ETV Bharat / sitara

లోకల్ కథకు విదేశీ సాంకేతికత తోడైతే.. అద్భుతహా!

author img

By

Published : May 20, 2021, 8:45 AM IST

Hollywood cinematographers
లీవుడ్​ సినిమాటోగ్రాఫర్స్​

సినిమాటోగ్రాఫర్​.. ఏ దృశ్యమైనా ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్లుగా చూపించేవాడు. ప్రస్తుతం మన తెలుగు చిత్రసీమ దర్శక నిర్మాతలు సినీప్రియులను కట్టిపడేసేందుకు.. సన్నివేశాలను హాలీవుడ్​ సినిమాటోగ్రాఫర్స్​తో తెరకెక్కిస్తున్నారు. మరి ఏఏ చిత్రాలకు హాలీవుడ్​ సినిమాటోగ్రాఫర్స్​ పనిచేశారో ఓ సారి చూద్దాం.

ఏ దృశ్యమైనా చూపించే విధానంలో కొత్తదనముంటే.. అది ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అందుకే ఆధునిక సాంకేతిక అందిపుచ్చుకుని వెండితెర మీద వెలుగులు పంచేందుకు వినూత్న రీతిలో ముందుకు వస్తున్నారు మన దర్శక నిర్మాతలు. మారుతున్న ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా.. తెలుగు వెండితెరపై హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్స్​తో సన్నివేశాలను అలంకరిస్తున్నారు. మన సినిమాటోగ్రాఫర్లు వీరికి ఏమాత్రం తీసిపోని విధంగా చిత్రాలు తీస్తున్నా, వీరికి డేట్లు సర్దుబాటు కావడం లేదు. దీంతో కథకు తగ్గట్లు పని చేసే విదేశీ కెమెరామెన్లతో రంగంలోకి దిగడానికి దర్శక నిర్మాతలు ఏ మాత్రం వెనకాడటం లేదు. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో పలు సినిమాలకు హాలీవుడ్ కెమెరామెన్లు పనిచేస్తున్నారు. దృశ్య కావ్యాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.

స్పెయిన్ నుంచి.. విరాటపర్వం దాకా..

తెలుగు చిత్రసీమలో చిరకాలం గుర్తుండిపోయే నటుల్లో అలనాటి సావిత్రి ఒకరు. ఆమె జీవితం ఆధారంగా 2018లో 'మహానటి' తెరకెక్కింది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించిన కీర్తి సురేష్​కే కాదు.. ఆనాటి మధుర దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ఈతరం ప్రేక్షకులకు చూపించిన కెమెరామెన్ డానీకీ ప్రశంసలు దక్కాయి. ఐదు భాషలు అలవోకగా మాట్లాడగలిగే డానీ సాంచెజ్ లోపెజ్​ది స్పెయిన్. సినిమాటోగ్రఫీ విభాగంలో పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పలు విశ్వవిద్యాలయాల్లో విజువల్ ఆర్ట్స్ గురించి చదువుకోవడమే కాదు.. పాఠాలు నేర్పారు. 2014లో హిందీ చిత్రం 'తమాన్​చే', 2018లో 'ఇష్కిరియా'కు పనిచేశారు. 'మహానటి'తో తెలుగు తెరకు పరిచయమై మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం రానా దగ్గుబాటి, సాయిపల్లవి కలయికలో.. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'విరాటపర్వం'కు సినిమాటోగ్రాఫర్​గా పనిచేస్తున్నారు. 1990లో తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, కోలో కోలో.. పాటలోని విజువల్స్ డానీ పనితనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ముందు ఈ చిత్రానికి తెలుగు సినిమాటోగ్రాఫర్ జయకృష్ణా గుమ్మాడి పనిచేశారు. తర్వాత డేట్స్ సర్దుబాటుకాక, డానీ, ఆయన స్థానంలో ప్రవేశించారు. ప్రస్తుతం నాగ్​ అశ్విన్- ప్రభాస్ కలయికలో రూపొందనున్న చిత్రానికి డానీనే సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టనున్నారు.

