ETV Bharat / state

మినీ ట్యాంక్​బండ్​ల నిర్మాణాల్లో జాప్యం​

author img

By

Published : Dec 11, 2020, 3:52 PM IST

నీరుగారిపోతున్న సర్కారు సంకల్పం... మినీ ట్యాంక్​బండ్ నిర్మాణాల్లో జాప్యం​
నీరుగారిపోతున్న సర్కారు సంకల్పం... మినీ ట్యాంక్​బండ్ నిర్మాణాల్లో జాప్యం​

నియోజకవర్గానికో మినీ ట్యాంక్ బండ్ నిర్మించి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 11 చెరువులను మినీట్యాంక్ బండ్​లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మూడు చోట్ల మాత్రమే పూర్తయ్యాయి. నిధుల జాప్యంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకురావడం లేదు. వాకింగ్, సైక్లింగ్, బోటింగ్, విద్యుద్దీపాల ఆలంకరణతో కళకళలాడాల్సిన తటాకాలు వెలవెలబోతున్నాయి.

నీరుగారిపోతున్న సర్కారు సంకల్పం... మినీ ట్యాంక్​బండ్ నిర్మాణాల్లో జాప్యం​

హైదరాబాద్‌ ట్యాంక్​బండ్‌లా ప్రతి నియోజకవర్గంలో మినీ ట్యాంక్​బండ్ నిర్మించాలన్న సర్కారు సంకల్పం... క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో మినీట్యాంక్​బండ్ నిర్మాణాలు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుంటే... మరికొన్నిచోట్ల ఏళ్లుగడుస్తున్నా పూర్తవడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఐదున్నర కోట్ల వ్యయంతో 2017లో మినీట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టారు. పెద్దచెరువుపై కోటిన్నర ఖర్చు చేసి కట్ట బలోపేతం, వెడల్పు పెంచడం, పూడిక తీత, జంగిల్ కటింగ్ వంటి పనులు చేపట్టారు. ఆ తర్వాత గుత్తేదారు పనుల్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. మరో గుత్తేదారుకు అప్పగించినా పనులు మొదలు కాలేదు. చేసిన పనులు మళ్లీ మొదటికొచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అక్కడక్కడా.. అరకొరగా..

నారాయణపేట జిల్లా మరికల్‌లో నాలుగున్నర కోట్లతో మినీట్యాంక్‌బండ్ కోసం పని ప్రారంభించారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో వివిధ పనులు చేశారు. రోడ్డు నిర్మాణం, అలుగు, తూముల మరమ్మతులు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు సహా సుందరీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. బిల్లులు రాక పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి చేస్తున్నారు. మక్తల్‌లో నిర్మిస్తున్న మినీ ట్యాంక్​బండ్ నిర్మాణం దాదాపుగా పూర్తైందని అధికారులు చెబుతున్నా.. కొన్ని పనులు చేయాల్సి ఉంది.

కేవలం మూడు చోట్లే...

మినీట్యాంక్​బండ్‌లలో కట్టవెడల్పు 6 మీటర్ల వరకు పెంచాలి. ప్రతి బండ్‌కు బతుకమ్మ ఘాట్, బోటింగ్ కోసం జెట్టి తప్పనిసరిగా ఉండాలి. ఆహ్లాదం కోసం పార్కులు, పిల్లలు ఆట వస్తువులు ఏర్పాటు చేయాలి. ఆ వసతులతో మూడు చోట్ల మాత్రమే నిర్మాణాలు పూర్తికాగా మిలిగిన చోట్ల మందకోడిగా సాగుతున్నాయి. మహబూబ్​నగర్‌లో పూర్తి కాగా, దేవరకద్ర, జడ్చర్లలో అసంపూర్తిగా ఉన్నాయి. గద్వాలో పూర్తి కాగా.. అయిజలో పూర్తి కావాల్సి ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్, అచ్చంపేట పనులు నత్తనడకన సాగుతున్నాయి. వనపర్తిలో 60శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది.

సకాలంలో నిధులు రాకపోవడం, చెరువులు నిండటం, గుత్తేదారులు, అధికారుల అలసత్వంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మినీట్యాంక్​బండ్​లు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి.

ఇదీ చూడండి: కూరగాయలు, పండ్లపై దృష్టి పెట్టాలి.. లేకపోతే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.