ETV Bharat / state

Bhatti Vikramarka fires on BRS : 'దొరల ప్రభుత్వం వద్దు ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందాం'

author img

By

Published : Jun 19, 2023, 7:19 PM IST

Bhatti Vikramarka
Bhatti Vikramarka

Bhatti Vikramarka Comments on CM KCR : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ... పార్టీల మధ్య విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాలుగు కోట్ల ప్రజలను తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దివాళా తీయించారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

Bhatti Peoples March Padayatra in Nalgonda : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తనదైన శైలిలో ప్రణాళికలు రూపొందించి ప్రజలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తుంది. మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుండగా... మరోవైపు ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేపట్టారు.

Bhatti Vikramarka fires on BRS : ఇవాళ 96వ రోజులో భాగంగా నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోకి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రవేశించింది. నియోజకవర్గంలోని తాటికల్ చేరుకున్న భట్టి విక్రమార్కకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తాటికల్​లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్​లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన భట్టి... బీఆర్​ఎస్, సీఎం కేసీఆర్​ను ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పందికొక్కుల్లాగా బీఆర్​ఎస్ పాలకులు ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దొరల ప్రభుత్వం వద్దు ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందామన్నారు. నాలుగు కోట్ల ప్రజలను తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దివాళా తీయించారని ధ్వజమెత్తారు.

'ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా బీఆర్​ఎస్ ప్రభుత్వం దగా చేస్తోంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువులు రాక విద్యార్థి, నిరుద్యోగులు గడ్డాలు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్లను ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రుల ఆశలను కేసీఆర్ సర్కార్ నిరాశకు గురి చేస్తోంది. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తరుగు పేరిట క్వింటాకు 12 కిలోలు కోత విధిస్తూ రైతులను నిలువున ముంచుతున్న దళారుల ప్రభుత్వం బీఆర్ఎస్​ది.'-భట్టివిక్రమార్క, సీఎల్పీ నాయకుడు

తాము అధికారంలోకి రాగానే 2లక్షల రుణమాఫీ : బీఆర్​ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో ఇంటికొక్క కొలువు రాలేదన్న భట్టి... విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్ అమలు కావడం లేదన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇవ్వగా.. ఇప్పుడు ఒకరికి కోత పెట్టి ఒకరికే ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ప్రజల సంపద జనాలకు పంచడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న భట్టి విక్రమార్క... రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్దిదారులందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

'మేము అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేస్తాం. కూలీలకు ఏడాదికి 12వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఎల్​కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీని రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం. ఇళ్ల స్థలాలు లేని పేదలను గుర్తించి వారికి స్థలాలు కొనుగోలు చేసి ప్లాట్లను పంపిణీ చేస్తాం.'-భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.