ETV Bharat / sports

కోహ్లీ-శాస్త్రి కాంబో.. అద్వితీయ విజయాలకు కేరాఫ్

author img

By

Published : Nov 8, 2021, 10:53 PM IST

kohli shastri
విరాట్​ కోహ్లీ

భారత క్రికెట్​లో మరో శకం ముగిసింది. టీమ్​ఇండియాను ప్రపంచ నెం.1 స్థాయిలో నిలబెట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లీ- ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri News) ప్రస్థానం సోమవారంతో ముగిసింది. అయితే వీరి ద్వయం (Virat Kohli news) విజయవంతమైందా.. లేదా? అని అనుకుంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వీరిద్దరూ ఎంతో మంది దిగ్గజాలకు సాధ్యం కాని ఫలితాలు సాధించడం ఒక ఎత్తయితే.. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం కూడా అంతే ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం.

భారత క్రికెట్ చరిత్రలో కీలక అధ్యాయం ముగిసింది. అంతర్జాతీయ టీ20ల నుంచి కెప్టెన్​గా విరాట్​ కోహ్లీ తప్పుకోగా, కోచ్​గా రవిశాస్త్రి బాధ్యతలు పూర్తిచేశాడు. 2017 జులైలో శాస్త్రి.. టీమ్‌ఇండియా (T20 world cup 2021) కోచింగ్‌ బాధ్యతలు అందుకున్నాడు. అంతకుముందు కోచ్‌ అనిల్‌ కుంబ్లేతో సారథి విరాట్‌ కోహ్లీకి అభిప్రాయ భేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమ్‌ఇండియా తొలిసారి ఒక ఐసీసీ ఈవెంట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓటమిపాలైంది. దీంతో కోహ్లీసేనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. అనంతరం సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌ సభ్యులుగా ఉన్న క్రికెట్‌ సలహా కమిటీ శాస్త్రిని కోచ్‌గా నియమించింది. అప్పటి నుంచి వరుసగా నాలుగేళ్లు టీమ్‌ఇండియా బాధ్యతలు చూసుకున్నాడీ మాజీ ఆల్‌రౌండర్‌.

kohli shastri
శాస్త్రి, కోహ్లీ

చారిత్రక గెలుపు.. కలచివేసే ఓటమి..

శాస్త్రి జట్టు బాధ్యతలు అందుకున్న తర్వాత టీమ్‌ఇండియా.. టెస్టుల్లో (Ravi Shastri record as captain) నంబర్‌వన్‌గా ఎదిగింది. మునుపెన్నడూ చూడని ఫలితాలు సాధించింది. 2017-18 దక్షిణాఫ్రికా పర్యటన, 2018 ఇంగ్లాండ్‌ పర్యటన మినహా మిగతా అన్ని సిరీసుల్లోనూ కోహ్లీసేన విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా 2018-19 ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీ-శాస్త్రి కాంబినేషన్‌ను ఆకాశానికి ఎత్తింది. ఆసియాలోని ఏ జట్టుకు వీలుకాని, ఏ భారత దిగ్గజ సారథికీ సాధ్యం కాని చారిత్రక విజయాన్ని టీమ్‌ఇండియా సొంతం చేసుకుంది. తొలిసారి 2-1 తేడాతో కంగారూల గడ్డపై సగర్వంగా కోహ్లీసేన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని ముద్దాడింది.

ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌లో టాప్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తయింది. ముఖ్యంగా బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉండి కూడా సెమీస్‌ లాంటి కీలకపోరులో తడబడింది. అప్పటికే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ కూడా ఆ మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. జడేజా (77), ధోనీ (50) మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. టీమ్ఇండియా విజయానికి చేరవలో వచ్చి ఓటమిపాలైంది. ఇది అభిమానులనే కాకుండా జట్టు సభ్యులను కూడా ఎంతో కలచివేసింది.

kohli shastri
కోచ్ రవి శాస్త్రి

టెస్టు ఛాంపియన్‌షిప్‌.. మరో చారిత్రక ఘట్టం..

