలు చేసుకునేలా ఒత్తిళ్లు: పట్టణంలో ఒక స్థిరాస్తి వ్యాపారి షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మాణం చేశారు. ఆయన భారీగా సంపాదించారు. తనకు అప్పు ఉన్నారని దాన్ని చెల్లించాలని ఈ ప్రజాప్రతినిధి ఒత్తిడి తెచ్చారు. అప్పును కోట్లలో చూపించి అధికారులతో ఒత్తిడి పెంచారు. ఆ వ్యాపారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆపై షాపింగ్‌ కాంప్లెక్సు స్వాధీనం చేసుకున్నారు. మంత్రిగా చేసినప్పుడు ఓ అధికారికి రెవెన్యూ శాఖ నుంచి బియ్యం శాఖకు డిప్యుటేషన్‌పై ఒక జిల్లా అప్పగించారు. ఆ జిల్లా ధాన్యం సాగులో ప్రసిద్ధి ఇంకేముంది ధాన్యం కొనుగోలు పేరుతో రెండేళ్లు దుచుకున్నారు. బదులుగా ఓ విలాసవంతమైన విల్లా కానుకగా ఇచ్చారు.

ఆ ఉమ్మడి జిల్లాల్లో సుమారు 300 వరకు ధాన్యం మిల్లులు ఉంటాయి. అందరికీ సీఎంఆర్‌ కేటాయిస్తుంటారు. రీసైక్లింగ్‌లో ఓ మిల్లరు ప్రసిద్ధి. వారి నుంచి భారీగా విరాళం అందింది. అంతేకాదు అప్పుడు మరో మంత్రితో కలిసి జిల్లా కేంద్రంలో ఒక గోదాము నిర్మించి దాన్ని గిడ్డంగుల సంస్థకు లీజుకు ఇచ్చి బియ్యం నిల్వ చేస్తుంటారు. గోదాము బాధ్యతలు యాజమాన్యం నిర్వహించాల్సి ఉంది. వెరసి బియ్యం పెద్దఎత్తున కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారనేది అధికారులు సైతం అంగీకరిస్తున్న సత్యం.

చిచ్చు రాజేసి తానే శాంతపరిచినట్లు చేసి - కర్నూలులో అధికార పార్టీ సీనియర్​ నేత అరాచకాలు

సంక్రాంతికి క్యాసినో నిర్వహణ:'బీప్‌ ప్రజాప్రతినిధి' నియోజకవర్గానికి గతంలో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. అలాంటి కేంద్రంలో సంక్రాంతికి గోవా క్యాసినో నిర్వహించారు. క్యాబరేలు, మందులూ, విందులకు కొదవే లేదు. పక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్నేహితుడు దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఈ విషయంలో చీకోటి’ వీరి గురువు. పక్క మండలంలో సీఎం బామ్మర్దంటూ ఒక అనుచరుడిని తయారు చేశారు. ఇప్పటికే ఆయన ప్రభుత్వ భూములను 50 ఎకరాలు ఆక్రమించి చెరువులు తవ్వి లీజుకు ఇచ్చారు.

దీనిలో చెరిసగం ఆదాయం. మండలంలో చేపల చెరువులను తవ్వుతుంటే ఆర్‌ఐ అడ్డుకున్నారు. అంతే అతనిపై అనుచర గణం దాడి చేసి లంచాలు అడిగారని ఎదురు కేసు పెట్టింది. మరో అనుచరుడు ఒక యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోగా డబ్బు అడిగితే ఎదురు దాడికి దిగారు. కేసు పెడితే నీరు గార్చారు. కొంతమంది మహిళలు పక్క నియోజకవర్గంలో గాడిదకు నల్లబెలూన్లు కడితే తననే అవమానించారని పోలీసులను ఉసిగొల్పి కేసులు పెట్టించారు.

చెల్లించని డిపాజిట్లు - అయినవారి రుణాలైతే రద్దు - పాలకవర్గం ఇష్టారాజ్యం

కొండలకు బోడిగుండ్లు:ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో గ్రావెల్‌ అనుమతులు పొంది బినామీలకు అప్పగించారు. కొండలన్నీ బోడిగుండ్లు చేసేశారు. ఇదీ తన నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో కావడం విశేషం. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ మారే పరిస్థితిలో ఉన్నప్పుడు స్నేహితుడే అని మొత్తం అనుమతులు తనే తీసుకున్నారు. పలు సంస్థలకు గ్రావెల్‌ రవాణా చేశారు. కోట్లు పోగేశారు. పోలవరం కాలువ కట్టలను మాయం చేశారు. పట్టణ పరిధిలో టిడ్కో ఇళ్లకు మట్టి దందాలో కోట్ల రూపాయలు కుమ్మేశారు. ఇంత చేసీ తన నియోజకవర్గంలో ఒక్క రోడ్డయినా వేయలేకపోయారు.

నియోజకవర్గ కేంద్రం నుంచి జాతీయ రహదారికి వెళ్లే రోడ్డు గుంతలతో దారుణంగా ఉంటుంది. మరో రోడ్డుకు ఎన్‌డీబీ నిధులతో శంకుస్థాపన చేసిన ఆయన దాన్ని పూర్తి చేయించలేదు. గ్రామానికో పది మందిని ఎంపికచేసి వారిని గ్యాంగులా తయారు చేసి జల్సా రాయుల్లా మార్చడం ఎన్నికల సమయంలో వాళ్లని ప్రయోగించడం ఈ ప్రజాప్రతినిధి పని. ప్రతిపక్షంపై దాడులు చేయించడం, వారి అభిమాన సినీ హీరోల పుట్టినరోజు వేడుకలు స్వయంగా జరిపించడం ఫ్లెక్సీలు కట్టించడం ద్వారా యువతను ఆకట్టుకోవడంలో 'బీప్‌ ప్రజాప్రతినిధి' నేర్పరి.

నోరు విప్పితే బీప్‌ అవినీతి కా బాప్‌ - దోపిడిల్లో 'నా' 'నీ' భేదాలుండవు

ABOUT THE AUTHOR

...view details