ETV Bharat / state

Huzurabad Notification: హుజూరాబాద్ ఉపఎన్నికకు నేడే నోటిఫికేషన్ విడుదల

author img

By

Published : Oct 1, 2021, 5:03 AM IST

Updated : Oct 1, 2021, 6:45 AM IST

Huzurabad Notification
హుజూరాబాద్ ఉపఎన్నిక

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హుజూరాబాద్ ఉపఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ (Huzurabad By Election Notification) విడుదల కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్‌ ఆర్డీఓ రవీందర్‌రెడ్డి (Rdo Ravinder Reddy)ని రిటర్నింగ్ అధికారిగా నియమించిన ఈసీ... కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ర్యాలీలు రోడ్‌షోకు అనుమతి లేనందున కచ్చితంగా ఎన్నికల కమిషన్ సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థికి చెందిన నేరచరిత్రను పత్రికల్లో విధిగా ప్రకటనలు ఇవ్వాలని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ (Ec Officer Rv Karnan) ఆయా పార్టీలకు సూచించారు. కరీంనగర్ ఎస్​ఆర్​ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ ఉపఎన్నిక(Huzurabad By Election Notification)కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. ఈనెల 8 వరకు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలనతో పాటు ఉపసంహరణకు ఈనెల 13వరకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 30న పోలింగ్‌ జరగనుండగా నవంబర్‌ 2న ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు. ఉపపోరుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నిబంధనలను వివరించారు.

క్రిమినల్ కేసులు ఉంటే...

పోటీ చేసే అభ్యర్థులకు నగదు రూపకంగా డబ్బులు ఇవ్వొద్దని, చెక్కులు, డీడీలు, ఆన్​లైన్ క్యాష్‌ ట్రాన్స్​ఫర్ మాత్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా నుంచే ఎన్నికల ఖర్చు లావాదేవీలు నిర్వహించాలని తెలిపారు. ప్రకటన విడుదలైన తేదీ నుంచి వారంలోపు ప్రచారానికి వచ్చే స్టార్ క్యాంపెయిన్‌ల జాబితాను అందించాలని సూచించారు. ఎన్నికల ఖర్చు వివరాలను రోజువారీగా ఎన్నికల పరిశీలకుడికి అందించాలని తెలిపారు. ఎన్నికల ఖర్చులపై ఎఫ్​ఎస్​టీ (FST), ఎస్​ఎస్​టీ (SST), వీవీటీ (VVT) బృందాల నిఘా ఉంటుందని చెప్పారు. అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే సమాచారం ఇవ్వాలని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ తెలిపారు.

అనుమతి లేదు...

ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను అభ్యర్థులు.. రాజకీయ పార్టీలు కచ్చితంగా పాటించాలని సూచించారు. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటే బహిరంగ సభలు అయితే 1,000 మంది వరకు ఇండోర్ సమావేశాలకు 200 మందికి మించకుండా.. సాధారణ సమావేశాలకు 500 మందికి మించకుండా సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. రోడ్​షోలకు ద్విచక్రవాహన ర్యాలీలకు అనుమతి లేదని వెల్లడించారు. అభ్యర్థి, అతని రాజకీయ పార్టీ 20 వాహనాలను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.

తొలగింపు...

నియోజకవర్గ పరిధిలోని పురపాలక సంస్థలు గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పథకాలకు చెందిన ప్రకటనలు ఏమైనా ఉంటే తొలగించాలని.. హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి (Rdo Ravinder Reddy) సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో హోర్డింగులతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన బ్యానర్లను ప్రభుత్వ కార్యాలయాల వద్ద నుంచి అధికారులు తొలగించారు.

Last Updated :Oct 1, 2021, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.