ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాపాలు చేసే వారిని ఎదుర్కోవాలంటే ప్రార్థన చేస్తే సరిపోదు: బ్రదర్ అనిల్ - Brother Anil Kumar key comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 5:20 PM IST

Updated : Apr 28, 2024, 7:42 PM IST

Brother Anil key comments: కడప రాజారెడ్డి వీధిలోని కృపా చర్చిలో క్రైస్తవ ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్ పాపాలు చేసే వారిని ఎదుర్కోవాలంటే ప్రార్థన చేస్తే సరిపోదని, వారిని తొక్కి పడేయాలని పిలుపునిచ్చారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని అందరికీ ఏసుప్రభు అండగా ఉన్నాడని వివరించారు.

Brother Anil key comments
Brother Anil key comments

Brother Anil key comments: గత ఎన్నికల్లో క్రిస్టియన్, మైనారిటీ ఓట్లతో లబ్ధి పొంది.. అధికార పీఠమెక్కిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, ఈసారి అదే ఓటర్లు గుణపాఠం చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ రాష్ట్రమంతా తిరిగి క్రిస్టియన్ల ఓట్లన్నీ వైసీపీకి వచ్చే విధంగా తన వంతు కృషి చేశారు. ఇపుడు ఆయనే వైసీపీకి వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో ఉన్న నేపథ్యంలో, ఆమె గెలుపుకోసం బ్రదర్ అనిల్ కుమార్ కడపజిల్లాలో ఫాస్టర్లు, క్రైస్తవులతో సమావేశం అవుతున్నారు. ఆదివారం కడపలో పలు చర్చిల్లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న అనిల్ కుమార్ పాపులను తొక్కి పడేయాలని, ధైర్యంగా ఉంటే ఏసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల పోటీ చేసి వైసీపీ ఓట్లను చీలుస్తారని ఈనెల 25న జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సభలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆయన అనుమానం నిజం చేసే విధంగా బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించిన అనిల్ ఇపుడు భార్య షర్మిల గెలుపు కోసం కడపజిల్లాలో మకాం వేసి క్రిస్టియన్ల ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. దేశ విదేశాల్లో క్రైస్తవ ప్రభోధకుడుగా మంచి పేరున్న బ్రదర్ అనిల్ కుమార్ మాటకు చాలా విలువ ఇస్తున్న సందర్భంలో ఆయన మాటను క్రైస్తవులు జవదాటరనే ప్రచారం ఉంది. అందులో భాగంగా రెండు రోజుల నుంచి ఆయన కడప పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్నారు. శనివారం ప్రొద్దుటూరులో ఫాస్టర్లతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అంతర్గతంగా వారితో సమావేశమై... షర్మిల గెలుపుకోసం కృషి చేయాలని కోరినట్లు తెలిసింది.


స్వార్థం కోసం ఇచ్చే ప్రభుత్వ పథకాలపై ఆధారపడొద్దు: బ్రదర్​ అనిల్​

ఇక ఆదివారం క్రైస్తవులు తప్పకుండా చర్చిలకు వెళ్తారనే ఉద్దేశంతో, కడప నగరంలోని పలు ప్రముఖ చర్చిల్లో బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేశారు. క్రైస్తవ బోధనలను వారికి వివరించారు. కడప రాజారెడ్డి వీధిలోని చర్చితో పాటు, చెమ్ముమియాపేటలో ఓ చర్చిలో అనిల్ కుమార్ బోధనలు చేశారు. చర్చికి వచ్చిన క్రైస్తవులను ఉత్తేజ పరిచే విధంగా, ఆలోచన రేకెత్తించే విధంగా అనిల్ ప్రసంగం చేశారు. బైబిల్ లో చెప్పిన వాక్యాలను ఉదహరిస్తూ అక్కడికి వచ్చిన వారికి ధర్మ సందేశం ఇచ్చారు. పాపులను విశ్వసించ వద్దని, వారిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ధైర్యంగా పోరాడితో ఏసుక్రీస్తు అండగా ఉంటారని, ఎవరూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. అపవాదు చేసిన వారికి శిక్ష తప్పదని క్రీస్తు సందేశాన్ని వినిపించారు. పాపాలు చేసిన వారిని బైబిల్ లో చెప్పినట్లుగా తొక్కి పడేయాలని సూచన చేశారు. మా కుటుంబంలో జరిగిన ఘటనల కారణంగా కొన్ని సంవత్సరాలుగా బాధ పడుతున్నామని, న్యాయం కోసం పోరాడు తున్నామన్నారు. న్యాయం జరగాలని, జరిగి తీరుతుందని ఆవేశపూరితంగా ఆయన ప్రసంగించారు. పరోక్షంగా తాజా రాజకీయ పరిణామాలను బోధన రూపంలోనే చర్చికి వచ్చిన వారికి అర్థమయ్యే విధంగా ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం క్రైస్తవులను ఉత్తేజ పరిచే విధంగా ఏసుక్రీస్తు పాటలు పాడి ఉర్రూతలూగించారు.


చర్చిలో రెండు గ్రూపులు.. పోలీస్ స్టేషన్​కు చేరిన పంచాయితీ!

Last Updated : Apr 28, 2024, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details