ఆ ప్రపంచకప్‌ సమయంలోనే శాస్త్రి తొలుత రెండేళ్ల కోచింగ్‌ (ravi shastri retirement) కాంట్రాక్ట్‌ ముగిసింది. అయితే, బీసీసీఐ దాన్ని మళ్లీ 45 రోజులకు.. ఆపై మరో రెండేళ్లకు పొడిగించింది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమవ్వగా టీమ్ఇండియా వరుస విజయాలు సాధించింది. విండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లపై విజయఢంకా మోగించింది.

కొవిడ్‌-19కు ముందు గతేడాది ఆరంభంలో న్యూజిలాండ్‌ పర్యటనే కోహ్లీసేనకు షాకిచ్చింది. అక్కడ టెస్టు సిరీస్‌ కోల్పోయి ఇబ్బందులు పడింది. తర్వాత కరోనా లాక్‌డౌన్‌, ఆపై ఐపీఎల్‌ 2020 అనంతరం గతేడాది చివర్లో నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అయితే, 2018-19 పర్యటనలో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ లాంటి కీలక ఆటగాళ్లు లేని సమయంలో భారత్‌ ఆస్ట్రేలియాను ఓడించిందనే విమర్శలకు చెక్‌ పెడుతూ టీమ్‌ఇండియా మరోసారి చారిత్రక ఘట్టం ఆవిష్కరించింది.

ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్‌ను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టాప్‌ జట్టుగా అడుగుపెట్టింది. అయితే, అక్కడ కూడా కోహ్లీసేన.. విలియమ్సన్‌ టీమ్‌ చేతిలో ఓటమిపాలై ఐసీసీ ట్రోఫీని కోల్పోయింది. ఇలా కోహ్లీసేన.. రవిశాస్త్రి ఆధ్వర్యంలో బాగా ఆడినా రెండు ప్రధాన కప్పులను కోల్పోవడమే పెద్ద లోటుగా ఉంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ తర్వాత శాస్త్రి కాంట్రాక్ట్‌ ముగుస్తుండగా.. కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై (kohli retirement) చెప్పనున్నాడు. ఈ సారైనా ఐసీసీ ట్రోఫీ గెలిచి తీరాలనే కల కూడా చెదిరిపోయింది.

kohli shastri
రవి శాస్త్రి

శాస్త్రి రిపోర్ట్ కార్డు..

రవిశాస్త్రి (Ravi Shastri Coach Record) హయాంలో 43 టెస్టులు ఆడిన భారత్​.. 25 విజయాలను అందుకుంది. 13 ఓటములు, 5 డ్రాలు ఉన్నాయి. 76 వన్డేలు ఆడితే.. అందులో 51 విజయాలు, 22 ఓటములున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో 64 మ్యాచ్​లకుగానూ.. ఏకంగా 42 విజయాలు, 18 ఓటములున్నాయి.

kohli shastri
టీమ్​ఇండియా

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

చివరగా వీరిద్దరి కాంబినేషన్‌లో గణాంకాలు పరిశీలిస్తే టీమ్‌ఇండియా (virat kohli, ravi shstri book launch) మేటి ఫలితాలు సాధించిందనే చెప్పాలి. రవిశాస్త్రి పర్యవేక్షణలో కోహ్లీసేన విజయాల శాతం ఇదివరకు ఏ కెప్టెన్‌-కోచ్‌కు సాధ్యంకాని రీతిలో ఉన్నాయి. 1983 ప్రపంచకప్‌ ఆల్‌రౌండర్‌ శాస్త్రి.. హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో భారత్‌ మొత్తం 51 టెస్టులు ఆడగా అందులో 30 విజయాలు సాధించింది. అంటే విజయశాతం 58.80. అంతకుముందు జాన్‌రైట్‌ కాలంలో భారత్‌ 52 టెస్టులాడి 21 విజయాలే సాధించింది. ఆ తర్వాతే 2011 ప్రపంచకప్ అందించిన గ్యారీ కిర్‌స్టన్‌, డంకెన్‌ ఫ్లెచర్‌ ఉన్నారు. ఇక 91 వన్డే మ్యాచ్‌ల్లోనూ కోహ్లీసేన 57 విజయాలతో 62.64 విజయశాతంతో కొనసాగుతోంది.

kohli shastri
శాస్త్రి, విరాట్

ఇదీ చూడండి: టీ20 సారథిగా కోహ్లీ ప్రస్థానం.. ఇవే రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.