ETV Bharat / opinion

కేవలం ఉద్యోగులకే టీకా ఇస్తే.. ఫలితం తక్కువే

author img

By

Published : Apr 11, 2021, 6:16 AM IST

necessity of vaccination for all age groups
కేవలం ఉద్యోగులకే టీకా ఇస్తే.. ఫలితం తక్కువే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలి విడతలో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందికి, పోలీసు, రెవిన్యూ తదితర శాఖల సిబ్బందికి టీకాలు వేశాయి. తరవాత పెద్ద వయసువారికి, 45 ఏళ్లు పైబడి, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రాధాన్య ప్రాతిపదికపై టీకాలు వేస్తున్నాయి. కనీసం 100 మంది ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సాధికార వ్యాక్సినేషన్‌ కేంద్రాలతో పొత్తు పెట్టుకుని తమ సిబ్బందికి కొవిడ్‌ టీకాలు వేయవచ్చని కేంద్రం ప్రకటించింది. ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఇంటి నుంచి బయటికెళ్ళే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల స్త్రీపురుషులకు టీకాలు వేయడం, కొవిడ్‌తో గాడి తప్పిన ఆర్థిక రథాన్ని వేగంగా పట్టాలెక్కించేందుకు తోడ్పడుతుంది. కానీ, కుటుంబ పెద్దకు మాత్రమే టీకా వేసి, భార్యాపిల్లలను విస్మరించడం సమస్యగానే మారుతుంది.

భారతదేశంపై కరోనా వైరస్‌ రెండోసారి పంజా విసరుతోంది. కొత్త కేసులు రోజుకు లక్ష దాటిపోతుంటే, పలు రాష్ట్రాలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలి విడతలో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందికి, పోలీసు, రెవిన్యూ తదితర శాఖల సిబ్బందికి టీకాలు వేశాయి. తరవాత పెద్ద వయసువారికి, 45 ఏళ్లు పైబడి, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రాధాన్య ప్రాతిపదికపై టీకాలు వేస్తున్నాయి. ఇప్పటికి సుమారు 9.81 కోట్ల డోసులకు పైగా టీకాలు ఇచ్చారు. ఈ నెల 11 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ సిబ్బందికి టీకాలు వేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కనీసం 100 మంది ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సాధికార వ్యాక్సినేషన్‌ కేంద్రాలతో పొత్తు పెట్టుకుని తమ సిబ్బందికి కొవిడ్‌ టీకాలు వేయవచ్చని కేంద్రం ప్రకటించింది. ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఇంటి నుంచి బయటికెళ్ళే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల స్త్రీపురుషులకు టీకాలు వేయడం, కొవిడ్‌తో గాడి తప్పిన ఆర్థిక రథాన్ని వేగంగా పట్టాలెక్కించేందుకు తోడ్పడుతుంది. కానీ, కుటుంబ పెద్దకు మాత్రమే టీకా వేసి, భార్యాపిల్లలను విస్మరించడం సమస్యగానే మారుతుంది. ఉత్పరివర్తన చెందిన కొత్త రకం కరోనా వైరస్‌లు బాలలకు, యుక్త వయస్కులకూ సోకుతున్నట్లు వార్తలు వస్తున్నా, వారికి వేయదగ్గ టీకాల గురించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రిటన్‌లో 30 ఏళ్లలోపు వారికి ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్‌) బదులు ఫైజర్‌, మోడెర్నా టీకాలను అందించబోతున్నారు. జులైకల్లా వయోజనులందరికీ టీకాలు వేయాలని బ్రిటన్‌, అమెరికా లక్షిస్తున్నాయి. భారత్‌ అప్పటికి కనీసం 45 ఏళ్లకు పైబడినవారికైనా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయగలదా అంటే, అనుమానమే. దేశంలో ఈ వయోవర్గంలో ఉన్నవారు 35 కోట్లకు పైనే. వీరందరికీ రెండు డోసుల టీకాలు అందించాలంటే 70 కోట్ల డోసులు అవసరం. ఈ నెల అయిదో తేదీ నాటికి మొదటి డోసు టీకా పడినవారి సంఖ్య దాదాపు ఏడు కోట్లే. ప్రస్తుతం రోజుకు సగటున సుమారు 39 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు.

