ETV Bharat / sports

Tokyo Paralympics: విశ్వ క్రీడా సంబరం మళ్లీ మొదలైంది

author img

By

Published : Aug 24, 2021, 6:52 AM IST

Tokyo Paralympics 2020
టోక్యో పారాలింపిక్స్​ 2020

మరో విశ్వ క్రీడా సంబరానికి తెరలేచింది. టోక్యో వేదికగా పారాలింపిక్స్​ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభమయ్యాయి. వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదని చాటుతూ ప్రపంచం నలుమూలల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. రెండంకెల పతకాలే లక్ష్యంగా భారత్​ నుంచి 54 మంది ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌ సంబరాల్లో మునిగి తేలాక రెండు వారాలు విరామం తీసుకున్న క్రీడాభిమానులు ఇంకో ఆటల పండుగకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అదే టోక్యోలో మరో విశ్వ క్రీడా సంబరం మొదలు కాబోతోంది. 16వ పారాలింపిక్స్‌కు మంగళవారమే శ్రీకారం. వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదని చాటుతూ ప్రపంచం నలుమూలల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు తమ సత్తా చాటడానికి టోక్యోలో సిద్ధంగా ఉన్నారు. అందులో భారత యోధులు 54 మంది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంత పెద్ద జట్టుతో, భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న భారత బృందం.. రెండంకెల సంఖ్యలో పతకాలను లక్ష్యంగా పెట్టుకుంది.

భారత అథ్లెట్లు ఇప్పటిదాకా పారాలింపిక్స్‌లో సాధించిన పతకాలు 12. అయితే టోక్యోలో మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న పతకాలు 15 కావడం ఈసారి మన జట్టు ఎంత బలంగా ఉందో చెప్పడానికి రుజువు. టోక్యోలో మన పారా అథ్లెట్లు అయిదు స్వర్ణాలు సహా రెండంకెల సంఖ్యలో పతకాలు సాధించడం ఖాయం అన్న అంచనాలున్నాయి. పారాలింపిక్స్‌ చరిత్రలోనే అత్యధికంగా 54 మంది పారా అథ్లెట్లతో టోక్యోలో పతకాల వేటకు సిద్ధమైంది భారత్‌. అందులో ఇప్పటికే పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన దేవేంద్ర జజారియా, మరియప్పన్‌ తంగవేలు సహా స్టార్‌ అథ్లెట్లు చాలామందే ఉన్నారు. భారత బృందంలో వివిధ క్రీడలు, విభాగాల్లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న క్రీడాకారులు నలుగురుండగా.. ఆరుగురు ప్రపంచ రెండో ర్యాంకుల్లో ఉన్నారు. పది మంది మూడో ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. జావెలిన్‌ త్రోయర్‌ దేవేంద్ర ఇప్పటికే 2004, 2016 ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించాడు. తాను పోటీ పడే ఎఫ్‌-46 విభాగంలో దేవేంద్ర ప్రపంచ రికార్డుతో కొనసాగుతుండటం విశేషం. ఫామ్‌ను కొనసాగిస్తూ అతను కచ్చితంగా మరో పసిడిని సొంతం చేసుకుంటాడన్న అంచనాలున్నాయి.

అలాగే రియోలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం సాధించిన హైజంప్‌ క్రీడాకారుడు తంగవేలు మరోసారి బంగారు కొండగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో బరిలోకి దిగుతున్న సందీప్‌ చౌదరి ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ కావడం గమనార్హం. జావెలిన్‌ త్రోలో సుందర్‌ సింగ్‌, అజీత్‌ సింగ్‌ (ఎఫ్‌-46), నవ్‌దీప్‌ సింగ్‌ (ఎఫ్‌-41)ల మీదా మంచి అంచనాలే ఉన్నాయి. బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌వీ-3 విభాగంలో బరిలోకి దిగుతున్న ప్రపంచ నంబర్‌వన్‌, ప్రపంచ ఛాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ స్వర్ణానికి హాట్‌ ఫేవరెటే. ఎస్‌హెచ్‌-6 విభాగంలో బరిలోకి దిగుతున్న కృష్ణ ప్రపంచ రెండో ర్యాంకర్‌. అతడిపైనా మంచి అంచనాలే ఉన్నాయి.

ఎస్‌ఎల్‌-4లో తరుణ్‌ కూడా పతకానికి పోటీదారే. మహిళల బ్యాడ్మింటన్‌లో ఎస్‌ఎల్‌-3, ఎస్‌యు-5 విభాగాల్లో బరిలోకి దిగుతున్న పలక్‌ కోహ్లి భారత బృందంలోనే అత్యంత ఆకర్షణీయ అథ్లెట్‌. మరో షట్లర్‌ పారుల్‌ పర్మార్‌ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ కావడం విశేషం. ఆర్చరీలో రాకేశ్‌ కుమార్‌, శ్యామ్‌ సుందర్‌, జ్యోతి బలియాన్‌ (కాంపౌండ్‌).. వివేక్‌ చికారా, హర్విందర్‌ సింగ్‌ (రికర్వ్‌)ల పైనా మంచి అంచనాలున్నాయి. షూటింగ్‌లోనూ పేరున్న అథ్లెట్లే బరిలోకి దిగుతున్నారు. ఇంకా కనోయింగ్‌, స్విమ్మింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, తైక్వాండో క్రీడల్లో భారత పారా అథ్లెట్లు బరిలో ఉన్నారు. ఆరంభోత్సవం రోజు భారత క్రీడాకారులకు పోటీలేమీ లేవు. బుధవారం టేబుల్‌ టెన్నిస్‌తో భారత్‌ పోరాటం మొదలవుతుంది.

