ETV Bharat / state

CM KCR: మునుగోడు ఉపఎన్నిక భాజపా కుట్ర :కేసీఆర్

author img

By

Published : Aug 12, 2022, 10:05 AM IST

Updated : Aug 12, 2022, 10:12 AM IST

kcr
కేసీఆర్

CM KCR: మునుగోడు ఉపఎన్నికను అధికార తెరాస.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో నిన్న సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో గంటకు పైగా సమావేశం నిర్వహించారు. ఈ నెల 20న మునుగోడులో ప్రజాదీవెన పేరిట బహిరంగ సభకు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

CM KCR: మునుగోడు ఉపఎన్నికను అధికార తెరాస.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో జరగనున్న ఆ ఉపఎన్నికలో గులాబీ జెండా ఎగురేయాలని భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన.. పార్టీ నేతలతో తెరాస అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు . గురువారం ప్రగతిభవన్‌లో గంటకుపైగా పలుఅంశాలపై చర్చించారు.

ఈనెల20న మునుగోడు నియోజకవర్గంలో.. బహిరంగసభ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మునుగోడు ప్రజాదీవెన పేరిట నిర్వహించే సభకు లక్ష మందిని తరలించాలని స్థానిక నేతలకు లక్ష్యం విధించారు. ఆ సభ విజయవంతం చేసేందుకు మండలాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. మునుగోడు ఉపఎన్నిక భాజపా పన్నిన కుట్ర అని సీఎం అభివర్ణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లో తనను అడ్డుకునే కుట్రలో భాగమే.. ఉపఎన్నిక అని కేసీఆర్ ఆరోపించినట్లు తెలుస్తుంది.

మునుగోడు రాజకీయం క్షేత్రస్థాయికి చేరింది: మునుగోడు రాజకీయం క్షేత్రస్థాయికి చేరింది. అన్ని పార్టీలు ఉప ఎన్నికల పోరును కార్యక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. త్వరలోనే మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని అధికార పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇప్పటికే అసమ్మతి నేతలతో చర్చించిన పార్టీ నేతలు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని తీర్మానించారు. అప్పటివరకు పార్టీయే అభ్యర్థిగా క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేయాలని అధిష్ఠానం ఆదేశించింది.

రేపు రేవంత్‌ పాదయాత్ర: సంస్థాన్‌ నారాయణ్‌పూర్‌ నుంచి చౌటుప్పల్‌ వరకు యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రేపు (13వ తేదీ శనివారం) చేసే పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొనున్నారు. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు రోజూ రెండు మండలాల చొప్పున ముఖ్య కార్యకర్తలు, నేతలతో సమావేశమై ఉప ఎన్నికలపై వారు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.

మరోవైపు ఇప్పటికే మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌ల నియామకం తుది దశకు చేరుకుంది. ఒకట్రెండు రోజుల్లో ఈ కమిటీలను ప్రకటించనున్నారు. ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రస్థాయి నేతలంతా నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొనాలని పీసీసీ పిలుపునిచ్చింది. తెరాస, భాజపా సభల అనంతరం అవసరమైతే మునుగోడులోనే సభ నిర్వహించాలని కొంత మంది నేతలు పీసీసీ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేయగా.. 21 తర్వాత దీనిపై పీసీసీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

మండలాల వారీగా రాజగోపాల్‌రెడ్డి సమావేశాలు: అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని, తన వెంట రావాలని కాంగ్రెస్‌ క్యాడర్‌కు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. మండలాల వారీగా ఆయన పార్టీ ముఖ్యులు, సీనియర్‌ నేతలతో సమావేశం అవుతున్నారు. గత రెండు రోజుల్లో మర్రిగూడ, నాంపల్లి మండలాల వారీతో సమావేశమైన ఆయన నేడు మునుగోడు మండల నేతలతో సమావేశం కానున్నారని తెలిసింది. ఈ నెల 21న అమిత్‌షా సభను సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ ముఖ్యులు ఇప్పటికే మండలాల వారీగా పర్యటనలు చేస్తూ క్యాడర్‌ను కార్యోన్ముఖులను చేస్తున్నారు.

ఇవీ చదవండి: నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రంథాలయాలు.. మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరం

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

Last Updated :Aug 12, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.