ETV Bharat / state

Krishna Ella : ఎగుమతికి గిరాకీ ఉన్న పంటలే పండించాలి

author img

By

Published : Sep 2, 2021, 7:40 AM IST

bharat-biotech-cmd-dr-krishna-ella-on-agriculture-methods-in-india
bharat-biotech-cmd-dr-krishna-ella-on-agriculture-methods-in-india

విలువ ఆధారిత ఉత్పత్తులపై భారత్​ దృష్టిపెట్టాలని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల(Krishna Ella) అన్నారు. ఆవిష్కరణలతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వ్యవసాయ పట్టాతో పాటు విద్యార్థులకు నైపుణ్యం అవసరం అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని నార్మ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

విదేశాల్లో డిమాండు ఉండి ఎగుమతికి అవకాశమున్న పంటలను మనదేశంలో అధికంగా పండించాలని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల(Krishna Ella) సూచించారు. ఉదాహరణకు దానిమ్మ, జామ పండ్లను అమెరికా, ఐరోపా ప్రజలు తింటారని, ఇలాంటివాటిని ఎక్కువగా పండిస్తే ఎగుమతులు పెరుగుతాయన్నారు. అలాగే పంటలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి అధిక ఆదాయం పొందే మార్కెటింగ్‌ మెలకువలు పెంచుకోవడం అవసరమని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ‘జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ’ (నార్మ్‌) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

  • వ్యవసాయ డిగ్రీ అనేది బహుళ లక్ష్యాలున్న డిగ్రీ. పట్టా ఉంటే సరిపోదు, నైపుణ్యం ఉండాలి. అమెరికా, చైనాల్లో సైన్స్‌ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యం ఉంది. మన విద్యార్థులకు మంచి పరిజ్ఞానం ఉంది. కానీ నైపుణ్యం తక్కువ. ఐటీ, పోలీసు, ఐఏఎస్‌ సర్వీసుల్లోనూ ఎక్కువ మంది వ్యవసాయ పట్టభద్రులున్నారు.
  • ప్రపంచ జనాభా పెరుగుతోంది. ఆహార కొరత ఏర్పడుతోంది. ఆవిష్కరణల్లో భారత్‌ 48వ ర్యాంకులో ఉంది. రాబోయే 10 ఏళ్లలో ఆవిష్కరణలు చేసే వారే అభివృద్ధి చెందుతారు. భారతీయ కుటుంబాలు పిల్లలకు విద్య, ఉద్యోగం ముఖ్యం అంటున్నాయి. కానీ ఇన్నోవేషన్స్‌ వైపు వారిని మళ్లించాలి.
  • మనదేశంలో పంటల దిగుబడులు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు ధాన్యం దిగుబడిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. కానీ ఉత్పాదకత (ఎకరానికి ఎంత పండుతోంది?) అనే విషయంలో 54వ ర్యాంకులో ఉన్నాం.
  • వంటనూనెలు మనదేశంలో తక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు కొబ్బరి నూనె మంచిది కాదని హార్వర్డ్‌ వర్సిటీ కూడా చెప్పింది. దానిని నిత్యం వంటల్లో వాడే కేరళ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అది మంచిదని ఐరోపా కూడా చెబుతోంది. మునక్కాయలు అద్భుత ఆహారమని అమెరికా, ఐరోపాల్లో చెబుతున్నారు. గోంగూర పచ్చడి రక్తపోటును తగ్గిస్తుంది. వీటి చుట్టూ సైన్స్‌ పెరగలేదు. అశ్వగంధను అమెరికా ఎప్పుడూ పెంచలేదు. కానీ అశ్వగంధ ఉత్పత్తులను అమెరికాలోని మిడ్‌ వెస్ట్‌ రాష్ట్రాలు ఎగుమతి చేస్తున్నాయి.
  • కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. ఆ జిల్లాలో పాడి, పంటలతో మిశ్రమ సేద్యం చేయడమే అందుకు కారణం. అవి లేని ఇతర జిల్లాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
  • మన పంటల దిగుబడిలో 20 శాతాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ఇక్కడ కూడా ధరలు పెరిగి రైతులకు అధిక ఆదాయం వస్తుంది.

శాస్త్రీయ ఆధారాలతోనే కొత్త బ్రాండ్లు

ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ త్రిలోచన్‌ మహాపాత్ర మాట్లాడుతూ ‘ఆధునిక ఇన్నోవేటివ్‌ ఇండియా’కు భారత్‌ బయోటెక్‌(Krishna Ella) ఉదాహరణ అన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలు ఉంటే విలువ ఆధారిత ఉత్పత్తులు వస్తాయని పేర్కొన్నారు. అంతకుముందు ఆన్‌లైన్‌ ద్వారా పలువురికి పురస్కారాలను ప్రదానం చేశారు. నార్మ్‌ సంచాలకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మన రైతులు పండించే పంటలకు బ్రాండ్‌ విలువ పెంచాలి. ఉదాహరణకు మనదేశంలో పండే ఆవాలను కెనడా దిగుమతి చేసుకుని వాటితోనే కెనోలా అనే పేరుతో నూనె ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అదే నూనెను కెనడా నుంచి మన దేశంలోకి తెచ్చుకుంటున్నాం. బ్రాండ్‌ సృష్టించడం ద్వారా ఆ దేశం ఆదాయం పొందుతోంది. ఇలా మన పంటలకు ఒక బ్రాండ్‌ సృష్టించి మనమే ప్రపంచ మార్కెట్లోకి తీసుకెళ్లాలి.

కొవాగ్జిన్‌కు త్వరలో డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు

కొవాగ్జిన్‌ టీకాకు త్వరలో ప్రపంచ ఆరోగ్యసంస్థ గుర్తింపు రాబోతోందని డాక్టర్‌ కృష్ణ ఎల్ల(Krishna Ella) చెప్పారు. ఐసీఏఆర్‌- నార్మ్‌ 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ‘ఇన్నోవేషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ గుర్తింపు త్వరలోనే వస్తుందని చెప్పారు. ‘2-3 వారాల్లో డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు రావచ్చు, దానిపై మేం పనిచేస్తున్నాం’ అన్నారు. టీకాలపై అంతర్జాతీయంగా ఎన్నో రాజకీయాలు ఉంటాయని, వివిధ దేశాలు తమ టీకాలే ప్రపంచం అంతా వాడాలనే ఆలోచన చేస్తాయని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.