ETV Bharat / state

'కేసీఆర్ కుమారుడికి నోటీసులు జారీ చేసే దమ్ము సిట్​కు ఉందా?'

author img

By

Published : Mar 20, 2023, 9:13 PM IST

BJP state president Bandi Sanjay
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​

Bandi Sanjay comments on KCR: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజ్​ కేసులో ప్రతిపక్ష నాయకులకు నోటీసులు జారీ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. ఇలాంటి నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కేటీఆర్​ని పిలిచి విచారించే ధైర్యముందా అని ప్రశ్నించారు.

Bandi Sanjay comments on KCR: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ నోటీసుల జారీ పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతల నోరు నొక్కేసే కుట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెర దీశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కుట్రకు కారణం అయిన వారిని వదిలేసి ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. సిట్ నోటీసులకు, విచారణకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను దాడులు, నిషేధం పేరుతో ప్రశ్నించే మీడియా సంస్థల గొంతును అణిచివేసే కుట్ర జరుగుతోందని అయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఇదే పంధాతో రెచ్చిపోయిన హిట్లర్, ఇందిరాగాంధీ వంటి నియంతలనే మట్టి కరిపించిన చరిత్ర ప్రజలకుందని గుర్తుచేశారు.

కేటీఆర్​ నాపై ఆరోపణలు చేశారు: సంజయ్: కేసీఆర్ సర్కార్​కు సైతం అదే గతి పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదన్నారు. ఆధారాలు సమర్పించాలని కోరేందుకే సిట్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారని అదే నిజమైతే సిట్​కు నిబద్ధత ఉంటే పేపర్ లీకేజీ కుట్ర వెనుక బండి సంజయ్ పాత్ర ఉన్నట్లు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నాపై ఆరోపణలు చేశారని తెలిపారు. ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కేసీఆర్ కుమారుడికి నోటీసులు జారీ చేసే దమ్ము సిట్​కు ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ను పిలిచి విచారించే ధైర్యముందా అని నిలదీశారు.

దోషులను శిక్షిస్తుందనే నమ్మకం ఎప్పుడో కోల్పోయింది: సిట్ కేసీఆర్ జేబు సంస్థగా మారిందిని సంజయ్​ విమర్శించారు. కేసీఆర్​కు ప్రయోజనం చేకూర్చేలా సిట్ పనిచేసిందని ఆరోపించారు. నిజాలను వెలుగులోకి తీసుకొచ్చి.. దోషులను శిక్షిస్తుందనే నమ్మకాన్ని సిట్ ఎప్పుడో కోల్పోయిందన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే, చివరకు తన కుమారుడు, బిడ్డ ఉన్నా ఉపేక్షించబోనని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్​కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డికి, ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడానికి ముందే కేటీఆర్​కి నోటీసులు ఇప్పించాలన్నారు.

పేపర్​ లీకేజ్​ కారకులను వదిలేదే లేదు: సిట్ విచారణ పేరుతో కిందిస్థాయి సిబ్బందిని ఇరికించి కేసును నీరుగార్చాలని చూస్తున్నారని తెలిపారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్​ తప్పు చేయలేదని భావిస్తే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. అప్పుడే తమ దగ్గర ఉన్న సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.