ETV Bharat / opinion

పక్కా లోకల్​ మంత్రం.. బీజేపీ ఉచ్చుకు దూరం.. కాంగ్రెస్​ జయకేతనం

author img

By

Published : May 13, 2023, 2:23 PM IST

Updated : May 14, 2023, 3:48 PM IST

karnataka assembly election 2023 congress won
karnataka assembly election 2023 congress won

పక్కా లోకల్​ మంత్రంతో కన్నడ నాట కాంగ్రెస్​ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. జాతీయ అంశాలను లేవనెత్తిన బీజేపీకి షాక్​ ఇచ్చి జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా.. కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తున్న మార్పు సంప్రదాయమే మళ్లీ కొనసాగింది. మరి కాంగ్రెస్​ విజయానికి కారణాలేంటి?

Karnataka Election Results 2023 Congress : కర్ణాటక రాజకీయ చరిత్రలో ఆనవాయితీగా వస్తున్న మార్పు సంప్రదాయమే గెలిచింది. స్థానిక అంశాలకు ప్రాధాన్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీ​ జయకేతనం ఎగురవేసింది. ప్రచార సమయంలో పలు జాతీయ అంశాలను లేవనెత్తి అధికారాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన బీజేపీకి గట్టి షాక్ ​ఇచ్చింది. వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న కమల దళం ఆశలకు గండి కొట్టింది. మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్​ 135 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 66 అసెంబ్లీ స్థానాలను గెలుపొందగా.. జేడీఎస్​ 19 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ జోరుకు కారణాలేంటి?

మొత్తం సీట్లు224
కాంగ్రెస్​135
బీజేపీ66
జేడీఎస్​19
ఇతరులు 4

బీజేపీ ఉచ్చుకు దూరం!
Congress Won Reasons : కన్నడ నాట మరోసారి అధికారం చేపట్టాలని శతవిధాలా ప్రయత్నించిన బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. కమల దళం ఉచ్చులో పడకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని హస్తం పార్టీ.. అధికారాన్ని కైవసం చేసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి వంటి జాతీయ అంశాలను లేవనెత్తి కర్ణాటక ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ముందే పసిగట్టింది కాంగ్రెస్. ఆ వివాదాస్పద విషయాల్ని పెద్దగా పట్టించుకోకుండా.. స్థానిక సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించింది. కాంగ్రెస్​ హామీల్లో ఒకటైన బజరంగ్​దళ్, పీఎఫ్​ఐ​ నిషేధంపై వ్యతిరేకంగా నరేంద్ర మోదీ వంటి అగ్రనేతలు ప్రచారం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది!

karnataka assembly election 2023 congress won
ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ

"40 శాతం కమీషన్​ ప్రభుత్వంతో కన్నడ ప్రజలు విసిగిపోయారని ముందే గ్రహించాం. కాంట్రాక్టర్ల సంఘం చెప్పిన విషయాల్ని హైలైట్ చేశాం. ప్రచారం ముగిసే సమయానికి బొమ్మై సర్కార్ అవినీతిని రిపోర్ట్ కార్డు రూపంలో బయటపెట్టాం. వివిధ రకాల పనులు, నియామకాల కోసం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వసూళ్లను ప్రముఖంగా ప్రస్తావించాం.కన్నడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని.. వారికి కచ్చితంగా ఉపశమనం అవసరమని గ్రహించాం. అందుకే ఐదు ఉచిత హామీలను కురిపించాం. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రచారం కేవలం కాంగ్రెస్​పై దూషణలు తప్ప ఏం లేవు. రెండు పార్టీల ప్రచారాలను ప్రజలు బాగా గమనించారు" అని కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్​ నాయకుడు బీకే హరిప్రసాద్​.. కొద్ది రోజుల క్రితమే ఈటీవీ భారత్​తో తెలిపారు.

"పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్​, ప్రియాంక.. రాష్ట్రవ్యాప్తంగా చేసిన ప్రసంగాల్లో బొమ్మై సర్కార్​ అవినీతి, ఐదు ఉచిత హామీలను పదేపదే ప్రస్తావించారు. సోషల్ మీడియా బృందాలు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా రూపొందించిన యానిమేషన్ వీడియో క్లిప్‌లు, చార్టుల ద్వారా మా మ్యానిఫెస్టోను ప్రచారం చేశాయి. మా పార్టీ అగ్రనేతలు చైనా, అదానీ, కశ్మీర్​ అంశాలను లేవనెత్తలేదు. అది మాకు ఉపయోగకరం" అని కాంగ్రెస్​ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు ప్రకాష్ రాఠోడ్ చెప్పారు. దాదాపు 70 మంది ఏఐసీసీ పరిశీలకులు నియోజకవర్గాల వారీగా ఓటర్లకు ఐదు హామీలను వివరించేందుకు ఇంటింటికి వెళ్లినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు.. ఈటీవీ భారత్​తో తెలిపాయి.

