CM Jagan Negligence on Jalayagnam Project :"పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. రాష్ట్రానికి జలకళ తీసుకొస్తాం" అంటూ 2019 జనవరి 10న ఇచ్ఛాపురంలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో జగన్ ప్రకటించారు. గత ఎన్నికల ముందు నవరత్నాల పేరిట జగన్ ఇచ్చిన హామీల్లో జలయజ్ఞం (Jalayagnam) ముఖ్యమైంది. జలయజ్ఞం అంటే కేవలం ఏదో ఒక్క ప్రాజెక్టు కాదు. పోలవరంతో సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు. నమ్మిన ఓటర్లు గెలిపించారు. ఆయన అధికారంలోకి వచ్చే సరికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే అప్పటి అంచనాల ప్రకారం కావాల్సిన మొత్తం రూ.74,183 కోట్లు. జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక తనంతట తానుగా కొత్తగా చేపడతామన్న ప్రాజెక్టుల అంచనా విలువ రూ.90,632 కోట్లు. జగన్ సర్కారు లెక్కల ప్రకారం అన్నింటికీ కలిపి మొత్తం కావాల్సిన నిధులు రూ.1,64,815 కోట్లు.
ఐదేళ్లలో జలయజ్ఞం ప్రాజెక్టును పట్టించుకోలేదు :ఐదు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన జగన్సర్కారు జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయామని శాసనసభ సాక్షిగా చేతులెత్తేసింది. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పదేపదే చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను 2024 తర్వాతే పూర్తి చేయగలమని అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సర్కారు సమాధానం ఇచ్చింది. అంటే తాము అధికారం చెలాయించిన ఐదేళ్లలో జలయజ్ఞం ప్రాజెక్టు(Jalayagnam Project)లను పట్టించుకోలేదని సర్కారే ప్రకటించింది. వాస్తవాలు ఇలా ఉంటే ఎన్నికల ముంగిట్లో సీఎం జగన్ ( CM Jagan) అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ప్రతి సభలోనూ జలయజ్ఞంపై ప్రజల ముందు ఏమాత్రం జంకూ లేకుండా పదేపదే పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.
జలయజ్ఞం పూర్తికి సంకల్పం.. 38,023 కోట్లు అవసరం
- ప్రజలు ఎంతగానో నమ్మి జగన్కు 151 సీట్లు అప్పగిస్తే సాగునీటి ప్రాజెక్టులన్నింటీనీ మూలన పడేశారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది.
- వెలిగొండ రెండో టన్నెల్ను మాత్రమే పూర్తిచేసి ఏకంగా ప్రాజెక్టే పూర్తయిందన్నంతగా సీఎం జగన్ హడావుడి చేశారు.
- ఆ టన్నెల్ నిర్మాణంతో ఆయకట్టు సాగులోకి రాదు. వెలిగొండ కింద కనీసం తొలిదశ ఆయకట్టు సాగులోకి రావాలన్నా మరో రెండేళ్ల సమయం పడుతుందని జలవనరులశాఖ అధికారులే
- చెబుతున్నారు.
- 2019 నాటికే 70% పూర్తయిన నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణాలను అతికష్టం మీద పూర్తి చేశారు.
- అవుకు టన్నెల్ ఒకటి పూర్తి చేశారు. ఇప్పటికే గండికోటలో ఉన్న నీటిని ఆయకట్టుకు ఇచ్చే దిక్కులేదు. కొత్తగా అవుకు ద్వారా మరింత నీరు పంపి సాధించేదీ ఏమీ లేదు.
- నిధులను తక్షణ అవసరమైన ప్రాజెక్టులపై వెచ్చించలేదు. జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) నిర్మాణాలు ఆపాలని ఆదేశించిన ప్రాజెక్టులకు, ఇప్పట్లో నీళ్లు అందుబాటులోకి రాని ఎత్తిపోతల పథకాలకు రూ.వేల కోట్ల బిల్లులను చెల్లించేసి నిధుల దుర్వినియోగం చేశారు.
ప్రతిపక్షనేత హోదాలో జగన్ :ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలన్నా, భవిష్యత్తులో అవి భారంగా మారకుండా ఉండాలన్నా చాలినన్ని నిధులు ఇవ్వాలి. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతుందనే అంచనా ఉన్నా అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు లేవు. ఆ అరకొర కేటాయింపుల్లో సగమైనా ఖర్చు చేసిన దాఖలాలూ లేవు. మొత్తం ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 20% మాత్రమే ఖర్చు చేసింది. ఆయన పూర్తి చేస్తానన్న 26 సాగునీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ.61,573 కోట్లు ఇస్తామంటూ బడ్జెట్లో ప్రతిపాదించి చేసిన ఖర్చు రూ.35,268 కోట్లు మాత్రమే. ఇందులో ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణకు పనులు కలిపే ఉండటం గమనార్హం. అంటే నికరంగా ప్రాజెక్టులపై వ్యయం చేసిన మొత్తం మరింత తగ్గిపోతుంది. ప్రతిపక్షనేత హోదాలో జగన్ ఏ ఊరు వెళ్లినా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేస్తానని ఘనంగా చెప్పిన ఆయన ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?