ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం జగన్ ఆస్తుల విలువ కొండంత - ఎన్నికల అఫిడవిట్​లో చూపించింది గోరంత - CM Jagan Election Affidavit

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 9:03 AM IST

CM Jagan Assets: తనకు పేపర్లు లేవు, టీవీల్లేవంటూ అబద్ధాల జాతర చేస్తున్న జగన్‌, ఎన్నికల సంఘానికీ అదే మస్కా వేశారు. సాక్షి మీడియాలో వాటాలను ప్రస్తావించలేదు. బెంగళూరులోని విలువైన వాణిజ్య, నివాస భవనాల ఊసేలేదు. 20 ఏళ్లలో కోటి 74లక్షల నుంచి 757కోట్ల రూపాయలకు జగన్‌ ఆస్తులు అసాధారణంగా పెరిగాయి. వేల కోట్ల ఆస్తులు పోగేసుకుని వందలకోట్లే చూపించారు.

CM Jagan Assets
CM Jagan Assets

సీఎం జగన్ ఆస్తుల విలువ కొండంత - ఎన్నికల అఫిడవిట్​లో చూపించింది గోరంత!

CM Jagan Assets :పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో (CM Jagan Election Affidavit) ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. వివిధ సంస్థల్లో వాటాలు చూపినా, ఆ సంస్థలకున్న వాస్తవ విలువలను అందులో పేర్కొనలేదు. ఇంద్రభవనం లాంటి లోటస్‌పాండ్‌ ఇల్లు, బెంగళూరులో అతిపెద్ద వాణిజ్య భవనం ఉన్నా వాటి ఊసెత్తలేదు. సొంతగా కుటుంబానికి వాహనం లేదని తెలిపారు. తాజా అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తులను 757 కోట్ల 65 లక్షల రూపాయలుగా వెల్లడించారు. వాస్తవ విలువ కొన్నివేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

సాక్షి ఎవరిది సార్? : వైఎస్‌ జగన్‌ తన అఫిడవిట్‌లో సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్‌ను తమ ఆస్తులుగా పేర్కొనలేదు. కానీ వాస్తవానికి ఈ రెండు సంస్థల్లో మెజారిటీ వాటా ఆయనదే. సాక్షి దినపత్రిక ప్రచురించే జగతి పబ్లికేషన్స్‌లో 69.05 శాతం వాటా కార్మెల్‌ ఏషియా హోల్డింగ్‌ సంస్థకు ఉంది. జగతి పబ్లికేషన్‌ ప్రారంభ పెట్టుబడి 73 కోట్ల 56 లక్షల రూపాయలను ఈ సంస్థ సమకూర్చింది. వాస్తవానికి కార్మెల్‌లో గన్‌ పెట్టుబడి 8లక్షలు ! మిగతాదంతా వైఎస్‌ అధికారిలో ఉన్నపుడు కొందరికి చేసిన మేళ్లకు ప్రతిఫలమే.

బెంగళూరులోని జగన్‌ ఇంటి చిరునామాతో కార్మెల్‌ సంస్థను 2005 నవంబరు 13న ప్రారంభించారు. తాను 8లక్షలు, తనకు సంబంధించిన సండూర్‌పవర్‌ నుంచి 12కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే సండూర్‌ పవర్‌ నుంచి వచ్చిన 12 కోట్లు వ్యాపారం చేసి సంపాదించింది కాదు. మారిషస్‌కు చెందిన ప్లూరీ ఎమర్జింగ్, 2ఐ కేపిటల్‌ నుంచి వచ్చిన 124.6కోట్ల నిధుల నుంచి కార్మెల్‌లోకి మళ్లించారు. కార్మెల్‌ ఏషియా సంస్థలో ఒక్కోషేరు ముఖవిలువ 10 రూపాయలు. కానీ తండ్రి నుంచి మేళ్లు పొందిన వివిధ కంపెనీలు 252 రూపాయల ప్రీమియం చెల్లించి మొత్తం 82కోట్ల 14 లక్షల రూపాయలు సమర్పించుకున్నాయి. అక్కడి నుంచి ఈ నిధులు కార్మెల్‌ రూపంలో జగతిలోకి వెళ్లాయి. కార్మెల్‌ నుంచి జగతిలోకి ప్రారంభ పెట్టుబడి కింద 73 కోట్ల 56 లక్షలు వెళ్లాయి.

