ETV Bharat / state

రైతుబంధుపై జూన్​ 13లోగా నివేదిక ఇవ్వాలి: హైకోర్టు

author img

By

Published : Jun 8, 2020, 6:06 PM IST

Updated : Jun 8, 2020, 7:52 PM IST

Hyderabad latest news
Hyderabad latest news

రైతుబంధు అందలేదని ఓ వ్యక్తి వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. వెబ్ సైట్​లో పేర్లు లేవన్న కారణంగా రైతుబంధు నిలిపివేశారని పిటిషనర్ పిటిషన్​పై వివరించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం... రాష్ట్రంలో మూడు, నాలుగు విడతల రైతుబంధు ఎంతమందికి చెల్లించారో నివేదిక సమర్పించాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్​ను ఆదేశించింది.

గతేడాది ఖరీఫ్, ఈ ఏడాది రబీ సీజన్​లో తనకు రైతుబంధు అందలేదని గోదావరిఖనికి చెందిన ఎస్.ప్రమోద్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. వెబ్ సైట్​లో పేర్లు లేవన్న కారణంగా రైతుబంధు నిలిపివేశారని పిటిషనర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని రైతాంగం అందరికీ సంబంధించిన అంశమైనందున ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జి గతంలో పేర్కొన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. రైతుబంధు చెల్లింపులపై ఈనెల 13లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అన్నదాతలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో దాదాపు 51 లక్షల మంది కర్షకులకు రైతుబంధు డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుందని సర్కారు స్పష్టంగా చెబుతోంది. ఇప్పటికే వానాకాలం సాగుకు సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు తెలిపారు. కానీ కొంత మంది రైతులు తమకు రైతు బంధు సాయం అందటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే సాంకేతిక కారణాలు చెబుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు.

Last Updated :Jun 8, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.