Students Ties Rakhis to Trees Mahabubabad : చెట్లకు 'రక్షా బంధన్'.. మహబూబాబాద్లో వినూత్నంగా రాఖీ పండుగ
Published : Aug 31, 2023, 2:15 PM IST
Students Ties Rakhis to Trees Mahabubabad : మహబూబాద్ జిల్లా కంబాలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వృక్షా బంధన్ దివాస్ నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలకు.. చెట్లకు రక్షా బంధనం కట్టి.. తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న మొక్కలను, చెట్లను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. రక్షా బంధన్ రోజున రాఖీ కట్టి వృక్షాల సంరక్షణ తమ బాధ్యత అంటూ ప్రతిజ్ఞ పూనారు.
చెట్లు పర్యావరణానికి, మానవులకు చేస్తున్న మేలును విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేశ్బాబు తెలిపారు. చెట్ల వల్ల మనుషుల మనుగడ ఎలా కొనసాగుతోందన్న అంశాలను విద్యార్థులకు తెలియజేశామని చెప్పారు. అన్నదమ్ముల రక్షణ మేరకు ఎలా వారికి రాఖీ కడతామో చెట్లకు కూడా రాఖీ కట్టి వాటి సంరక్షణ బాధ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించామని వెల్లడించారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని వాటి సంరక్షణ చూసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రిన్సిపాల్ సూచించారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ఇలాంటి అవగాహన కల్పిస్తే వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుందని వెల్లడించారు. గత 15 ఏళ్లుగా ఆ వృక్ష రక్షాబంధ్ దివస్ జరుపుతున్నట్లు చెప్పారు.