ETV Bharat / state

నీరా రుచి చూసిన వైఎస్ షర్మిల.. 3,800 కి.మీ పాదయాత్ర పూర్తి

author img

By

Published : Feb 16, 2023, 4:49 PM IST

YS Sharmila Padayatra
YS Sharmila Padayatra

YS Sharmila Padayatra in Mahabubabad : వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర 3,800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో ప్రవేశించిన షర్మిల పాదయాత్ర పెద్దవంగర మండలం అవుతపురం వద్ద 3,800 కి.మీ. చేరుకుంది. ఇదిలా ఉంటే పాలకుర్తి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

YS Sharmila Padayatra in Mahabubabad : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర 3,800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇవాళ 238వ రోజు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతపురం గ్రామం వద్ద షర్మిల 3,800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. అనంతరం అవుతపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వై.ఎస్‌. విగ్రహాన్ని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఆవిష్కరించారు. విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడానికి కొందరు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారని ఆమె ఆరోపించారు.

అవుతపురం గ్రామ ప్రజలు బీఆర్ఎస్ నేతల ఆగడాలను అడ్డుకొని వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై షర్మిల హర్షం వ్యక్తం చేశారు. విగ్రహ ఆవిష్కరణలో పాలుపంచుకున్న మహిళలు, గ్రామ ప్రజలకు ఆమె అభినందనలు తెలిపారు. కొందరు అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన రాత్రంతా చలిమంటలు వేసుకుని విగ్రహాన్ని కట్టించిన అవుతపురం గ్రామస్థులకు వైఎస్సార్ బిడ్డ తోడుగా ఉంటుందన్నారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరిన షర్మిల మహబూబాబాద్ జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం : నిన్న జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో 237వ రోజు ప్రారంభమైన షర్మిల పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బుధవారం శాంతపురం ఎక్స్ రోడ్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తొర్రూరు, లక్ష్మీనారాయణ పురం, పాలకుర్తి, దరిదేపల్లి, మల్లంపల్లి, వావిలాల, నారబోయిన గూడెం మీదుగా పాదయాత్ర కొనసాగింది. అయితే లక్ష్మీనారాయణ పురం స్టేజి వద్ద కల్లు గీత కార్మికుని కోరిక మేరకు షర్మిల నీరా రుచి చూసింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చింది.

సీఎం కేసీఆర్‌ 8 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర చేశారు. రైతులు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతన పెన్షన్ల కోసం 11 లక్షల మంది ఎదురుచూస్తున్నారని... కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కనీసం ఒక్క డిగ్రీ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక 3 వేల రూపాయల పెన్షన్, నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వైఎస్సార్ సంక్షేమ పాలనను తిరిగి తెస్తామని వైఎస్ షర్మిల హామీనిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.