కార్మికులకు సత్వరమే ఇవ్వాలి

కేవలం వయసును బట్టి టీకాలు వేయడం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు తోడ్పడదు. అమెరికాలో మొదటి దశలో పెద్ద వయసు వారికి, అత్యవసర సిబ్బందికి టీకాలు వేసినా, రెండో దశలో ఆర్థిక పునరుజ్జీవనానికి కీలకమైన ఫ్యాక్టరీ కార్మికులు, సేవా రంగ సిబ్బంది, రవాణా, చిల్లర విక్రయ సిబ్బందికి టీకాలు వేయబోతున్నారు. భారత్‌ కూడా ఫ్యాక్టరీ కార్మికులు, డ్రైవర్లు, దుకాణదారులు, పెట్రోలు బంకు ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డుల వంటి వారికి ప్రాధాన్య ప్రాతిపదికన టీకాలు వేయాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అధ్యయనం సిఫార్సు చేస్తోంది. ఆ పని చేయాలంటే ఇప్పుడున్న టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచాల్సి ఉంటుంది. దీనికి భారత ప్రభుత్వం సైతం అమెరికాలో మాదిరి కొవిడ్‌ వ్యాక్సిన్‌ కంపెనీలకు భారీగా నిధులు అందించాలి. కానీ, భారత్‌ బయోటెక్‌, క్యాడిలా కంపెనీలు సొంత నిధులతోనే వ్యాక్సిన్‌ రూపకల్పన, ఉత్పత్తి చేపట్టాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బయొలాజికల్‌ ఇ, అరవిందో ఫార్మాలదీ అదే బాట. 30 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తికి మూడు నుంచి నాలుగు కోట్ల డాలర్ల పెట్టుబడి అవసరం. ఈ కంపెనీలన్నింటికీ రాగల ఏడెనిమిది నెలల్లో నెలకు 15-20 కోట్ల డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అందుకు రాగల నాలుగు నెలల్లో 20 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిధులు సమకూర్చి ఉంటే, వ్యాక్సిన్‌ ఉత్పత్తి ఎంతో ఊపందుకునేది. సర్కారు ఆ పని చేయకపోగా, వ్యాక్సిన్‌ కంపెనీల నుంచి ఒక్కో డోసును రూ.150కి కొని ప్రజలకు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా టీకా వేస్తున్నా, ప్రైవేటు ఆస్పత్రుల్లో డోసుకు రూ.250 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది చాలా తక్కువ ధర అని, ప్రైవేటు విపణిలో ఒక్క డోసు ధర రూ.1,000 వరకు పలుకుతోందని సీరమ్‌ అధినేత అదార్‌ పూనావాలా అంటున్నారు. విదేశాలకు ఒక్కో డోసును 10 డాలర్ల ధరకు, స్వదేశంలో ప్రైవేటు మార్కెట్లకు కనీసం రూ.400-500 ధరకు విక్రయించగలిగితేనే తాము మార్కెట్లో నిలదొక్కుకోగలమని ఇతర వ్యాక్సిన్‌ కంపెనీలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇవ్వజూపుతున్న ధరకు రష్యన్‌ స్పుత్నిక్‌ టీకాలైనా లభ్యం కావనే చెప్పాలి. ఇక డోసుకు 25-35 డాలర్ల ధర పలికే ఫైజర్‌, మోడెర్నా టీకాల సంగతైతే- వేరే చెప్పనక్కర్లేదు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో 30 శాతాన్ని ప్రైవేటు మార్కెట్లకు, మిగతా 70 శాతాన్ని ప్రభుత్వానికి అందించే వెసులుబాటును భారతీయ టీకా కంపెనీలకు అందిస్తే- ఉత్పత్తి, సరఫరాలు మెరుగుపడతాయి.