ఇదీ చదవండి: Tokyo paralympics: పారాలింపిక్స్​లో టైటిల్ ఫేవరెట్లు వీళ్లే

పతకాలు గెలవకున్నా విజేతలే

టోక్యోలో పతకాలు సాధించినా, సాధించకపోయినా టోక్యోలో బరిలోకి దిగుతున్న 54 మంది పారా అథ్లెట్లూ విజేతలే అని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. విశ్వ క్రీడల్లో బరిలోకి దిగుతున్న పారా అథ్లెట్లకు దేశమంతా అండగా నిలవాలని అతను కోరాడు. "టోక్యోలో బరిలోకి దిగుతున్న మన అథ్లెట్లకు మద్దతుగా నిలవాలని భారతీయులందరినీ కోరుతున్నా. వాళ్లంతా నిజ జీవిత హీరోలు. కాంక్ష, పట్టుదల ఉంటే ఏమైనా చేయొచ్చనడానికి వాళ్లే రుజువు. మనందరం వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఇటీవల ఒలింపిక్స్‌ హీరోలను ఎలా అయితే ఆదరించామో.. పారా ఒలింపిక్స్‌ అథ్లెట్ల మీదా అలాంటి ఆదరణే చూపాలి. పతకాలు గెలిచే వాళ్లే కాదు.. ఈ 54 మందిలో ప్రతి ఒక్కరూ విజేతలే. అందరి మీదా ఒకే రకమైన ప్రేమను చూపించాలి. ఈసారి పది పతకాలు వస్తాయంటున్నారు. కానీ ఇంకా ఎక్కువే గెలుస్తామనుకుంటున్నా" అని సచిన్‌ పేర్కొన్నాడు.

అఫ్గాన్‌ పతాకం అలాగే..

ఈసారి పారా ఒలింపిక్స్‌లో అఫ్గానిస్థాన్‌ అథ్లెట్లు పోటీ పడకపోయినా ఆ దేశ పతాకం ఆరంభోత్సవంలో ఎగరబోతోంది. ఇటీవలే అఫ్గాన్‌ తాలిబన్ల చేతికి చిక్కిన నేపథ్యంలో ఆ దేశం నుంచి టోక్యో పారాలింపిక్స్‌లో ఎవరూ పోటీ పడట్లేదు. దేశంలో అనిశ్చితికి తోడు విమాన ప్రయాణాల రద్దుతో ఆ దేశ అథ్లెట్లు టోక్యోకు రాలేకపోతున్నారు. అయితే అఫ్గాన్‌కు సంఘీభావం తెలుపుతూ ఆ దేశ పతాకాన్ని కొనసాగించాలని అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ నిర్ణయించింది.

చైనా ఆధిపత్యం

పారాలింపిక్స్‌లో చైనాదే ఆధిపత్యం. 2004 నుంచి అత్యధిక స్వర్ణాలు గెలుస్తున్న దేశం చైనానే. 2004లో 63 స్వర్ణాలు నెగ్గిన చైనా 2008లో 89, 2012లో 95, 2016లో 107 పసిడి పతకాలు నెగ్గింది.

  • పారాలింపిక్స్‌ను రెండోసారి నిర్వహించనున్న తొలి నగరం టోక్యో. 1964లోనూ అక్కడ ఈ క్రీడలు జరిగాయి.
  • 1960లో రోమ్‌లో తొలిసారి పారాలింపిక్స్‌ను నిర్వహించారు. అప్పుడు 23 దేశాల నుంచి 400 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
  • 1988 నుంచి ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ను ఒకే వేదికలో నిర్వహిస్తున్నారు.
  • ఈసారి పారాలింపిక్స్‌లో 163 దేశాల నుంచి 4500 అథ్లెట్లు పోటీ పడుతున్నారు. 22 క్రీడల్లో 540 పతక ఈవెంట్లున్నాయి.
  • ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన ఏకైక అథ్లెట్‌ పాల్‌ జెకర్స్‌. హంగేరికి చెందిన ఈ ఫెన్సర్‌ 1988 ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గాడు. 1991లో బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాక.. 1992 పారాలింపిక్స్‌లో వీల్‌ఛైర్‌ ఫెన్సింగ్‌లో పోటీపడి స్వర్ణం గెలుచుకున్నాడు.
  • ఈసారి అరంగేట్రం చేయనున్న క్రీడల సంఖ్య 2. బ్యాడ్మింటన్‌, తైక్వాండోలో పోటీలు నిర్వహించనున్నారు.
  • పారాలింపిక్స్‌లో అమెరికా స్విమ్మర్‌ ట్రిస్చా జోర్న్‌ గెలిచిన పతకాలు 55. అందులో 32 స్వర్ణాలున్నాయి. అత్యధిక పతకాల రికార్డు ఆమెదే.

ఇదీ చదవండి: పారాలింపిక్స్​కు అంతా సిద్ధం.. భారత అథ్లెట్లూ రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.