ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా జగన్? రాష్ట్రంలో మూత'బడు'లు - చదువులకు దూరం అవుతున్న పిల్లలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 11:17 AM IST

AP Government Closing Schools: తరగతుల విలీనం, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ కొత్త ప్రతిపాదనలవల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదంటూ సీఎం జగన్ గొప్పలు చెప్పారు. ఒక్క బడి మూతపడినా తనదే బాధ్యత అంటూ మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. తీరా సర్కార్ నిర్లక్ష్యంతో 118 ప్రాథమిక పాఠశాలలు మూతపడినా కనీసం పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు మరిన్ని పాఠశాలలను చరిత్రలో కలిపేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

AP_Government_Closing_Schools
AP_Government_Closing_Schools

AP Government Closing Schools: నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ కపట ప్రేమ చూపే ముఖ్యమంత్రి జగన్‌, ఆ వర్గాలకు చదువు అందకుండా చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడం కోసం భవిష్యత్తులో పాఠశాలల, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు తరగతుల విలీనం చేపట్టారు. ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే 3, 4, 5వ తరగతులను విలీనం చేశారు. దీన్ని 3 కిలోమీటర్ల వరకు విస్తరించేందుకూ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికల ముందు విలీనం ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఒక్క కిలోమీటరుతోనే నిలిపివేశారు.

విలీనం కోసం కిలోమీటరు దూరంలో ఉండాల్సిన 3, 4, 5 తరగతులను 3 కిలోమీటర్ల దూరం వరకూ ఉండొచ్చని విద్యా హక్కు చట్టంలో సవరణ తీసుకొచ్చారు. తరగతుల విలీనం కారణంగా 1, 2 తరగతుల్లో విద్యార్థులు తగ్గిపోయి, ఇప్పటికే 118 బడులు మూతపడ్డాయి. మరిన్ని పాఠశాలలు చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.

విలీనం చేసిన స్కూళ్లు ఎక్కువగా ఎస్సీ, బీసీ కాలనీలకు చెందినవే. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఆర్‌.ఏనుగుపల్లిలోని యల్లమెల్లివారిపేట, బెల్లంపూడి అరుంధతీయపేట ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా ఎస్సీ ప్రాంతాల్లోనివే. కారుపల్లిపాడులోని ఎంపీపీ పాఠశాల ఎస్సీ, బీసీ ప్రాంతాలకు చెందినది. వీటిల్లో చదివేవారు అందరూ పేదవారే. ఈ స్కూళ్లు మూతపడిన కారణంగా ఆయా వర్గాలకు కచ్చితంగా విద్య దూరమవుతుంది.

76 ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమైన జగన్ సర్కార్‌

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గొలుగొండపేట ప్రాథమిక పాఠశాల నుంచి గత సంవత్సరం 3, 4, 5 తరగతుల్లోని 21 మంది పిల్లలను సమీపంలోని చినపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. 1, 2 తరగతులు కలిపి 12 మంది విద్యార్థులు ఉండేవారు. గత సంవత్సరం ఇద్దరు సమీప ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిపోగా, మిగిలిన వారు ప్రైవేటు స్కూళ్లలో చేరారు. కొత్తగా ఎవరూ చేరక స్కూల్ మూతపడింది.

వాహనాల రద్దీలోనే వెళ్లాలి:డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బెల్లంపూడి అరుంధతీయపేటలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను ఊడిమూడిలోని జడ్పీ హైస్కూల్లో విలీనం చేశారు. విద్యార్థులు నిత్యం రద్దీగా ఉండే రాజవరం-పొదలాడ రహదారిలో వెళ్లాల్సి వస్తోంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

కక్షకట్టి మూసేస్తూ:నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కొలుములపేట ఎంపీపీ పాఠశాలలో 25మంది విద్యార్థులు ఉంటే 2022లో 3, 4, 5 తరగతులను చింతలచెరువు హైస్కూల్లో విలీనం చేశారు. 1, 2 తరగతుల్లో ఐదుగురు విద్యార్థులు మిగలగా, వీరు సైతం వేరే స్కూళ్లకు వెళ్లిపోయారు. గత సంవత్సరం జూన్‌లో ఇద్దరు చేరడంతో వీరిని సమీపంలోని ఎంపీపీ స్కూల్​లో చేర్పించి, స్కూల్​ను మూసేశారు.

