ETV Bharat / state

Uttamkumar Reddy on Party Change : బీఆర్​ఎస్​లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి.. ఏం చెప్పారంటే..?

author img

By

Published : Jul 30, 2023, 10:41 AM IST

Uttamkumar Reddy Clarify on Party Change : తాను బీఆర్​ఎస్​లో చేరుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌లో కీలక పదవిలో ఉన్న ఓ నేత ఇలాంటి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో తన స్థానాన్ని తగ్గించేందుకు ఇలాంటి ప్రచారం చేయడం సరికాదన్నారు. గత రెండేళ్లుగా.. తన ప్రతిష్ఠకు భంగ కలిగించే కథనాలతో లక్ష్యంగా చేసుకున్నారని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

Uttamkumar Reddy
Uttamkumar Reddy

Uttamkumar Reddy on Congress Party Change Rumors : కాంగ్రెస్​ పార్టీని వీడి బీఆర్‌ఎస్​లో చేరుతున్నట్లు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఖండించారు. భార్య పద్మావతితో కలిసి తాను బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్​లో కీలకమైన పదవిలో ఉన్న ఒక నాయకుడు, పార్టీలో తన స్థానాన్ని దిగజార్చేందుకు ఎలాంటి ఆధారం లేకుండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజల్లో తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

Uttamkumar Reddy fires on Party Change Rumors : పార్టీలోని తన సహచరులు, అనుచరులను అణగదొక్కడం.. తొలగించడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్ని సమస్యలు, పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ఉత్తమ్‌ పేర్కొన్నారు. జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి చెందిన విధి విధానాలు అనుసరిస్తానని... అందుకే మీడియాతో కానీ, బయట గానీ మాట్లాడబోనని వివరించారు. వ్యాపారాలు, ఒప్పందాలు, భూ లావాదేవీలు లేవని ఉత్తమ్ స్ఫష్టం చేశారు. 1994 నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా పార్టీలో విధేయతతో పని చేస్తూ.. ఆరుసార్లు ఎన్నికల్లో గెలుపొందినట్లు ఉత్తమ్​కుమార్ రెడ్డి తెలిపారు. తన సతీమణి పద్మావతి రెడ్డి కోదాడ నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది, 2018లో స్వల్ఫ ఓట్లతో ఓటమి పాలైనా కూడా పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్‌ తరఫున తన శక్తి మేరకు స్థానిక ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ నాయకుడికి సన్నిహితంగా ఉన్న ఛానల్స్ ఈ ప్రచారాన్ని చేయిస్తున్నాయి : గడిచిన రెండు సంవత్సరాలుగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలతో తనను లక్ష్యంగా చేసుకున్నారని ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకుడికి సన్నిహితంగా ఉన్న యూట్యూబ్‌ ఛానల్‌, మీడియా సంస్థలు.. తన గురించి, తన భార్య గురించి తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురింపచేయడం తీవ్ర ఆవేదనను కలిగిస్తోందన్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో పని చేసినందుకు గర్వపడే.. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పని చేశానని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతి వెంకటరామన్, ప్రెసిడెంట్ ఎస్​డీ వద్ద సీనియర్ అధికారిగా పనిచేసినట్లు ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు.

అనిల్‌కుమార్‌రెడ్డి పార్టీ మారిన తర్వాతే : భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉంటూ భువనగిరి శాసనసభ టికెట్‌ను ఆశిస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్​ఎస్​లో చేరిన తర్వాత ఉత్తమ్‌, ఆయన సతీమణి పద్మావతి కాంగ్రెస్‌ను వీడి బీఆర్​ఎస్​లో చేరతారనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది. ప్రసార మాధ్యమాల్లోనూ పలు కథనాలు వచ్చాయి. భువనగిరి నుంచి బీసీ అభ్యర్థికి టికెట్‌ ఇవ్వాలంటూ ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతున్నారని, తనకు టికెట్‌ రాకుండా అడ్డుకుంటారనే అభిప్రాయానికి వచ్చిన అనిల్‌కుమార్‌రెడ్డి పార్టీ మారినట్లు తెలుస్తోంది. అనిల్‌కుమార్‌రెడ్డికి ఉత్తమ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ వర్గాలు కల్పించాయి. ఇవన్నీ కూడా ఉత్తమ్‌ పార్టీ వీడతారనే ప్రచారాన్ని మరింత పెంచాయి. తాజాగా ఉత్తమ్‌ ప్రకటన ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.