సై అంటున్న కార్పొరేట్లు

ఈ నేపథ్యంలో కంపెనీలకు వ్యాక్సినేషన్‌ అవకాశాన్ని అందించడం చాలా ముఖ్య పరిణామం. కిరణ్‌ మజుందార్‌ షా, అజీమ్‌ ప్రేమ్‌ జీ, ఆనంద్‌ మహీంద్రా వంటి కార్పొరేట్‌ అధిపతులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగస్వాములు కావడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. ప్రైవేటు రంగాన్ని కలుపుకొనిపోతే కేవలం రెండు నెలల్లో 50 కోట్లమందికి టీకాలు వేయవచ్చని ప్రేమ్‌ జీ అంటున్నారు. తాము కేవలం 45 రోజుల్లోనే అయిదు కోట్లమందికి టీకాలు వేయగలమని అపోలో ఆస్పతుల ఉపాధ్యక్షురాలు శోభన కామినేని ఒక ఆంగ్ల దినపత్రికకు తెలిపారు. రిలయన్స్‌, హెచ్‌.డి.ఎఫ్‌.సి, టీసీఎస్‌ వంటి ప్రైవేటు కంపెనీలకు, స్టేట్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, భారతీయ రైల్వేలకు లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీలే సొంతంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపడితే టీకా ప్రక్రియ వేగం పుంజుకొంటుంది. దేశంలోని 40,000 పైచిలుకు సాధికార వ్యాక్సినేషన్‌ కేంద్రాలపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రభుత్వం తమకు కార్యనిర్వహణ స్వేచ్ఛనిస్తే 2,000 వ్యాక్సిన్‌ కేంద్రాలను, 6,000 మంది సుశిక్షిత వ్యాక్సినేషన్‌ సిబ్బందిని మోహరించగలమని శోభన కామినేని చెబుతున్నారు. మార్కెట్‌ ధరకే టీకాలు కొనే స్థోమత స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ అయిన 200 భారీ కంపెనీలకు దండిగా ఉంది. వీటికి కార్యాలయ ప్రాంగణాల్లో సొంత క్లినిక్‌లతో పాటు వైద్యులు, నర్సులు ఉంటారు. ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కార్యాలయ ప్రాంగణాల్లో టీకాలు వేస్తే, వ్యాక్సినేషన్‌ యంత్రాంగంపై ఒత్తిడి తగ్గుతుంది. సిబ్బందికి ఉచితంగా టీకాలు వేయడానికి ఇన్ఫోసిస్‌, యాక్సెంచర్‌ వంటి టెక్‌ కంపెనీలు సన్నద్ధత వ్యక్తం చేశాయి. ప్రభుత్వం అల్పాదాయ వర్గాలకు ఉచితంగా, తక్కువ ధరకు టీకాలను ఇస్తూ అధికాదాయ వర్గాలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫైజర్‌ బయాన్‌ టెక్‌, మోడెర్నా వంటి ఖరీదైన టీకాలను తీసుకునే సౌలభ్యం కల్పించవచ్చు. వీటిని అతిశీతల ఉష్ణోగ్రతలో ప్రత్యేక ఫ్రిడ్జ్‌లలో నిల్వచేసే సత్తా కార్పొరేట్‌ సంస్థలు, ప్రైవేటు ఆస్పత్రులకు ఉంటుంది. తమ టీకాను భారత్‌ లోనే ఉత్పత్తి చేయదలిస్తే, అందుకు లైసెన్సు ఇస్తామని ఫైజర్‌ కంపెనీ ఇచ్చిన ఆఫరును ప్రభుత్వం పరిగణించాలి.

- ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.