ప్రభుత్వ బడుల్లో అదృశ్య విద్యార్థులు - గొప్పల కోసం సర్కార్​ తప్పుడు లెక్కలు

ఇద్దరు విద్యార్థులకు ఒక టీచర్‌:కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండిపర్రు పంచాయతీ పరిధిలోని డీపీ గూడెం ప్రాథమిక పాఠశాలలో 1-5వ తరగతుల్లో రెండు సంవత్సరాల కిత్రం 14 మంది పిల్లలు ఉండగా 3, 4, 5 తరగతులకు చెందిన 10 మందిని సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. ప్రస్తుతం ఈ స్కూల్​లో ఒకటి, రెండు తరగతుల్లో ఒక బాలుడు, బాలిక మాత్రమే మిగిలారు.

స్కూల్​కి పక్కా భవనం లేకపోవడంతో స్థానిక అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో ఆ ఇద్దరికి చదువు చెబుతున్నారు. ఇదే గ్రామ శివారులోని దేవానందపురంలో 14 మంది విద్యార్థులకు గాను 3, 4, 5 తరగతులకు చెందిన ఎనిమిది మందిని కొండిపర్రు యూపీ పాఠశాలలో విలీనం చేశారు. దీంతో ఈ విధానంతో విసుగు చెందిన నలుగురు విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఇద్దరే మిగిలారు. ఒక్కరు తగ్గినా ఈ స్కూళ్లు భవిష్యత్తులో కొనసాగడం అనుమానంగానే ఉంది.

ప్రాథమిక పాఠశాలలు చరిత్ర పుటల్లోకి:డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో ఆర్‌.ఏనుగుపల్లి యల్లమెల్లివారిపేటలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే మిగిలాడు. ఆ విద్యార్థికి ఉపాధ్యాయిని పాఠాలు బోధిస్తున్నారు. 2022-23లో ఇక్కడ 3, 4, 5 తరగతులకు చెందిన 13 మంది విద్యార్థుల్ని ఇదే గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న విద్యార్థి ఒక్కరే మిగిలారు.

జగనన్న సర్కారులో చదువులంటే విద్యార్థుల్లో గుండెల్లో గుబులే- శిథిలావస్థకు చేరినా పట్టించుకోని పాలకులు

కారుపల్లిపాడులోని ప్రాథమిక పాఠశాల 2021-22లో 26 మంది విద్యార్థులతో కళకళలాడేది. 2022-23లో ఐదో తరగతికి చెందిన ఎనిమిది మంది ఆరో తరగతిలోకి వెళ్లిపోవడంతో 18 మంది మిగిలారు. విలీన విధానం కారణంగా కొత్తగా ఒక్కరూ చేరకపోగా, 3, 4, 5 తరగతులను ఆర్‌.ఏనుగుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో 16 మంది వెళ్లిపోయారు. మిగిలిన ఇద్దర్ని వారి తల్లిదండ్రులు వేరే పాఠశాలలో చేర్పించడంతో గత సంవత్సరం ఈ స్కూల్ తాత్కాలికంగా మూతపడింది. ఇక్కడి ఉపాధ్యాయుడిని ఉన్నత పాఠశాలకు పంపించారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఇద్దరు విద్యార్థులు చేరటంతో ఈ పాఠశాలను తిరిగి తెరిచారు.

Education Syllabus Changes in YSRCP Government: రోజుకో భాష, సిలబస్‌.. గందరగోళంలో విద్యార్థుల భవిష్యత్​

ABOUT THE AUTHOR

...view details