టీమ్ఇండియా క్రికెటర్ దీపక్ హోడా(Deepak Hooda) కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘకాలంగా దేశవాళీ క్రికెట్లో బరోడా జట్టుకు ఆడుతున్న అతడు, టీమ్కు వీడ్కోలు పలికాడు. బరోడా క్రికెట్ అసోసియేషన్ నుంచి నిరభ్యంతర పత్రం కూడా తీసుకున్నాడు. వచ్చే సీజన్లో రాజస్థాన్ తరఫున ఆడనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అతడే ప్రకటించాడు.
"సుదీర్ఘకాలంగా ఆడిన బరోడా జట్టును వీడడం బాధగా ఉంది. కానీ ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నాను. నా కోచ్లు శ్రయోభిలాషులుతో కూడా ఈ విషయమై చర్చించాను" అని హోడా అన్నాడు.
ఇదీ జరిగింది
ఈ ఏడాది జనవరిలో 'సయ్యద్ ముస్తాక్ అలీ టీ20' సమయంలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బరోడా సారథి కృనాల్ పాండ్యపై(Krunal Pandya) దీపక్ హుడా ఆరోపణలు చేశాడు. అప్పుడు మ్యాచ్లు కూడా ఆడకుండానే బయోబబుల్ నుంచి బయటకొచ్చేశాడు. దీంతో అతడిపై ఏడాది పాటు యాజమాన్యం నిషేధం విధించింది.
అనంతరం కృనాల్ పాండ్యతో జరిగిన వివాదం వల్ల ఒత్తిడి, నిరాశకు గురైనట్లు వివరణ ఇచ్చాడు హోడా. అందుకే తాను జట్టు నుంచి వీడినట్లు బీసీఏ సెక్రటరీ అజిత్ లేలేకు లేఖ రాశాడు. ఈ క్రమంలోనే అతడు జట్టుకు వీడ్కోలు పలికాడు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న బోర్డు ఇప్పుడు అతడికి అభ్యంతర పత్రాన్ని ఇచ్చింది."అతడికి అభ్యంతర పత్రము ఇచ్చాము. బరోడా జట్టుకు అతడు వీడ్కోలు పలకడం దురదృష్టకరం. జరిగన గొడవను హోడా, కృనాల్ సరైన రీతిలో పరిష్కరించుకుంటారని భావిస్తున్నాను." అని లేలే అన్నారు.
2013నుంచి బరోడా తరఫున హోడా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 46ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు(2,908 పరుగులు, 20 వికెట్లు), 68లిస్ట్-ఏ మ్యాచ్లు(2,059, 34) ఆడాడు.
ఇదీ చూడండి: పాండ్యతో గొడవ.. టోర్నీ నుంచి తప్పుకున్న హుడా