ETV Bharat / state

Cabinet Meeting: నేడు కేబినెట్ భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై ఇక తుది నిర్ణయం..!

author img

By

Published : Apr 12, 2022, 4:49 AM IST

Updated : Apr 12, 2022, 5:31 AM IST

నేడు కేబినెట్ భేటీ.. ధాన్యం కొనుగోళ్లే ప్రధాన ఎజెండా
నేడు కేబినెట్ భేటీ.. ధాన్యం కొనుగోళ్లే ప్రధాన ఎజెండా

Cabinet Meeting: వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వం నేడు నిర్ణయం ప్రకటించనుంది. ధాన్యం కొనుగోళ్ల అంశమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. కొనుగోళ్ల అంశాన్ని తేల్చాలంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గడువు ఈ మధ్యాహ్నంతో తీరనుంది. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించి.. ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

Cabinet Meeting: రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం ప్రగతిభవన్ వేదికగా భేటీ జరగనుంది. వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపైనే సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రంలో గ్రామస్థాయి మొదలు ఆందోళనలు, దీక్షలు చేపట్టారు. సోమవారం దిల్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు నిరసన దీక్ష చేశారు.

నేడు కేబినెట్ భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై ఇక తుది నిర్ణయం..!

మధ్యాహ్నంతో ముగియనున్న గడువు..

యాసంగి సీజన్​కు సంబంధించి ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం ఇప్పటికే పలు దఫాలుగా ప్రకటించింది. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో ఉప్పుడు బియ్యమే వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రంతో చర్చలు జరిపింది. ఉప్పుడు, ముడి అన్న తేడా లేకుండా రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. 24 గంటల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని తేల్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వేదికగా డిమాండ్ చేశారు. ఆ గడువు ఇవాళ మధ్యాహ్నంతో ముగియనుంది.

ఉప్పుడు బియ్యం తీసుకునేదే లే..

సీఎం ప్రసంగం అనంతరం దిల్లీలో కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంషు పాండే, హైదరాబాద్​లో ఎఫ్​సీఐ ప్రాంతీయ జనరల్ మేనేజర్ దీపక్ మిశ్రా మీడియా సమావేశం నిర్వహించి కొనుగోళ్ల అంశంపై మరోమారు స్పష్టత ఇచ్చారు. ఉప్పుడు బియ్యం తీసుకోబోమని తేల్చి చెప్పిన అధికారులు.. ముడి బియ్యానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని పేర్కొన్నారు.

ముడి బియ్యం ఇచ్చే అవకాశం ఉందా..?

ఈ పరిస్థితుల్లో మధ్యాహ్నం సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం.. ధాన్యం కొనుగోళ్ల అంశంపై విస్తృతంగా చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అనుసరించాల్సిన వైఖరిపై దృష్టి సారించనున్నారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం అంటున్న పరిస్థితుల్లో ఏం చేయాలన్న విషయమై మంత్రిమండలిలో చర్చిస్తారు. కేంద్రం కోరుతున్నట్లు ముడి బియ్యం ఇచ్చే అవకాశం ఉందా..? లేదా..? ఒకవేళ ఉంటే ఏం చేయొచ్చు.. ఎంత వ్యత్యాసం వస్తుంది.. అన్న అంశాలపై చర్చిస్తారు. కేంద్రంతో సంబంధం లేకుండా ధాన్యం సేకరించి మిల్లర్లు లేదా ఎగుమతిదారులకు విక్రయించే అవకాశం ఏ మేరకు ఉందన్న విషయమూ కేబినెట్​లో చర్చించనున్నారు. అలా చేస్తే ఎంత మేర భారం పడనుందన్న విషయమై అంచనా వేయనున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ధాన్యం కొనుగోళ్లపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

అలా చేద్దామా..

రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లు, ఎగుమతిదారులకు విక్రయించండం.. కేంద్రం అడుగుతున్నట్లుగా ముడి బియ్యాన్ని ఇచ్చి మిగిలిన భారాన్ని భరించడం లాంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటే.. పౌర సరఫరాల సంస్థ ద్వారా సేకరణకు అనుగుణంగా అవసరమైన నిధులను రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంపైనా కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అనుసరించాల్సిన వ్యూహంపైనా భేటీలో చర్చించే అవకాశం ఉంది.

ముఖాముఖి ఎత్తేద్దామా..!

గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ముఖాముఖి ఎత్తి వేయాలన్న ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మంత్రివర్గంలో ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఇతర పాలనాపరమైన, రాజకీయపరమైన అంశాలూ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

KCR 24 HOURS DEADLINE: కేంద్రానికి కేసీఆర్ 24 గంటల డెడ్​లైన్

పాక్​ కొత్త ప్రధానిగా షెహబాజ్- కశ్మీర్​పై కీలక వ్యాఖ్యలు

Last Updated :Apr 12, 2022, 5:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.