Bhatti on Telangana Governament : 'రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా కనీస వేతన బోర్డు సమీక్ష చేయలేదు'
Bhatti Vikramarka Fires on Telangana Governament : హైదరాబాద్ గాంధీభవన్లో అసంఘటిత కార్మిక, ఉద్యోగులతో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా.. వారి హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని తీసుకువచ్చిందని భట్టి గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా.. కనీస వేతన బోర్డును సమీక్ష చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని దుయ్యబట్టారు. ఔట్ సోర్సింగ్ విధానంతో శ్రమ దోపిడికి పాల్పడుతున్న.. రాష్ట్ర సర్కార్ను కార్మికులు నిలదీయాలని పిలుపునిచ్చారు. మరోవైపు కన్స్ట్రక్షన్ కంపెనీలు కడుతున్న సెస్ను.. కార్మికల కోసం ఖర్చుపెట్టకుండా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రెటరీ మన్సూర్ అలీ ఖాన్, కాంగ్రెస్ క్యాంపెన్ కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్, అంజన్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.