ETV Bharat / state

రాజధాని విభజన కేసులపై.. 28న సుప్రీంకోర్టు విచారణ..!

author img

By

Published : Nov 15, 2022, 12:53 PM IST

Supreme Court on Amaravati capital case
Supreme Court on Amaravati capital case

Supreme Court on Amaravati capital case: అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ విభజనలపై దాఖలైన 36 కేసులపై ఈనెల 28వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. రెండు అంశాలపై దాఖలైన కేసులను విడివిడిగా విచారించనున్నట్లు.. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశాయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 8 కేసులు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవాలు చేస్తూ, దాఖలైన 26 కేసులను విడివిడిగానే వింటామని న్యాయమూర్తులు స్పష్టత ఇచ్చారు.

రాజధాని విభజన కేసులపై.. 28న సుప్రీంకోర్టు విచారణ..!

Supreme Court on Amaravati capital case: అమరావతి రాజధానితో పాటు ఏపీ పునర్విభజన చట్టంపై దాఖలైన పిటిషన్లు మరోమారు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. జస్టిస్‌ కేఎమ్ జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు ఇవి విచారణకు వచ్చాయి. ఈ రెండు అంశాలకు సంబంధించిన పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని, గతంలో అప్పటి సీజేఐ జస్టిస్‌ లలిత్‌ ఆదేశాలు ఇచ్చారు.

ధర్మాసనం ముందుకు పిటిషన్లు రాగానే.. రెండూ విభిన్న అంశాలు ఐనందున విడివిడిగా విచారణకు తీసుకోవాలని, సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ విజ్ఞప్తి చేశారు. ఆయన విభజన చట్టం పిటిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం తరపున, అమరావతి పిటిషన్లలో రైతుల తరపున వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన, మూడు రాజధానులు, అమరావతి అభివృద్ధి అన్నవి వేర్వేరు అంశాలు కాబట్టి విడివిడిగా విచారించాలని కోరారు.

ఒక కేసులోనే నోటీసులు: అసలు మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయో తమకు తెలియాలని జస్టిస్‌ జోసెఫ్‌ కోరగా, మొత్తం 36 కేసులని, వాటిలో 8 అమరావతి, 28 రాష్ట్ర విభజన కేసులని, న్యాయవాదులు బదులిచ్చారు. వీటిలో ఒక కేసులోనే నోటీసులు ఇచ్చారని, మిగిలిన వాటిలో ఇవ్వలేదని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సీనియర్‌ న్యాయవాది నారీమన్‌ సమాధానం ఇచ్చారు.

పార్లమెంటు చేసిన చట్టానికి సంబంధించిన కేసును తొలుత విచారించాలని గత ప్రధాన న్యాయమూర్తి నవంబర్ 1న ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. ఈ కేసుల్లో ఏ అంశాలున్నాయో స్థూలంగా చెప్పగలరా అని జస్టిస్‌ జోసెఫ్‌ మరోసారి కోరగా, రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయక ముందే హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రభావితమైందని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలు ఎక్కడి నుంచి పని చేయాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా నిషేధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు చట్టాలు చేయకుండా నిషేధించడం హైకోర్టు, సుప్రీంకోర్టు అధికారాలకు అతీతమన్నారు. ఇదే తమ అభ్యంతరమని తెలిపారు.

రాజధాని కోసం.. 29వేల మందికి పైగా రైతుల భూములు: రైతుల తరపు సీనియర్‌ న్యాయవాదులు శ్యాందివాన్‌, రంజిత్‌ కుమార్‌ జోక్యం చేసుకుని, అమరావతిలో రాజధాని కోసం 29వేల మందికి పైగా రైతులు భూములిచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. అదే సమయంలో ఈ అంశంలో ఎప్పుడు ఏం జరిగిందో వివరిస్తూ తేదీలను కోర్టుకు సమర్పించామని, వాటిని పరిశీలించాలని సీనియర్ న్యాయవాది నారిమన్ కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ అమరావతి అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని ముఖ్య అంశాలను చదివి న్యాయమూర్తులకు వివరించారు. రాష్ట్ర కార్య, శాసన, న్యాయవ్యవస్థలను సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్‌ 3 కింద పేర్కొన్న రాజధాని ప్రాంతం మినహా మిగతా ఎక్కడికి తరలించకూడదని హైకోర్టు చెప్పినట్లు తెలిపారు.

పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత కూడా, కోర్టు భవిష్యత్తులో చేపట్టే చర్యలపై నిషేధం విధించడం చట్టబద్ధం కాదన్నారు. వైద్యనాథన్‌ వాదనలతో పాలీ నారిమన్ విభేదించారు. ఈ కేసులో ఇంతవరకూ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదా? అని న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించగా, ఇవ్వలేదని నారిమన్ బదులిచ్చారు.

ఈ సమయంలో సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ మరోసారి జోక్యం చేసుకుని, నోటీసులు జారీ చేసి, విచారణ తేదీని నిర్ణయించాలని కోరగా.. ఆ వాదనలను నారిమన్ సమర్థించారు. తరువాత ఏపీ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ జోక్యం చేసుకుంటూ అమరావతి కేసులను, రాష్ట్ర విభజన కేసులను విడగొట్టాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

రాజధాని విభజనతో మూడు రాజధానుల అంశానికి సంబంధం లేదు: ఈ రెండు కేసులకు ఏదైనా అనుబంధం ఉందా అని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నకు, అన్నీ ఒకే రాజ్యాంగం కింద ఏర్పడ్డాయి కాబట్టి వాటన్నింటినీ కలిపారని ఏపీ ప్రభుత్వ తరుపు న్యాయవాది వైద్యనాథన్ బదులిచ్చారు. రాజధాని విభజనతో మూడు రాజధానుల అంశానికి సంబంధం లేదు కాబట్టి రెండింటినీ విడదీయాలని సింఘ్వీ కోరగా, రైతుల తరుపు సీనియర్ న్యాయవాది నారిమన్‌ కూడా ఆ వాదనతో ఏకీభవించారు.

రాజధాని విభజన అంశంలో ఇప్పటి వరకూ నోటీసులు జారీ చేయలేదు కాబట్టి... ఆ అంశాన్ని తాజా కేసుగా పరిగణలోకి తీసుకొని వచ్చే సోమవారం లిస్ట్ చేస్తామని, రాష్ట్ర విభజన అంశాలను కూడా అదే రోజు లిస్ట్ చేసి ప్రత్యేకంగా తీసుకుంటామని.. న్యాయమూర్తులు చెప్పారు. దీనికి రైతుల తరపు సీనియర్‌ న్యాయవాది శ్యాందివాన్‌ జోక్యం చేసుకుంటూ... ఈ కేసులను వచ్చే సోమవారం కాకుండా 28వ తేదీన లిస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అందుకు న్యాయమూర్తులు అంగీకరించారు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేకే వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ... రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు నడుస్తోందని, అందువల్ల దాన్ని నిలువరించాలని కోరారు. 28వ తేదీన హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వస్తున్నందున దానిపై ముందు కెళ్లబోమని రైతులు హామీ ఇచ్చేలా చూడాలని ప్రభుత్వం తరుపు మరో న్యాయవాది వైద్యనాథన్ కోరారు.

జోక్యం చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ ఇప్పుడు ఆ కేసును సుప్రీంలో సవాల్ చేసినందున ధిక్కరణ చర్యల కోసం హైకోర్టులో ఒత్తిడి చేయక పోవచ్చని అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు జారీ చేసిన తీర్పు అమలుకు మరింత సమయం ఇవ్వాలని పదేపదే కోరుతూ ఇప్పటి వరకూ మూడు సార్లు సమయం తీసుకుందని రైతుల తరుపు న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు.

తాము హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలనుకుంటున్నామని, అందువల్ల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులో ఓ న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. తాము 9 ఏళ్లుగా కోర్టుకు వస్తున్నామని, ఆ చట్టంలోని ప్రొవిజన్ 5, 6, 8, 9లు రాజధాని గురించి చెబుతాయని.. ఆ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగా మిగతా వాటిని విచారణకు స్వీకరించడం సరికాదన్నారు. కేసు పెండింగ్‌లో ఉండగా పార్లమెంటుకుగానీ, అసెంబ్లీకికానీ చట్టాలు చేసే అధికారం లేదన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.