సీఎం జగన్ ఆస్తులు రూ. 529 కోట్లు - చేతిలో రూ. 7 వేలే - CM Jagan Election Affidavit

జగతిలో ప్రారంభ పెట్టుబడి కింద ఒక్కోషేరు 10 రూపాయల చొప్పున జగన్‌ తీసుకున్నారు. ఆ తర్వాత జగతిలోకి అక్రమ వసూళ్లు చేశారు. ఒక్కోషేరు 360 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఇలా సాక్షిలోకి మొత్తం 1246కోట్లు రాబట్టారు. తాజా వివరాల ప్రకారం జగతి పబ్లికేషన్స్‌లో మొత్తం షేర్లు 10కోట్ల 65 లక్షల 58 వేల 481. ఇందులో కార్మెల్‌ ఏషియాకు ఉన్న షేర్లు 7కోట్ల 35లక్షల 81 వేల 22. అంటే జగతి పబ్లికేషన్స్‌లో కార్మెల్‌ ఏషియా వాటా 69.05శాతం. వివిధ సంస్థలకు జగతి పబ్లికేషన్స్‌లో ఒక్కో 10 ముఖవిలువ కలిగిన షేరుపై 350 ప్రీమియం వసూలు చేసి వాటాలు ఇచ్చారు. అంటే ఒక్కోషేరు విలువ 360గా ఉంది. ఈ లెక్కన జగతి పబ్లికేషన్స్‌లో కార్మెల్‌ ఏషియా సంస్థకు ఉన్న వాటా విలువ 2 వేల 648 కోట్లు అవుతుంది. అంటే కార్మెల్‌ ఏషియా సంస్థలో జగన్‌ సొంతంగా పెట్టింది 8లక్షలే అయినప్పటికీ వాస్తవ విలువ 2,648.91కోట్లు.

బెంగళూరులో స్థిరాస్తి ధరలు :బెంగళూరులోని బన్నేరుఘట్టరోడ్డులో జగన్‌కు ఐదెకరాల స్థలంలో 7 అంతస్తుల భారీ వాణిజ్య భవనం ఉంది. ఈ భవనం అప్పట్లో వైఎస్ చేసిన మేళ్లకు ప్రతిఫలంగా చౌక ధరకే జగన్‌ పరమైంది. క్లాసిక్‌ రియాల్టీ పేరిట ఉన్న ఈ భవనంలో 99.99శాతం వాటా జగన్‌ దంపతులదే. ఈ క్లాసిక్‌ రియాల్టీలో జగన్‌పెట్టుబడి విలువ 65 కోట్ల 19లక్షలు. భారతీరెడ్డి పెట్టుబడి విలువ 4కోట్ల 55లక్షలు. మొత్తం పెట్టుబడి విలువ 70 కోట్లు ఉన్నట్లు చూపించారు. ఐతే క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఆదాయ, వ్యయాల తాజా వార్షిక లెక్కల ప్రకారం గడిచిన ఏడాదికి 52 కోట్లకు పైగా లాభాన్ని చూపారు. దీనిని బట్టి ఈ భవనానికి ఉన్న వాస్తవ విలువ పరిగణలోకి తీసుకోవచ్చు. 2011 నాటికి ఈ భవనం విలువ 400కోట్లరూపాయలుపైనే ఉంటుందని అంచనా. గడిచిన 13 ఏళ్లలో బెంగళూరులో స్థిరాస్తి ధరలు భారీగా పెరిగాయి. ఈ లెక్కన ఈ భవనం విలువ ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

జగన్‌ అక్రమాస్తుల కేసు.. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

జగన్‌ ఆస్తులు 20 ఏళ్లలో గణనీయంగా పెరిగాయి. అఫిడవిట్‌లోని అంకెల్ని పరిగణలోకి తీసుకున్నా 43 వేల 405 శాతం పెరిగింది. ఏ వ్యాపారం చేస్తే ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించవచ్చో తెలిస్తే అందరూ కోటీశ్వరులు కావచ్చు. 2004లో ఆదాయపన్నుశాఖకు సమర్పించిన రిటర్నులో నికర ఆస్తుల విలువ కోటి 74 లక్షల రూపాయలుగా జగన్‌ చూపించారు. 2009 ఎన్నికలనాటికి విలువ 77కోట్ల 39 లక్షలుగా చూపారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నపుడు జగన్‌ భారీగా ఆస్తులు కూడబెట్టారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి ప్రజల వనరుల్ని కొందరికి దోచిపెట్టి, వారి నుంచి ప్రతిఫలంగా కంపెనీల్లోకి పెట్టుబడులు మళ్లించుకున్నారు. అక్రమ ప్రతిఫలాలతో చేసిన వ్యాపారాలతో ఆస్తుల విలువ 2011 నాటికి ఏకంగా 445 కోట్లకు చేరింది. అనంతరం 2019 నుంచి సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆస్తుల విలువ 510 కోట్ల నుంచి 757కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ ఐదేళ్ల కాలంలో ఆయన ఆస్తులు 48.44 శాతం పెరిగాయి.

హెటిరో-అరబిందో స'మేత' జగన్మాయ!

ABOUT THE AUTHOR

...view details