ETV Bharat / opinion

బీజేపీ X కాంగ్రెస్​.. ఆ ఐదు చోట్ల MES గట్టి పోటీ.. బెళగావిపై పట్టు ఎవరిదో?

author img

By

Published : Apr 27, 2023, 5:14 PM IST

karnataka elections 2023Belagavi
karnataka elections 2023Belagavi

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీ తలపడుతున్నాయి. ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాలతో ఓటర్లను ఆకర్షించేందుకు కృషిచేస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రతో సరిహద్దు జిల్లా అయిన బెళగావిపై ప్రత్యేక దృష్టిసారించాయి. లింగాయత్​లకు పట్టున్న జిల్లా కావడం వల్ల మెజార్టీ స్థానాలపై బీజేపీ విశ్వాసంతో ఉండగా.. గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సైతం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

కర్ణాటక రాజకీయాల్లో బెళగావి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో బెంగళూరు అర్బన్‌ జిల్లా తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలు బెళగావిలోనే ఉండగా.. మహారాష్ట్రతో సరిహద్దు ఉండడం వల్ల మరాఠాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జార్కిహోళి, జల్లి, కట్టి వర్గాలకు ఈ జిల్లాలో మంచి పట్టు ఉంది. అయితే ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ జిల్లాలో మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 13 చోట్ల లింగాయత్​లు, మిగతా ఐదు చోట్ల మరాఠీ మాట్లాడేవారి ప్రభావం ఎక్కువగా ఉంది.

అయితే ఈ ఐదు నియోజకవర్గాల్లో మహారాష్ట్ర ఏకీకరణ సమితి- MES ప్రధాన పార్టీలకు గట్టి పోటీగా నిలుస్తోంది. ఈ పార్టీకి శివసేన- ఎన్​సీపీ మద్దతు ఉంది. బెళగావి జిల్లాలో గత రెండు దశాబ్దాలుగా బీజేపీ మెజార్టీ స్థానాలను గెల్చుకుంటూ వస్తోంది. కానీ ఈసారి బీజేపీని నాయకత్వలేమి సమస్య వెంటాడుతోంది. ప్రముఖ లింగాయత్ నేత బీఎస్​ యడియూరప్పను బీజేపీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఎన్నికల్లో బీజేపీకి యడియూరప్ప మద్దతు ఇస్తున్నప్పటికీ.. మునుపటి స్థాయిలో చురుగ్గా లేకపోవడం సమస్యగా మారింది. దీనికితోడు ప్రముఖ నేతలైన సురేశ్ అంగడి, ఉమేశ్‌ కట్టి చనిపోవడం పార్టీకి తీరని లోటుగా పరిణమించింది. మూడుసార్లు బీజేపీ ఎమ్మల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సావడికి టిక్కెట్ ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్‌లో చేరారు.

అయితే జార్కిహోళి వర్గంలో కీలక నేత అయిన రమేశ్ జార్కిహోళి, ఆయన సోదరుడు బాలచంద్ర కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. మరో ప్రముఖ వర్గమైన జల్లి నుంచి మంత్రి శశికళ, ఆమె భర్త, లోక్​సభ సభ్యుడు అన్నాసాహెబ్ జిల్లాలో బీజేపీకి దన్నుగా నిలుస్తున్నారు. కట్టి వర్గానికి చెందిన రమేశ్ కట్టి, ఆయన బంధువు నిఖిల్ కట్టి కూడా బీజేపీ నుంచి పోటీలో నిలిచారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వంటి దిగ్గజాలతో బీజేపీ పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది.

ప్రముఖ లింగాయత్ నేత అయిన లక్ష్మణ్ సావడి రాకతో కాంగ్రెస్‌ పార్టీ కొత్త ఉత్సాహంతో ఉంది. మరికొందరు స్థానిక నేతలు కూడా పార్టీలో చేరడం వల్ల ఈ సారి బెళగావి జిల్లాలో బీజేపీపై ఆధిక్యం సాధిస్తామనే విశ్వాసంతో ముందుకెళుతోంది. అయితే 2019లో కీలక నేత రమేశ్‌ జార్కిహోళి కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరడం ప్రతికూలంగా మారింది.
మరోవైపు మహారాష్ట్రకు సరిహద్దు జిల్లా కావడం వల్ల మహారాష్ట్ర ఏకీకరణ సమితి సరిహద్దు సమస్యను చాలా గట్టిగా వినిపిస్తూనే ఉంది. జిల్లాలో 40 శాతం ఓటర్లు మరాఠీ మాట్లాడేవారే కావడం వల్ల ఆ పార్టీ ప్రభావం ఈసారి ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బెళగావి జిల్లాలో మొత్తం 18 స్థానాలకు బీజేపీ 10చోట్ల విజయం సాధించగా... కాంగ్రెస్ 8చోట్ల గెలిచింది. కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు.

కర్ణాటకలో 16వ అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలు అదే నెల 13న వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలుండగా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.