ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికలో దినపత్రిక కంటే పెద్ద బ్యాలెట్ పత్రం

author img

By

Published : Mar 2, 2021, 11:04 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికలో దినపత్రిక కంటే పెద్ద బ్యాలెట్ పత్రం
ఎమ్మెల్సీ ఎన్నికలో దినపత్రిక కంటే పెద్ద బ్యాలెట్ పత్రం

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కోసం దినపత్రిక కంటే పెద్దగా ఉన్న బ్యాలెట్ పత్రం ఉపయోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. పోలింగ్ కోసం 3,500 బ్యాలెట్ బాక్సులు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కోసం దినపత్రిక కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న బ్యాలెట్ పత్రాన్ని ఉపయోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. రెండు నియోజకవర్గాల్లోనూ... అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీలో ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్​నగర్ నియోజకవర్గానికి 54.5 సెంటీమీటర్ల వెడల్పు, 60.4 సెంటీమీటర్ల పొడవు ఉన్న బ్యాలెట్ పత్రాన్ని ఉపయోగించనున్నారు.

ఈసీ అనుమతి...

71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నల్గొండ- వరంగల్- ఖమ్మం నియోజకవర్గం కోసం 43.5 సెంటీమీటర్ల వెడల్పు, 60.4 సెంటీమీటర్ల పొడవు ఉన్న బ్యాలెట్ పత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ మేరకు రెండు పరిమాణాలతో బ్యాలెట్ పత్రాలకు ఈసీ అనుమతిచ్చింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ముద్రణాలయంలో బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నారు.

బ్యాలెట్ పత్రంలో ఒక్కో అభ్యర్థికి సంబంధించి నాలుగు కాలమ్స్ ఉంటాయి. క్రమసంఖ్య, పేరు-పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థి, ఫొటోతో పాటు ఓటర్లు ప్రాధాన్యక్రమంలో ఓటు వేసేందుకు వీలుగా మరో కాలమ్ ఉంటుంది. బ్యాలెట్ పత్రాల పరిమాణం భారీగా పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా జంబో బ్యాలెట్ బాక్సులకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది.

3,500 బ్యాలెట్ బాక్సులు..

రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం 3,500 బ్యాలెట్ బాక్సులు అవసరమని అధికారులు గుర్తించారు. 2010 ఎన్నికల్లో వినియోగించిన జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఇప్పటి వరకు 900 బ్యాలెట్ బాక్సులను గుర్తించారు. మరో 100 వరకు లభ్యం కావొచ్చని అంటున్నారు. ఈ వెయ్యి మినహాయిస్తే మిగతా బాక్సులను తయారు చేయించాల్సి ఉంటుంది. ఈనెల 10 కల్లా బాక్సులను సిద్ధం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ విధానం కావడం వల్ల ఓటర్లు ప్రాధాన్యక్రమంలో ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఈసీ పెన్ను మాత్రమే..

అభ్యర్థుల పేర్లు, ఫొటోల ఎదురుగా ఉన్న కాలమ్​లో ప్రాధాన్యక్రమంలో 1,2,3, తదితర సంఖ్యలను వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈసీ అనుమతించిన పెన్నును మాత్రమే వాడాల్సి ఉంటుంది. మైసూర్ పెయింట్స్ కంపెనీకి చెందిన వాయిలెట్ స్కెచ్ పెన్నులు ఉపయోగించేందుకు ఈసీ అనుమతించింది. ఆ పెన్నులను అధికారులు సేకరించనున్నారు. అన్ని ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే పనిలో అధికారులు పడ్డారు.

ఇదీ చూడండి: అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.