ETV Bharat / state

Mahatma Gandhi: ఆ గ్రామంలో ఏ శుభకార్యమున్నా మొదటి పూజ మాత్రం మహాత్ముడికే...

author img

By

Published : Oct 2, 2021, 4:30 PM IST

దేశానికి స్వాతంత్య్రం ప్రసాదించిన గాంధీ మహాత్ముడిని దేశమంతా జయంతి రోజున కీర్తిస్తుంది. కానీ ఆ గ్రామం మాత్రం నిత్యం స్మరిస్తూనే ఉంటుంది. అన్ని గ్రామాల్లో గ్రామ దేవతలు, కుల దైవాలను ముందు పూజిస్తారు. కానీ ఆ పల్లెలో మాత్రం జాతిపితకు పూజలు చేస్తారు. ఏ శుభకార్యం చేయాలన్నా ముందు మహాత్ముడినే పూజిస్తారు. ఆయన నమ్మిన శాంతి, సహనం బాటలో గ్రామస్థులు నడుస్తున్నారు. భావి తరాలకు గాంధీ సిద్ధాంతాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవేయండి.

Mahatma Gandhi
Mahatma Gandhi

సాధారణంగా ఏ ఇంట్లో అయినా శుభకార్యం చేయాలనుకుంటే ముందు ఇంటి దేవుడికి లేదంటే కులదేవతకు పూజలు చేస్తారు. పెళ్లిళ్లు వంటి కార్యాలకు సైతం గ్రామ దేవతలను మొదటగా పూజిస్తారు. కానీ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో గ్రామ దేవుడైన లక్ష్మీనరసింహస్వామితో పాటు మహాత్మా గాంధీని సైతం అంతే సమానంగా పూజిస్తారు. దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రం ప్రసాదించిన మహాత్ముడిని పూర్వకాలం నుంచి ఆ గ్రామస్థులు దైవంగా భావించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. మహాత్ముడి స్మరణతో గ్రామం సుభిక్షంగా ఉండి... భావితరాలు స్వేచ్ఛా వాయువులతో జీవిస్తారని నర్సింగాపూర్ గ్రామస్థులు నమ్ముతారు.

గాంధీ మహాత్ముడికి పూజలు చేస్తున్న నర్సింగాపూర్ గ్రామస్థులు

నర్సింగాపూర్ గ్రామంలో మెుత్తం 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. 1200పైగా జనాభా ఉండగా.. 800కు పైగా ఓటర్లు ఉన్నారు. 1961లో మహాత్ముడి విగ్రహాన్ని ఈ గ్రామంలో ప్రతిష్ఠించినట్లు సర్పంచ్ నర్సయ్య తెలిపారు. అప్పటి నుంచి గాంధీ వర్ధంతి జయంతీలతో పాటు శుభకార్యాలకు సైతం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి శుభకార్యానికి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో ఊరేగింపుగా వెళ్తామని తెలిపారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశాక... పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి పూజిస్తామని పేర్కొన్నారు.

ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే ప్రతిఒక్కరు ఇంటి దేవుడికి లేదంటే కులదేవతకు పూజలు చేస్తారు. కానీ మా గ్రామస్థులం 1961 నుంచి మహాత్ముడిని దేవుడిగా భావించి ప్రతి శుభకార్యానికి ముందు పూజించడం ఆనవాయితీగా వస్తోంది. దేశానికి స్వేచ్ఛా స్వతంత్రం ప్రసాదించిన మహాత్ముడిని దైవంగా భావిస్తూ వస్తున్నాము. అందుకే మా గ్రామం సుభిక్షంగా ఉందని నమ్ముతున్నాము. -నర్సయ్య నర్సింగాపూర్ సర్పంచ్

మా గ్రామంలో 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. 1200పైగా జనాభా ఉండగా.. 800కు పైగా ఓటర్లు ఉన్నారు. 1961 నాటి గ్రామ పెద్దలు మహాత్ముడి విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నర్సింగాపూర్ గ్రామంలో వర్ధంతి జయంతిలతోపాటు శుభకార్యాలకు సైతం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తాము. దేశమంతా గాంధీ జయంతి, వర్ధంతిలకు పూలమాలతో నివాళులర్పిస్తారు. కానీ మా గ్రామస్థులు వాటితో పాటుగా ఇతర శుభకార్యాలకు సైతం పూజిస్తారు. ప్రతి జయంతికి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో ఊరేగింపుగా వెళ్తాము. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేస్తాము. ఆ తర్వాత పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి పూజిస్తాము. -రాజేశ్వర్, నర్సింగాపూర్ ఉప సర్పంచ్

శుభకార్యాలకు గాంధీజీని పూజించడం తమ గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, వ్రతాలు.. ఇలా ఏ పూజ చేయాలనుకున్నా మొదటి పూజ మాత్రం మహాత్ముడికే దక్కుతుంది. మన స్వేచ్ఛకు కారణమైన గాంధీని దేవుడిగా భావించడం వల్లే తమ గ్రామంలో శాంతి, సహనం నెలకొందని మేము నమ్ముతాము. గాంధీని దేవుడిగా పూజించడం కారణంగా గ్రామస్థుల మధ్య ఐకమత్యం ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామం సుభిక్షంగా ఉంటుంది. -గంగాధర్ నర్సింగాపూర్ గ్రామస్థుడు

ఇదీ చదవండి: మహాత్మా గాంధీకి ప్రముఖుల నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.