ETV Bharat / opinion

రఫేల్​ రాకతో.. గగనతలంలో సవాళ్లకు భారత్​ సిద్ధం!

author img

By

Published : Jul 22, 2020, 7:41 AM IST

india-strengthens-its-air-force-with-rafale
రఫేల్​ రాకతో.. గగనతలంలో సవాళ్లకు భారత్​ సిద్ధం!

చైనాను ఏకాకి చేయడానికి ప్రపంచ దేశాలు పట్టుబిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్వాన్‌ ఘర్షణల పరిణామాల్లో భారత్‌ అడిగినదే తడవుగా ఫ్రాన్స్‌, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లు యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్షిపణులను హుటాహుటిన పంపాయి. తాజాగా రఫేల్​ యుద్ధ విమానాలను ఈ నెల 29న దేశానికి పంపనుంది ఫ్రాన్స్​. గగనతలంలో ఇది భారత్​ శక్తిని పెంపొందిస్తుంది. అయితే యుద్ధమంటూ వస్తే ప్రపంచం భారత్‌కు మద్దతు పలకడం, చైనా ఒంటరి కావడం ఖాయం!

సైనిక బలంలో భారత్‌కన్నా చైనా మిన్న కాబట్టి పూర్తిస్థాయి యుద్ధంలో ఇండియా నిలబడలేదని బీజింగ్‌ బెదిరిస్తూ ఉంటుంది. కానీ, కొవిడ్‌ సంక్షోభానికి చైనాయే కారణమనే ఆరోపణతో ప్రపంచంలో ఏకాకి అయిన బీజింగ్‌, సంపూర్ణ సమరానికి దిగుతుందా అంటే సందేహమే. చైనా అజేయ శక్తిగా ఎదిగితే అమెరికా అగ్రరాజ్య హోదాకు కలిగే ముప్పు ఏమిటో వాషింగ్టన్‌కే కాకుండా పాశ్చాత్య దేశాలన్నింటికీ తెలుసు. అందుకే, గల్వాన్‌ ఘర్షణల నేపథ్యంలో భారత్‌ అడిగినదే తడవుగా ఫ్రాన్స్‌, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లు యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్షిపణులను హుటాహుటిన పంపాయి. 2016లో భారత్‌ను ప్రధాన వ్యూహపరమైన భాగస్వామిగా గుర్తించిన అమెరికా, ప్రపంచంలో అతిపెద్ద యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ను హిందూ మహాసముద్రానికి పంపింది. నిమిట్జ్‌ అండమాన్‌, నికోబార్‌ దీవుల సమీపంలో భారత నౌకాదళంతో జత కలిసి సంయుక్త విన్యాసాలు జరిపింది. మరోవైపు ఫ్రాన్స్‌ అత్యాధునిక రఫేల్‌ యుద్ధవిమానాల బట్వాడాను వేగవంతం చేసింది.

వైమానిక దళం శక్తిమంతం

అయిదు రఫేల్‌ విమానాలు జులై 29న భారత్‌లోని అంబాలా స్థావరానికి చేరుకుంటాయి. ఫ్రాన్స్‌ తన వైమానిక దళం కోసం సిద్ధం చేసుకున్న మీటియోర్‌, శ్కాల్ప్‌ క్షిపణులను భారతీయ రఫేల్‌లకు అమర్చి పంపుతున్నందువల్ల అవి తక్షణం చైనాతో సమరానికి సై అనగలవు. మీటియోర్‌ క్షిపణి గగనంలో 120 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాన్ని కూలచగలిగితే, శ్కాల్ప్‌ 600 కిలోమీటర్ల దూరంలోని భూతల శత్రుస్థావరాన్ని ధ్వంసం చేయగలదు. రఫేల్‌ సరిహద్దు దాటకుండానే శత్రువు పనిపట్టగలదన్న మాట. భారత వైమానికదళ అమ్ములపొదిలోని అత్యాధునిక యుద్ధ విమానాలు- సుఖోయ్‌ 30, మిరేజ్‌ 2000. మిగ్‌ 29 ఫైటర్లను ఇప్పటికే సరిహద్దుల్లో మోహరించింది. మొత్తం మీద భారత్‌, చైనాల మధ్య యుద్ధం మన ఈశాన్య సరిహద్దులకే పరిమితమవుతుందని రక్షణ నిపుణుల అంచనా. గల్వాన్‌ లోయకు చుట్టుపక్కల 500 కిలోమీటర్ల దూరంలో చైనాకు రెండు వైమానిక స్థావరాలు, 1000 కిలోమీటర్ల పరిధిలో మరో రెండు ఉన్నాయి. 1,300 నుంచి 1,500 కిలోమీటర్ల దూరంలో మరి రెండు స్థావరాలు ఉన్నాయి. ఇవన్నీ ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి నుంచి చైనా విమానాలు భారత సరిహద్దుకు వచ్చి బాంబులు కురిపించాలటే మార్గమధ్యంలో తిరిగి ఇంధనం నింపుకోవలసి ఉంటుంది. ఇంధన పరిమితి వలల అవి ఎక్కువసార్లు బాంబుదాడులు నిర్వహించలేవు. పైగా, ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ విమానం మోయగల బరువు తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక ఎయిర్‌బస్‌ విమానం తక్కువ ఎత్తు నుంచి పూర్తి లోడు నింపుకొని ఎత్తైన ప్రాంతంలో దిగగలదు కానీ, అక్కడి నుంచి తిరిగి పైకి ఎగిరేటప్పుడు కనీసం అందులో పావు వంతు లోడు కూడా మోయలేదు. అంటే, ఎత్తులో ఉన్న స్థావరాల నుంచి చైనా యుద్ధ విమానాలు ఎక్కువ బాంబులతో పోరుకు దిగలేవు. ఏతావతా 500 కిలోమీటర్ల పరిధిలోని చైనా స్థావరాలు మాత్రమే వైమానిక యుద్ధానికి వత్తాసు ఇవ్వగలుగుతాయి. అదే భారత్‌ విషయానికి వస్తే ఉత్తర, ఈశాన్య భారతాల్లోని వైమానిక స్థావరాలన్నీ సరిహద్దుకు సమీపంలో ఉండి చైనాపై దాడికి తోడ్పడతాయి. శ్రీనగర్‌, లదాఖ్‌ తప్ప మిగతా 21 స్థావరాలు ఎత్తు తక్కువ ప్రాంతాల్లోనే ