ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జల దాహంతో జనం- అధికార దాహంతో సీఎం జగన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 7:46 AM IST

Updated : Feb 3, 2024, 11:52 AM IST

CM Jagan Negligence on Drinking Water Schemes: ఎవరైనా మంచి పనిని అనుసరిస్తారు. నష్టం జరుగుతుందనుకుంటే కొత్త ఆలోచన చేస్తారు. కానీ జగన్‌ తీరే రివర్స్‌! కక్ష,కార్పణ్యాలు తప్ప మంచి చెడులు ఆయనకు పట్టవు. పంతానికి పోయి ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజా వేదికనే కూలగొట్టిన ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఆయనది. తాగునీటి సమస్య పరిష్కారం కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టునూ అలాగే పక్కనపెట్టేశారు. ఫలితంగా వేసవి రాకముందే పట్టణాల గొంతెడుతోంది.జనం దాహం కేకలు వేస్తుంటే జగన్‌ ముఠా ఓట్ల దాహార్తి తీర్చుకునే పనిలో పడింది.

CM_Jagan_Negligence_on_Drinking_Water_Schemes
CM_Jagan_Negligence_on_Drinking_Water_Schemes

జల దాహంతో జనం- అధికార దాహంతో సీఎం జగన్

CM Jagan Negligence on Drinking Water Schemes :వేసవికి ముందే రాష్ట్రంలోని పట్ణణప్రాంతాల్లో నీటిఎద్దడి తలెత్తే సూచనలు కన్పిస్తున్నాయి. ఒంగోలులో జనవరిలోనే నాలుగు రోజులకోసారి తాగు నీరు సరఫరా చేసిన పరిస్థితి. నగర శివారు ప్రాంతాలకు వారానికోసారి ఇవ్వడమే గగనమవుతోంది. గుండ్లకమ్మ నీటిని నగరానికి రప్పించడం ద్వారా శివారు ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చొచ్చన్న ఉద్దేశంతో టీడీపీ హయాంలో అమృత్‌ పథకం కింద 123 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. గుండ్లకమ్మ నుంచి నగరంలో నీరు నిల్వచేసే చెరువుల వరకూ. పైపులు వేయాలి, 4ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, రెండు ఫిల్టర్‌ ప్లాంట్లు నిర్మించాలి. కానీ జగన్‌ ప్రభుత్వం నిధులివ్వకుండా పనుల్ని అటకెక్కించింది.

Drinking Water Schemes in AP :విజయవాడలోని జక్కంపూడి, రాజీవ్‌నగర్, పాయకాపురం, గంగిరెద్దులదిబ్బ, కండ్రిక, శాంతినగర్‌ తదితర ప్రాంతాల్లోనూ కుళాయిల ద్వారా నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేస్తామన్న హామీ కూడా పూర్తిగా అమలు నోచుకోలేదు. కృష్ణా నది నుంచి వచ్చే నీళ్లలో ఆల్గే శాతం ఎక్కువగా ఉంటున్నందున శుద్ధి చేయడంలో జాప్యమై శివారు ప్రాంతాలకు సరఫరాలో జాప్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి శుద్ధి వ్యవస్థను మెరుగుపరిచేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. నదిలో ప్రవాహం తగ్గుతున్నందున రాబోయే రోజుల్లో మిగతా ప్రాంతాలకూ తాగునీటి సమస్య తప్పకపోవచ్చనే ఆందోళన నెలకొంది. తిరువూరులోనూ తాగునీరు రెండు, మూడు రోజులకోసారి సరఫరా చేయడమే గగనమవుతోంది.

'గొంతెండుతోంది మహాప్రభో' - వేసవికి ముందే తాగునీటి సమస్య జఠిలం

కలుషిత నీరు :అనంతపురం జిల్లా గుత్తిలోనూ కుళాయిల ద్వారా నెలకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గుత్తి పట్టణ ప్రజల దాహార్తి తీరాలంటే 40 లక్షల లీటర్ల నీరు కావాలి. కానీ 8 లక్షల లీటర్ల నీళ్లు సరఫరా చేయడమే గగనమవుతోంది. ట్యాంకర్ల ద్వారా అరకొరగా సరఫరా చేస్తున్నా కలుషిత నీరు అందుతోందని ఆరోపణలున్నాయి. గుత్తిలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి AIIBసాయంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జగన్‌ సర్కార్‌ నిధులివ్వకుం వల్ల పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం ఎక్కడివక్కడే ఆగిపోయాయి.

అమలు కానీ ప్రణాళికలు : విశాఖలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి జగన్‌ ప్రభుత్వ ప్రణాళికలు కాగితాలు గదాటితే ఒట్టు. నగరానికి తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకోసం తూర్పుగోదావరి జిల్లా ఏలేరు ప్రాజెక్టు నుంచి రోజూ 250 మిలియన్‌ గ్యాలన్ల నీటిని ఓపెన్‌ కెనాల్‌ ద్వారా తీసుకొస్తుంటారు. అందులో 25శాతం అంటే 62 మిలియన్‌ గ్యాలన్లకుపైగా ఆవిరవుతోంది. ఓపెన్‌ కెనాల్‌ స్థానంలో పైపులైను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలు అమలుకు నోచుకోలేదు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా 5 టీఎమ్​సీల నీరు నిల్వ చేసేలా విశాఖ పరిధిలో 5 జలాశయాలు నిర్మించాలన్న ప్రతిపాదనలూ నివేదికలకే పరిమితమయ్యాయి.

నీళ్లివ్వలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే - తాగునీటి కోసం మహిళల ఆందోళన

పేరుకుపోయిన బిల్లులు : ముందుచూపులేని జగన్ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గత తెలుగుదేశం ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులనూ పక్కనపెట్టేశారు. గత ప్రభుత్వం లక్షలోపు జనాభా ఉన్న 50 పట్టణాల్లో 400 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించింది. ప్రాజెక్టు వ్యయంలో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు-AIIB 70శాతం,రాష్ట్ర ప్రభుత్వం 30శాతం నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం. అప్పట్లోనేదాదాపు 30 నుంచి 35శాతం పనులు పూర్తయ్యాయి. జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ వాటా సరిగా విడుదల చేయని కారణంగా 200 కోట్ల రూపాయలమేర బిల్లులు పేరుకుపోయాయి. అనేకచోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేశారు.

టీడీపీ ప్రభుత్వం - వైఎస్సార్సీపీ ప్రభుత్వం : లక్షకు మించి జనాభా ఉన్న 32 పట్టణాల్లో అమృత్‌ పథకం కింద 2వేల 526 కోట్ల రూపాయల అంచనాతో టీడీపీ ప్రభుత్వ ప్రారంభించిన పనులకూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పట్టణ స్థానిక సంస్థల వాటా నిధులనూవిడుదల చేయాలి. బిల్లులు ఇవ్వడంలేదంటూ గుత్తేదారులు అనేక చోట్ల పనులు నిలిపేశారు.

Water Problems in AP :గత ప్రభుత్వం 35 శాతానికిపైగా పనులు పూర్తి చేసింది. అవి కొనసాగించి ఉంటే ఈపాటికి పూర్తై ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పేవి. ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పుర, నగరపాలక సంస్థల్లో పైపులైన్ల లీక్ అవుతూ తాగునీరు కలుషితం అవుతోంది. ఫలితంగా కుళాయి నీటిని ఇంటి అవసరాలకు వాడుకుని తాగడానికి ఆర్వో ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. ఒక్కో కుటుంబం ఇందుకు నెలకు సగటున 200 నుంచి 250 రూపాయల వరకూ వెచ్చిస్తోంది. దశాబ్దాల నాటి తాగునీటి పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయడానికి టీడీపీ హయాంలో క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ కింద నిధులు కేటాయించారు. జగన్‌ ప్రభుత్వం ఆ ప్రణాళికలూ పక్కనేసింది.

'ఓట్లు వేయించుకుని వదిలేశారు' - మూడు నెలలుగా తాగునీటికి అల్లాడుతున్న జనం

Last Updated :Feb 3, 2024, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details