ETV Bharat / state

రాష్ట్రంలో 45 శాతం హైస్కూళ్లలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుల పాలన

author img

By

Published : Sep 4, 2022, 7:32 AM IST

principal
principal

రాష్ట్రంలోని 45 శాతం హైస్కూళ్లలో ఆరేళ్లుగా ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుల పాలన సాగుతోంది. సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లే ఆ బడుల బాధ్యతలు చూస్తున్నారు. వారు తమ సబ్జెక్టులను బోధించడంతోపాటు పరిపాలనా వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తుండడంతో పనిభారంతో సతమతమవుతున్నారు. విద్యార్థులకు పాఠాలు పూర్తి స్థాయిలో బోధించడం వీలుకాక సరైన న్యాయం చేయలేకపోతున్నామని కొందరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆ ప్రభావం చివరకు పదో తరగతి ఉత్తీర్ణతపైనా పడుతోందని వారంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 4,405 ప్రభుత్వ హైస్కూళ్లు ఉంటే అందులో 2009 చోట్ల రెగ్యులర్‌ ప్రధానోపాధ్యాయులు లేరు. ఆయా పాఠశాలల్లో పనిచేసే సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లకే హెచ్‌ఎంలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తు న్నారు. రెగ్యులర్‌ హెచ్‌ఎంలు రావాలంటే స్కూల్‌ అసిస్టెంట్ల(ఎస్‌ఏ)కు పదోన్నతి ఇవ్వాలి. ఆరేళ్ల నుంచి పదోన్నతులు ఇవ్వకపోవడంతో ఇన్‌ఛార్జుల పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం కొద్ది నెలల నుంచి ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నా జరిగింది శూన్యం.

పనిభారం... పిల్లలకు నష్టం: ఇన్‌ఛార్జి హెచ్‌ఎంలుగా కొనసాగుతున్న వారు పిల్లలకు పాఠాలు చెప్పాల్సిందే. ఇన్‌ఛార్జి హెచ్‌ఎం బోధించే సబ్జెక్టుకు ఇద్దరు ఉపాధ్యాయులుంటే కొంత సర్దుబాటు చేసుకోవచ్చు. ఒక్కరే అయితే ఆయన అటు పాఠాలు చెప్పాలి...ఇటు పాఠశాల పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. ఉన్నతాధికారులు నిర్వహించే సమావేశాలకు హాజరుకావాలి.

అధికారులు వివిధ రకాల సమాచారం అడుగుతుంటారు. వాటిని సేకరించి పంపించాలి. అలాంటప్పుడు ఆరోజు పాఠాలు చెప్పడం సాధ్యంకాదు. తాము విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠాలను బోధించలేకపోతున్నామని కొందరు హెచ్‌ఎంలు అంగీకరిస్తున్నారు. వారి పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను పర్యవేక్షించే బాధ్యత కూడా స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలదే.

దీంతో మరింత పనిభారం తప్పడం లేదని వారు వాపోతున్నారు. ‘ నేను హిందీ సబ్జెక్టు స్కూల్‌ అసిస్టెంట్‌ను. మరో హిందీ టీచర్‌ లేకపోవడంతో రోజూ అయిదు పిరియడ్లు నేనే బోధించాలి. మరో వైపు ఇన్‌ఛార్జి హెచ్‌ఎంగా పర్యవేక్షణ, స్కూల్‌ కాంప్లెక్స్‌ బాధ్యతలను కూడా నెరవేర్చాలి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు న్యాయం చేయడం కష్టం’ అని సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇన్‌ఛార్జి హెచ్‌ఎం ఒకరు చెప్పారు.

కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన సుభాష్‌రెడ్డి సొంత ఊరిపై మమకారంతో రూ.6 కోట్లతో కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా హైస్కూల్‌ భవనాన్ని నిర్మించారు. అందులో 700 మందికిపైగా విద్యార్థులున్నారు. ఇక్కడ కూడా నాలుగేళ్లుగా గణితం ఉపాధ్యాయురాలికే ఇన్‌ఛార్జి హెచ్‌ఎంగా బాధ్యతలు అప్పగించారు.

రెగ్యులర్‌ హెచ్‌ఎంలకే స్కూల్‌ కాంప్లెక్స్‌ బాధ్యతలు ఇవ్వాలి: ఇన్‌ఛార్జి హెచ్‌ఎంగా ఉన్న పాఠశాలే స్కూల్‌ కాంప్లెక్స్‌ పాఠశాలగా ఉంటే దాని పరిధిలోని ఇతర హైస్కూళ్లలో ఉన్న రెగ్యులర్‌ ప్రధానోపాధ్యాయుడికి స్కూల్‌ కాంప్లెక్స్‌ విధులు బదలాయించాలి. దానివల్ల కొంత వరకైనా పనిభారం తగ్గుతుంది. పని సర్దుబాటు కింద మరో సబ్జెక్టు టీచర్‌ను అదనంగా ఇవ్వాలి. -రాజభాను చంద్ర ప్రకాశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం

2019-20 విద్యా సంవత్సరంలో దాదాపు 12 వేల విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. గత మూడేళ్ల నుంచి వారిని విధుల్లోకి తీసుకోవడం లేదు. కనీసం ఇన్‌ఛార్జి హెచ్‌ఎంలున్న చోట వారి స్థానంలో విద్యా వాలంటీర్‌ను నియమించినా కొంత వరకు విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: మునుగోడులో విజయం మనదే: సీఎం కేసీఆర్‌

దిల్లీకి నితీశ్​.. ప్రతిపక్షాలను కూడగట్టడమే లక్ష్యంగా విస్తృత పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.