పోలెండ్ మిరోస్లా.. ఇక్కడ క్యూబా

2005లో 'పిట్బుల్' అనే టీ.వీ సిరీస్​తో మొదలైంది మిరోస్లా క్యూబా బ్రొజేక్​ ప్రస్థానం. అలా 2018 వరకూ వరుసగా పోలెండ్ దేశంలో టీ.వీ సిరీస్​తో పాటు మ్యూజిక్ వీడియోస్​కు దర్శకత్వం వహించారాయన. ఆ రెండు విభాగాల్లోనే కాకుండా కెమెరా, నటుడు, రచయిత, ఎడిటర్ గానూ గుర్తింపు పొందారాయన. పొలిష్ భాషలో విడుదలైన 'బోటాక్స్' (టీవీ సీరిస్), 'ఉమెన్ ఆఫ్ మాఫియా-2', 'ది ప్లేగ్ ఆఫ్ బ్రెస్​లా' చిత్రాలకు సినిమాటోగ్రాఫర్​గా పనిచేశారు. 2019లో నాని 'గ్యాంగ్​లీడర్​'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. మిరోస్లా అన్న పేరు కాస్త తెలుగు గడ్డకు పరిచమయ్యాక 'క్యూబా'గా మారింది. ప్రస్తుతం ఈ క్యూబా అల్లు అర్జున్- సుకుమార్ కలయికలో రానున్న పాన్​ ఇండియా చిత్రం 'పుష్ప'తో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పుష్ప పరిచయ టీజర్​లో విజువల్స్​కు అల్లుఅర్జున్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

శాన్ ఫ్రాన్సిస్కో 'వైల్డ్ డాగ్'

2016లో విడుదలైన అడివి శేష్ 'క్షణం'తో తన కెమెరా పనితనం చూపించి మెప్పించారు శాన్​ఫ్రాన్సిస్కోకు చెందిన షానీల్ డియో. మిస్టరీ-థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు మంచి విజువల్స్ అందించి అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్నారు. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మ్యూజిక్ వీడియో ఎడిటర్, రీల్స్ హైలైట్ విభాగాల్లో పని చేసిన షానిల్ డిజిటల్ మీడియా కోర్స్ చేశారు. 2018లో విడుదలైన అడవి శేష్ 'గూఢచారి'కి పనిచేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన అనుష్క నిశ్శబ్దం చిత్రానికి షానీల్​యే కెమెరామెన్​. నాగార్జున వైల్డ్​డాగ్​కు షానీల్ డియో పనిచేశారు. పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఆహిషోర్ సోల్మన్ దర్శకుడు. ఈ చిత్రానికి షానిల్ కెమెరా వర్క్ ఓ ప్లస్ పాయింట్​గా నిలిచింది.

మరికొందరు..

అమెరికాకు చెందిన షేల్డన్ చా.. గతనెల విడుదలైన మంచు విష్ణు నటించిన 'మోసగాళ్లు'తో తెలుగు తెరకు సినిమాటోగ్రాఫర్​గా పరిచయమ్యారు. తెలుగులో ఆయనకిది తొలిచిత్రం. హాలీవుడ్​లో 'నైజిరియన్ ప్రిన్స్', 'నాఫీస్ ఫాదర్', సమ్మర్ నైట్​లతో ప్రశంసలందుకున్నారు.

తమిళ నటుడు ధనుష్​, భారత్​ బాలా దర్శకత్వంలో నటించిన చిత్రం మార్యాన్​. బాక్సాఫీస్​ వద్ద సత్తాచాటిన ఈ చిత్రానికి నిసిమాటోగ్రాఫర్​గా పనిచేసింది బెల్జియం దేశానికి చెందిన మార్క్​ కొనిక్స్​. 2008లో మార్క్​ తెరకెక్కించిన చిత్రం జానీ మ్యాడ్​ డాగ్​ కేన్​స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లోనూ అవార్డునూ కైవసం చేసుకోవడం విశేషం.

క్రమంగా మార్పు వస్తోంది

"నటులే కాదు.. సాంకేతిక నిపుణులు కూడా చిత్రానికి జీవం పోస్తారు. కొన్నేళ్లుగా ప్రేక్షుకుడి దృష్టికోణంలో మార్పు వచ్చింది. సన్నివేశాన్ని మరింత బలంగా చూపించేందుకు హాలీవుడ్ మార్క్​ను అందుకుంటుంది మన తెలుగు పరిశ్రమ. కొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమ విదేశీ సినిమాటోగ్రాఫర్స్​కు స్వాగతం పలుకుతోంది. ప్రతిభ ఉన్నవారికి ఇక్కడ చక్కటి పనితో పాట గుర్తింపు లభిస్తోంది."

- ఓ ఇంటర్వ్యూలో సినిమాట్రోగాఫర్ సెంథిల్ కుమార్​.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.