ETV Bharat / state

చకచకా నూతన సచివాలయ పనులు.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి

author img

By

Published : Nov 5, 2022, 6:55 AM IST

Telangana new secretariat: రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణంలో కీలకమైన పెద్దగుమ్మటాల పనులు ప్రారంభమయ్యాయి. జాతీయ చిహ్నాన్ని ఉంచే భారీ గుమ్మటం స్టీల్ నమూనాను బిగించారు. అవసరమైన తనిఖీలు పూర్తయ్యాక సంబంధించిన కాంక్రీట్ పనులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత మరో పెద్దగుమ్మటం పనులు కూడా ప్రారంభిస్తారు. మరోవైపు భవనం ముందుభాగం ఎలివేషన్, ఇంటీరియర్ పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయి.

Telangana new secretariat
Telangana new secretariat

చకచకా సాగుతున్న నూతన సచివాలయ పనులు

Telangana new secretariat: రాష్ట్రంలో కొత్త సచివాలయ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు జరుగుతున్నాయి. భవనం అంతస్థులకు సంబంధించిన ప్రధాన కాంక్రీట్ పనులన్నీ కూడా గతంలోనే పూర్తయ్యాయి. ప్రస్తుతం భవనం ముందుభాగం ఎలివేషన్ పనులతో పాటు భవనంపైన గోపురాల పనులు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ దోల్‌పూర్‌ నుంచి తీసుకొచ్చిన ఎర్ర ఇసుకరాతితో ఫ్రంట్ ఎలివేషన్ పనులు చేస్తున్నారు.

ఈ పనుల కోసం రాజస్థాన్ నుంచే ప్రత్యేకంగా కూలీలను తీసుకొచ్చారు. ఇసుకరాయిని అవసరమైన నమూనాగా సిద్ధం చేసుకొని వాటిని అమర్చాల్సి ఉంటుంది. ఇందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని.. ఇప్పటికే చాలా భాగం పూర్తైనట్లు చెబుతున్నారు. అటు భవనం పైభాగాన ఆకర్షణీయంగా గుమ్మటాలను ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయంపైన మొత్తం 34 గుమ్మటాలు రానున్నాయి. ఇవన్నీ కూడా వివిధ పరిమాణాల్లో ఉన్నాయి.

అత్యంత చిన్న గుమ్మటం వ్యాసం 23 అడుగులు కాగా.. 27, 33 అడుగుల వ్యాసంతో ఇతర గుమ్మటాలు ఉన్నాయి. ఈ పరిమాణాలతో ఉండే 32 గుమ్మటాలను ఇప్పటికే సచివాలయం పైభాగాన ఏర్పాటు చేశారు. అందులో కొన్నింటికి సంబంధించిన కాంక్రీట్ పనులు పూర్తి కాగా.. మిగతా గుమ్మటాల పనులు కొనసాగుతున్నాయి. భవనం పైన ముందు, వెనకభాగాల్లో తూర్పు, పశ్చిమవైపున రెండు భారీ గుమ్మటాలు రానున్నాయి. ఈ రెండు 54 అడుగుల వ్యాసంతో, 27 అడుగుల ఎత్తుతో భారీ పరిమాణంలో ఉంటాయి.

వీటిపై జాతీయ చిహ్నాలు ఏర్పాటు చేస్తారు. రెండు పెద్దగుమ్మటాల్లో ఒకదాని స్టీల్ నమూనాను ఇవాళ భవనంపై బిగించారు. భారీ క్రేన్ సాయంతో గుమ్మటం స్థానానికి దాన్ని చేర్చారు. గుమ్మటాల నిర్మాణ పనుల్లో ఇదొక కీలకమైన పని. స్టీల్ నమూనాకు సంబంధించిన వెల్టింగ్ సహా ఇతరత్రా తనిఖీలు చేస్తారు. చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే సరిచేస్తారు. ఆ తర్వాత స్టీల్ గుమ్మటంపైన కాంక్రీట్ పనులను ప్రారంభిస్తారు. 20 టన్నుల బరువున్న స్టీల్ నమూనాపై 800 టన్నుల కాంక్రీట్ తో గుమ్మటాన్ని నిర్మిస్తారు.

ఈ పని వారం రోజులకు పైగా పడుతుందని అంచనా. ఒక గుమ్మటం పని పూర్తయ్యాక మరో గుమ్మటం పనిని కూడా ప్రారంభిస్తారు. ఈ రెండు భారీ గుమ్మటాలు పూర్తైతే సచివాలయ భవన నిర్మాణంలో మేజర్ కాంక్రీట్ పనులు పూర్తైనట్లేనని చెప్తున్నారు. ఇక చిన్న చిన్న నిర్మాణ పనులు మాత్రమే మిగిలి ఉంటాయి. ఆ పనులన్నీ వేగంగా పూర్తవుతాయని అంటున్నారు. భవనం ఫ్రంట్ ఎలివేషన్ పనులు కొనసాగుతున్నాయి. అటు భవనం లోపల ఇంటీరియర్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఏడాది చివరి వరకు పనుల పూర్తికి లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. మరొక 55 రోజుల గడువు మిగిలి ఉంది. ఆలోగా పనులు పూర్తవుతాయన్న విశ్వాసాన్ని ఇంజినీర్లు వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.