ETV Bharat / state

CM KCR On Dalit Bandhu: దళిత బంధు కేవలం పథకం మాత్రమే కాదు.. ఓ ఉద్యమం

author img

By

Published : Jul 25, 2021, 4:46 AM IST

CM KCR On Dalit Bandhu
CM KCR On Dalit Bandhu

దళిత బంధు కోసం ఏకంగా రూ. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా వెనకాడమని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమించామో.. దళితుల అభ్యున్నతి కోసం ఉద్యమ తరహా ముందుకెళ్తామన్నారు. దళిత బంధు ద్వారా ఇచ్చే నగదు.. పూర్తి ఉచితమేనన్న ముఖ్యమంత్రి.. వాటితో ఉపాధి మార్గాలను పరిపుష్టం చేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే తెలంగాణ ప్రారంభించిన అనేక పథకాలను వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. దళితబంధు కూడా దేశానికి ఆదర్శంగా మారుతుంది. దీనికి హుజూరాబాద్‌ ప్రేరణగా నిలవబోతోంది. అక్కడి బిడ్డలుగా మీ అందరికీ ఇది ఎంతో సంతోషకరం. ఈ పథకం వల్ల మంచి జరిగి వెలుతురొస్తే అణగారిన దళిత వర్గాలందరికీ ఒక మార్గమవుతుంది. పార్టీలకతీతంగా దళితబంధును అమలు చేసుకుందాం.

దళిత జాతిలో ఇక ఎవ్వరూ పేదలుగా మిగలకూడదు. దళిత బంధు.. కేవలం పథకం మాత్రమే కాదు. గతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టినట్టుగా వారి అభ్యున్నతి కోసం సాగే ఉద్యమం. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఒకరి అభివృద్ధికోసం ఒకరు పాటుపడే యజ్ఞం.

ఇంకా సమాజాన్ని వరకట్నం, అంటరానితనం వంటి పలు వివక్షలు పీడిస్తున్నాయి. వాటిని విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ది ద్వారా పారదోలవచ్చు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితరులకు ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. వారి కళ్లలో సంతోషం కనిపిస్తోంది. అదే రీతిన దళిత సమాజం మోములో ఆనందాన్ని చూడాలన్నదే మా పట్టుదల.- సీఎం కేసీఆర్‌

.

తెలంగాణలో అర్హులైన వారందరికీ దళిత బంధు పథకం అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన కుటుంబాలనే మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేస్తామన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టి దశల వారీగా దీనిని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. రూ.80 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ‘‘ఈ పథకం విజయవంతం కోసం దళిత బిడ్డలంతా పట్టుబట్టి పనిచేయాలి. ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్‌ పుట్టాలె. ఈ పథకం యావత్‌ దేశానికి ఆదర్శమై దేశంలోని దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తులను చేయబోతోంది’’ అని చెప్పారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు శనివారం ప్రగతిభవన్‌కు వచ్చారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించడంపై వారు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ వారిని ఉద్దేశించి మాట్లాడారు.

నాటి ప్రశ్నలకు స్వరాష్ట్రంలో దీటుగా బదులిచ్చాం...

‘‘తెలంగాణ ప్రజలు గత పాలనలో గొర్రెల మందలో చిక్కుకుపోయిన పులి పిల్లల్లాంటి వాళ్లనే సంగతిని స్వయంపాలన వచ్చాక ప్రపంచం గమనించింది. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం నేడు ఆశ్చర్యపోతోంది. రాజులు, జాగీర్దార్లు జమీందార్లు, భూస్వాములు, అనంతరం వలస పాలకులు.. ఇలా 100 ఏళ్ల పాటు అనేక రకాల పీడనను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అన్ని రంగాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ఉద్యమం ప్రారంభించిన మొదట్లో తెలంగాణ వస్తదా అని అనుమానించారు... వచ్చింది. 24 గంటల కరెంటు సాధ్యమేనా అన్నారు... సాధ్యం చేసి చూపాం. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు అయ్యేదేనా అని సంశయించారు.. అది కూడా అయింది. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేశాం. రైతుబంధు తెచ్చినప్పుడు కొందరు పెదవి విరిచారు. ఇప్పుడు తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు. రోహిణీ కార్తెలోనే నాట్లేసుకునే రోజులొచ్చాయి. అలాగే దళిత బంధును కూడా కొందరు అనుమానిస్తున్నారు. వాటినన్నింటినీ పటాపంచలు చేస్తాం. విజయం సాధిస్తాం.

ఆర్థిక సాయం నేరుగా బ్యాంకు ఖాతాలోకి..

ఇన్నాళ్లూ ప్రభుత్వాలు ఏవేవో పథకాలు తెచ్చి బ్యాంకుల గ్యారెంటీ అడిగాయి. కడుపేద దళితులు అవి ఎక్కడ తెస్తారు? అందుకే దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం చేసే ఆర్థిక సాయం పూర్తి ఉచితం. ఇది అప్పుకాదు. తిరిగిఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో దళారుల మాటే ఉండదు. నేరుగా అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో ఆర్థిక సాయం వచ్చి చేరుతుంది.

పప్పులు, పుట్నాలకు కాదు..

దళితుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచాలన్నది మా సంకల్పం. వారి అభివృద్ధిని వారే నిర్వచించుకోగలగాలి. వారిలో ఆ భరోసాను కలిగించడంలో భాగమే ఈ దళిత బంధు పథకం. ఇచ్చిన పైసలు పప్పులు, పుట్నాలకు ఖర్చు చేయకూడదు. పైసా పెట్టి పైసా సంపాదించే ఉపాధి మార్గాలను అన్వేషించాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.

కేసులను ఎత్తేసుకోవాలి..

అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలి. చిరునవ్వులతో పరస్పరం పలకరించుకోవాలి. కొట్లాటలు, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు లేనివిగా దళిత వాడలు పరిఢవిల్లాలి. ఒకరి మీద ఒకరు పెట్టుకున్న కేసులను ఎత్తేసుకోవాలి. ఒకరు ఏమాత్రం కింద పడే పరిస్థితి కనిపించినా వెంటనే ఆదుకొనే ఖోజా జాతి మనందరికీ ఆదర్శం కావాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

నిబద్ధతకే పదవి..

సందర్భంగా సీఎం ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండా శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేస్తున్న శ్రీనివాస్‌కు పదవితో పాటు తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఆయన నెత్తిన పెద్ద బాధ్యత(బండ) పెట్టానన్నారు. ఆయన దానిని సునాయాసంగా మోస్తారని భావిస్తున్నానన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌, టీఆర్‌ఎస్వీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, హుజూరాబాద్‌ జడ్పీటీసీ సభ్యుడు బక్కారెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, రాష్ట్ర దళిత సంఘాల నేతలు, పలువురు దళిత నాయకులు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

KTR BIRTHDAY: కేటీఆర్​ జన్మదిన వేడుక.. సంబురాల్లో మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.