ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్ ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది ఆసీస్. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 312/6 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. కామెరాన్ గ్రీన్(84; 132 బంతుల్లో 8x4, 4x6) ఔటయ్యాక కెప్టెన్ టిమ్పైన్(39; 52 బంతుల్లో 6x4) ఈ నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే రెండో సెషన్ పూర్తి కాగా, బుమ్రా వేసిన ఆ 87వ ఓవర్ చివరి బంతికి గ్రీన్ ఔటయ్యాడు. దీంతో ఆసీస్ 312 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు టిమ్పైన్తో కలిసి అతడు 104 పరుగుల శతక భాగస్వామ్యం నిర్మించాడు.
ఇక తొలి సెషన్లో 182/4తో నిలిచిన ఆస్ట్రేలియా రెండో సెషన్లో రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. భోజన విరామం తర్వాత కాసేపటికే స్మిత్(81).. అశ్విన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుతిరిగాడు. ఆపై జోడీ కట్టిన గ్రీన్, పైన్ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే, రెండో సెషన్ ముగిసే ముందు ధాటిగా ఆడిన గ్రీన్ అనుకోకుండా సాహా చేతికి చిక్కాడు.
ఇదీ చూడండి: జడేజా విషయంలో భారత్కు ఎదురుదెబ్బ