ETV Bharat / state

చంద్రబాబు లక్ష్యంగా మంత్రుల విమర్శలు.. బీజేపీతో పొత్తుకోసమే అంటూ మండిపాటు

author img

By

Published : Dec 22, 2022, 7:43 PM IST

Telangana Ministers Criticized Chandrababu
Telangana Ministers Criticized Chandrababu

Telangana Ministers Comments on Chandrababu : తెలుగుదేశం అధినేత చంద్రబాబు లక్ష్యంగా రాష్ట్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది చంద్రబాబు పాలనలోనేనని మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. ఏపీలో బీజేపీతో పొత్తు కోసం తెలంగాణలో షో చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణకు భాజపా పంపుతున్న నేతల్లో చంద్రబాబు కూడా చేరారని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. చంద్రబాబు వల్ల ఖమ్మం జిల్లాకు నష్టం తప్ప.. ఏ చిన్న లాభం జరగలేదని పువ్వాడ అజయ్ విమర్శించారు.

'ఎన్ని చెప్పినా, తెలంగాణ ప్రజలు మోసపోయే స్థితిలో లేరు'..

Telangana Ministers Comments on Chandrababu : ఏపీలో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తెలంగాణలో డ్రామా చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కుట్ర చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఖమ్మం సభతో మరో మోసానికి తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణను ఎండబెట్టారని మంత్రి ఆరోపించారు.

తెలంగాణ ప్రయోజనాల కోసం గతంలో తెదేపాతో పొత్తు పెట్టుకున్నామని హరీశ్​రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. తెలంగాణను ప్రగతి పథాన తీసుకెళ్తానని మాయమాటలు చెబుతున్నాడని విమర్శించారు. తెలంగాణలో అన్నివర్గాలవారిని.. చంద్రబాబు మోసం చేశారని హరీశ్​రావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకే చంద్రబాబు తెలంగాణలో కొత్త మోసాలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు.

''ఏపీని అభివృద్ధి చేయలేక.. తెలంగాణలో అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఏపీని అప్పుల పాలు చేసి ఇక్కడకు వచ్చారు. చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దోపిడీకి గురైంది. అన్ని వర్గాలను మోసం చేసింది. ఉద్యోగాలు అడిగిన యువతను నక్సలైట్లతో కాల్చి చంపారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నినాదం ఐటీ. వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబు. బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకు డ్రామాలు చేస్తున్నారు. భాజపా పొత్తుకోసమే వెంపర్లాడుతున్నారు. తెలంగాణలో ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మరు. ఎన్టీఆర్‌ విలక్షణ నేత.. ఆయన గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదని చంద్రబాబు చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం మరచిపోలేదు.''- హరీశ్‌రావు, మంత్రి

ఖమ్మం జిల్లాకు ఒక్క సాగునీటి ప్రాజెక్టయినా కట్టినట్లు నిరూపించినా.. ముక్కు నేలకు రాసుకుంటానని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో ఖమ్మం జిల్లాకు పైసా పని జరగలేదన్నారు. ఖమ్మం సభకు ఏపీ నుంచి జనాలను తరలించాలని పువ్వాడ అజయ్ ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏడు ముంపు మండలాలతో పాటు, సీలేరు హైడల్‌ ప్రాజెక్టును తీసుకుని అన్యాయం చేసింది చంద్రబాబే అని, మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు.

''కేసీఆర్‌ నాయకత్వంలోనే ఖమ్మానికి వైభవం. ఖమ్మం అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత చంద్రబాబు అన్యాయం చేసింది ఖమ్మం జిల్లాకే. చంద్రబాబు తన పలుకుబడితో రాత్రికి రాత్రే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో విలీనం చేయించారు. ప్రధానిపై ఒత్తిడి చేసి సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలుపుకొన్నారు. చంద్రబాబు హయాంలో ఖమ్మం జిల్లాకు ఒక్క ప్రాజెక్టైనా తెచ్చారా?. ఖమ్మానికి ఒక్క ప్రాజెక్టు తెచ్చినా నేను ముక్కు నేలకు రాస్తా. ఖమ్మం జిల్లాకు ఒక్క పరిశ్రమ లేదా ప్రాజెక్టైనా తీసుకొచ్చారా? చంద్రబాబు చెబుతున్న ఐటీని ఖమ్మానికి తీసుకొచ్చింది కేసీఆర్‌, కేటీఆర్‌.'' - పువ్వాడ అజయ్, మంత్రి

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు సాగవని.. ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారన్న ఆమె.. ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దామనునుకుంటే, మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా, తెలంగాణ ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరన్న మంత్రులు.. కేసీఆర్‌ వెంటే జనం ఉంటారని తేల్చిచెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.