కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారం

author img

By

Published : Jul 10, 2020, 12:48 PM IST

CM kcr regrets disturbing temple and masjid

సచివాలయ భననాల కూల్చివేతతో ఆలయం, మసీదు దెబ్బతిని ఇబ్బంది కలగడంపై సీఎం కేసీఆర్​ విచారం వ్యక్తం చేశారు. ఆలయం, మసీదులను ప్రభుత్వ ఖర్చుతో మరింత విశాలంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు.

సచివాలయ భననాల కూల్చివేతతో ఆలయం, మసీదుకు ఇబ్బంది కలగడంపై సీఎం కేసీఆర్​ విచారం వ్యక్తం చేశారు. ఆ స్థలంలోనే మరింత ఎక్కువ విస్తీర్ణంలో విశాలమైన ఆలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ప్రకటించారు. పాత భవనాలను కూల్చివేసి, కొత్త భవన సముదాయం నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుందని.. అక్కడున్న ఎత్తయిన భవనాలు కూల్చే సందర్భంలో.. పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి నష్టం జరిగిందని అన్నారు. ఇలా జరగడం పట్ల ఎంతో చింతిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు.

పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప.. ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. విశాలంగా ఎన్ని కోట్లయినా వెనుకాడకుండా ఆలయాలు, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి.. వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఆలయాలు, మసీదు నిర్వాహకులతో తానే త్వరలో సమావేశమవుతానన్న కేసీఆర్.. వారి అభిప్రాయాలు తీసుకుని ప్రార్థనా మందిరాలను నిర్మిస్తామన్నారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామన్న సీఎం.. ఈ ఘటనను అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు.

ఇదీచూడండి: ప్రపంచవ్యాప్తంగా కరోనా రికార్డు.. కొత్తగా 2లక్షల22వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.