హామీలు అందించిన విజయం!
Karnataka Congress Manifesto : కర్ణాటకలో కాంగ్రెస్​ను హామీలు కూడా అధికారాన్ని అప్పజెప్పాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలకు చాలా రోజుల ముందే ఉచిత కరెంటు, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి వంటి ఐదు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. అధికారంలోకి వస్తే 'గృహజ్యోతి' కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించకముందే హామీ ఇచ్చారు.

karnataka assembly election 2023 congress won
ఎన్నికల ప్రచారంలో రాహుల్​, ప్రియాంక

మహిళా ఓటర్లకు ప్రత్యేక హామీలు!
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు 'గృహలక్ష్మి' పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల 2వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 'అన్న భాగ్య యోజన' పేరుతో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు నెల రూ.3 వేలు ఇస్తామని ప్రకటించింది. మహిళలను ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రోజే అమలుపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆ తర్వాత మ్యానిఫెస్టో విడుదల సమయంలోనూ అనేక హామీలు కురిపించింది. మత్స్యకారులకు ఏటా పన్ను రహిత 500 లీటర్ల డీజిల్​ పంపిణీ చేస్తామని ప్రకటించింది. లీన్​ పీరియడ్​లో రూ.6000 అలవెన్స్​ ఇస్తామని చెప్పింది. వీటితోపాటు మరిన్ని హామీలు ఇచ్చింది.

బీజేపీపై వ్యతిరేకత
రాష్ట్ర ప్రజల్లో బీజేపీ సర్కారు పట్ల ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్​ పార్టీ బాగా ఉపయోగించుకుంది. అ అంశాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లింది. అనవసరమైన అంశాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బహిరంగ సభలు, ర్యాలీల్లో ప్రస్తావించింది. బొమ్మై సర్కార్​నును 40 శాతం కమిషన్​ ప్రభుత్వం అంటూ వర్ణిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.

karnataka assembly election 2023 congress won
ప్రచార పర్వంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్​

బలమైన స్థానిక నేతలు
Congress Won Karnataka : కాంగ్రెస్​ పార్టీలో మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​, బీజేపీ నుంచి వచ్చిన జగదీశ్​ శెట్టర్​ వంటి బలమైన స్థానిక నేతలు ఉండడం వల్ల కాంగ్రెస్​కు కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టికెట్ల కేటాయింపుల్లో హస్తం పార్టీ ఆచితూచి అడుగులు వేసిందని అంటున్నారు. నిరుద్యోగ యువతలో బీజేపీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని హస్తం పార్టీ ఒడిసిపట్టుకుందని చెబుతున్నారు.

karnataka assembly election 2023 congress won
ప్రచార పర్వంలో మాజీ సీఎం సిద్ధరామయ్య

నందిని పాలు X అమూల్ పాలు
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కర్ణాటక పాల సమాఖ్య ఆధ్వర్యంలోని నందిని పాల ఉత్పత్తులకు పోటీగా గుజరాత్‌కు చెందిన అమూల్‌ సంస్థకు అవకాశం కల్పించడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. గుజరాత్‌ రాష్ట్ర పాల సహకార సంస్థ బ్రాండ్‌- అమూల్‌, కర్ణాటక పాల సహకార సమాఖ్య బ్రాండ్‌(కేఎంఎఫ్)- నందిని కలిసి పనిచేయాలని కొద్ది నెలల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అలాగే త్వరలోనే బెంగళూరులోనూ అమూల్‌ పాలు, పెరుగు అందుబాటులోకి రానున్నాయంటూ ఆ కంపెనీ ట్వీట్‌ చేసింది. ఈ వివాదాన్ని ఆసరగా తీసుకున్న కాంగ్రెస్​ పార్టీ.. లక్షలాది మందికి జీవనాధారమైన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్​ను మూసేసి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేయబోతోందని ఆరోపించింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీఎం బొమ్మై ఖండించినప్పిటికీ.. అమూల్​ వ్యవహారం కాంగ్రెస్​కు కలిసొంచ్చిదనే చెప్పాలి!

అధికార బీజేపీపై లింగాయత్​ల అసంతృప్తి
అధికార బీజేపీపై లింగాయత్​ల అసంతృప్తి.. కాంగ్రెస్​కు బలంగా మారింది. లింగాయ‌త్ సామాజిక వర్గానికి చెందిన మాజీ సీఎం జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ , మాజీ డిప్యూటీ సీఎం ల‌క్ష్మ‌ణ్​ స‌వాది ఉన్న‌ట్టుండి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీంతో కాషాయానికి భారీగా న‌ష్టం వాటిల్ల‌ింది. గతసారి బీజేపీ సీనియర్​ నేత యడియూరప్పను సీఎం పదవి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడం వల్ల లింగాయత్​లు.. బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు.

karnataka assembly election 2023 congress won
ప్రచార సమయంలో మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్​ విజయానికి మరిన్ని కారణాలు

  • పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం
  • టికెట్ల కేటాయింపుల్లో పార్టీ ఆచితూచి అడుగులు
  • రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు

రాజకీయ చరిత్ర రిపీట్​.. మార్పు సంప్రదాయానిదే గెలుపు
Karnataka Elections 2023 : క‌ర్ణాట‌కలో మార్పు సంప్రదాయమే గెలిచింది. కాంగ్రెస్​ జయకేతనం ఎగురవేసింది. ఓసారి రాజ‌కీయ చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే.. 1985 త‌ర్వాత అక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ పార్టీ కూడా వ‌రుస‌గా రెండు సార్లు గెలిచింది లేదు. అక్క‌డ జ‌రిగిన తొలి ఆరు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌గా.. అనంత‌రం జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో జ‌న‌తా పార్టీ గెలుపొందింది. త‌ర్వాత నుంచి ఏ పార్టీ కూడా వ‌రుస‌గా రెండు సార్లు రాష్ట్రంలో స్వ‌తంత్రంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేక‌పోయింది. ఇప్పుడు ఈ సంప్ర‌దాయమే రిపీట్​ అయ్యి కాంగ్రెస్​ గెలిచింది.

Last Updated :May 14, 2023, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.