ETV Bharat / state

ఒక్క రూపాయికే కిలో ఉల్లి.. ధరల పతనంతో రైతుల కన్నీరు

author img

By

Published : Mar 10, 2023, 9:59 AM IST

Farmers are worried due to fall in onion prices
ఉల్లి ధరలు తగ్గడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు

onion prices fall in Telangana: అన్నదాత రెక్కల కష్టానికి ఫలితం దక్కట్లేదు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఉల్లి పంట దిగుబడులు పెరగడంతో మార్కెట్లకు సరుకు పోటెత్తుతోంది. దేశంలో లాసర్‌గాం, బెంగళూరు, షోలాపూర్‌ వంటి ప్రధాన మార్కెట్‌లో ఉల్లి ధరలు పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నాణ్యతను బట్టి క్వింటాల్ ఉల్లి ధర 400 నుంచి 1200వద్ద నిలిచిపోయింది. పెట్టిన పెట్టుబడి చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

onion prices fall in Telangana: మార్కెట్‌లో రోజురోజుకు ఉల్లి ధరలు పతనం అవుతుండటంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో భారీగా ఉత్పత్తి పెరగడం సహా ఒకేసారి పంట మార్కెట్‌లోకి రావడంతో ధరలు సగానికి పైగా పడిపోయాయి. లాసర్‌గాం, బెంగళూరు, షోలాపూర్‌ వంటి ప్రధాన మండీల్లో కిలో ధర 1 రూపాయి మాత్రమే పలకడంతో తెలుగు రాష్ట్రాలపై తీవ్రప్రభావం చూపుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి హైదరాబాద్ మలక్‌పేట మార్కెట్‌కు ఉల్లి సరకు పోటెత్తుతోంది. రైతులు అంతదూరం నుంచి మార్కెట్‌కు పంట తీసుకొస్తే.. ఇక్కడ క్వింటాల్ ధర 400 నుంచి 1200 రూపాయలకు మించి రావడంలేదు. ఆ రేట్లు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదంటూ ఉల్లి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లిధరపై కేంద్రం తీసుకుంటున్న చర్యలు: దేశంలో ఉల్లిధరల పతనంపై కేంద్రం అప్రమత్తమైంది. వెంటనే కర్షకుల నుంచి సరుకు కొనుగోలు చేయాలంటూ నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌లను కేంద్రం ఆదేశించింది. ప్రతికూల పరిస్థితి ఉత్పన్నమై మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పుడు సమతుల్యం చేయడానికి ధరల సమతుల్య నిధిని ఏర్పాటు చేసింది. ఆ నిధి కింద సేకరించిన ఉల్లిని బఫర్‌ నిల్వలుగా పెట్టాలని, కొరత ఏర్పడినప్పుడు వాటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు క్వింటాల్‌కు 900 రూపాయల ధర చొప్పున గత 11 రోజుల్లో నాఫెడ్‌ 4500 క్వింటాళ్లు సేకరించింది. ఐతే రాష్ట్రంలో నాఫెడ్‌ రంగంలోకి దిగలేదు. ఎకరానికి లక్ష పెట్టుబడి పెడితే కనీసం 30 వేలు మించి రావట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉల్లిసాగు చేయడం సాధ్యంకాదని కంట తడిపెడుతున్నారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు: మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోని వికారాబాద్, తాండూరు, మెదక్, నారాయణఖేడ్ నుంచి గురువారం నుంచి ఒక్కరోజే మార్కెట్‌కు 80 లారీల సరకు వచ్చింది. ఒక్క రోజులోనే 70 వేల క్వింటాళ్ల సరకు క్రయ, విక్రయాలు జరిగాయి. లాసర్‌గాం, బెంగళూరు, షోలాపూర్ టోకుమార్కెట్ల ధరల ఆధారంగా మలక్‌పేటలో ఉల్లిని వేలం వేసి ధరలు నిర్ణయించడం పరిపాటి. ఈ పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి సరుకులు తెచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా ఇతర టోకు మార్కెట్ల కంటే ఎక్కువ ధర లభించేలా మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంటోంది. నెలాఖరు వరకు ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని, ఆగస్టు నుంచి కాస్త పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

"ప్రస్తుతానికి ఉల్లి ధరలు సాధారణంగానే ఉన్నాయి. మహారాష్ట్ర ధరలు తగ్గడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. మార్కెట్​కి ఈరోజు దాదాపు 80 లారీలు వచ్చాయి. అందులో 62 మహారాష్ట్రాకి చెందినవే. ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు."- ఎం.దామోదర్‌, వ్యవసాయ మార్కెట్ యార్డు, హైదరాబాద్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.