ETV Bharat / sports

'రాయుడిని అందుకే తీసుకోలేదు.. కెప్టెన్ సమక్షంలోనే జట్టు ఎంపిక'

author img

By

Published : Dec 14, 2021, 3:05 PM IST

Ravi Shastri on rayudu, sarandeep on ravishastri, రాయుడు రవశాస్త్రి, శరణ్​దీప్ సింగ్ రవిశాస్త్రి
Ravi Shastri

Sarandeep on Ravi Shastris comments: 2019 ప్రపంచకప్ జట్టులో అంబటి రాయుడికి చోటు దక్కలేదు. అలాగే జట్టులోకి ముగ్గురు కీపర్లను తీసుకున్నారు. ఈ విషయాలపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడాడు. రాయుడును ఆడించకపోవడం తప్పేనని అన్నాడు. అయితే ఈ విషయంలో తానేమీ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశాడు. తాజాగా ఇతడి మాటలపై స్పందించాడు అప్పటి సెలెక్షన్ కమిటీ సభ్యుడు శరణ్ సింగ్.

Sarandeep on Ravi Shastris comments: 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులో నాలుగో నంబర్‌ ఆటగాడిగా అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంలో రవిశాస్త్రి ప్రమేయం లేదని అప్పటి సెలెక్షన్‌ కమిటీ సభ్యుడు శరణ్‌ సింగ్‌ అన్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ తర్వాత హెడ్‌కోచ్‌గా పదవీకాలం ముగిసిన రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టు ఎంపికపై స్పందించాడు. అప్పుడు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ రాయుడిని పక్కనపెట్టి ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేసింది. ఇది అప్పట్లో పెద్ద దుమారంగా మారింది. రాయుడు కూడా సెలెక్షన్‌ కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ '3డీ' అంటూ వ్యంగ్యంగా ఓ ట్వీట్‌ చేశాడు.

అయితే, అతడిని ఎంపికచేయకపోవడానికి తాను కారణం కాదని, ఆ విషయంలో తానేమీ జోక్యం చేసుకోలేదని శాస్త్రి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అలాగే ఆ టోర్నీలో ముగ్గురు వికెట్‌ కీపర్లను (ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌) ఎందుకు ఎంపిక చేశారో అర్థంకాలేదని చెప్పాడు. దీనిపై తాజాగా స్పందించిన శరణ్‌సింగ్‌.. రవిశాస్త్రి చెప్పిందంతా నిజమేనని తెలిపాడు. రాయుడిని పక్కన పెట్టే విషయంలో శాస్త్రి జోక్యం లేదని పేర్కొన్నాడు. అయితే, తాము కూడా.. కెప్టెన్‌, కోచ్‌ల అభిప్రాయాలు తెలుసుకోకుండా జట్టును ఎంపిక చేయమని స్పష్టంచేశాడు. ఆ ప్రపంచకప్‌ టోర్నీకి ముందు టీమ్‌ఇండియా వరుస విజయాలు సాధించిందని, దాంతో తాము అందుకు తగ్గట్టే జట్టును ఎంపిక చేశామన్నాడు.

అనంతరం ముగ్గురు వికెట్‌కీపర్లను ఎందుకు ఎంపికచేశారనే విషయంపై స్పందించిన శరణ్‌సింగ్‌.. ఆ ముగ్గురూ మంచి బ్యాట్స్‌మన్‌ అని వివరించాడు. ధావన్‌ గాయపడినప్పుడు పంత్‌ను ఎంపిక చేశామని, అంతకుముందే కేఎల్‌ రాహుల్‌ రూపంలో జట్టులో మరో ఓపెనర్‌ ఉన్నాడని ఆయన గుర్తుచేశాడు. అందుకే మిడిల్‌ ఆర్డర్‌లో భారీ షాట్లు ఆడగలిగే బ్యాట్స్‌మన్‌ అయితే బాగుంటుందని పంత్‌ను ఎంపిక చేశామన్నాడు. అయితే, మ్యాచ్‌లు ఆడేటప్పుడు తుది జట్టులో ఎవరు ఉండాలనేది మాత్రం జట్టు యాజమాన్యం చూసుకుంటుందని మాజీ సెలెక్టర్‌ వివరించాడు. అందులో తమ ప్రమేయం ఉండదన్నాడు. సెలెక్టర్లుగా తమ బాధ్యతలు సరిగ్గానే నిర్వర్తించామని, కానీ కొన్నిసార్లు కొన్ని విషయాలు ఇలా నిరుత్సాహపరుస్తాయని తెలిపాడు. ఏదైనా కెప్టెన్‌ సమక్షంలోనే జట్టు ఎంపిక ఉంటుందని శరణ్‌సింగ్‌ అన్నాడు.

ఇవీ చూడండి: PAK vs WI: రికార్డు తిరగరాసిన పాక్.. టీ20ల్లో తొలి జట్టుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.