ETV Bharat / state

DALITHABANDHU: దళితబంధు అర్హుల కోసం హుజూరాబాద్​లో సర్వే ప్రారంభం

author img

By

Published : Aug 27, 2021, 5:12 PM IST

DALITHABANDHU: హుజూరాబాద్​ నియోజకవర్గంలో దళితబంధు సర్వే ప్రారంభం
DALITHABANDHU: హుజూరాబాద్​ నియోజకవర్గంలో దళితబంధు సర్వే ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం సర్వే హుజూరాబాద్​ నియోజకవర్గంలో ప్రారంభమైంది. నియోజకవర్గంలోని మండలాల్లో ఈ సర్వేను అధికారులు ప్రారంభించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సర్వే పూర్తవుతుందన్నారు.

కరీంనగర్‌ జిల్లా హజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకం సర్వే ప్రారంభమైంది. నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్​, ఇల్లందకుంట మండలాల్లో అధికారులు ఈ సర్వేను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దళిత కాలనీల్లో ప్రజలు ఊరేగింపులు నిర్వహించారు. ఆనందంతో టపాసులు కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేశారు. అధికారులు ఇంటింటా తిరిగారు. దళిత కాలనీలోని కాలనీవాసులతో మాట్లాడి వారి నుంచి వివరాలు సేకరించారు. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఐదుగురు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. 30 క్లస్టర్‌ అధికారులు, 130 మంది ప్రత్యేకాధికారులు, మరో 130 మంది సహాయక అధికారులతో పాటు ఇతర సిబ్బంది కూడా ఈ సర్వేలో పాల్గొన్నట్లు ఆర్డీవో రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. మొత్తం 450 మంది సిబ్బంది సర్వే చేస్తున్నట్లు చెప్పారు. సర్వే ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు వివరించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సర్వే పూర్తవుతుందన్నారు. సర్వే నివేదికలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి రోజూ ప్రతి మండలంలో 450 నుంచి 500 కుటుంబాల వరకు సర్వే చేస్తామన్నారు.

ఇదీ చదవండి: DALITHABANDHU: ''దళితబంధు'తో దళితుల్లో ఆ నమ్మకం కనబడుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.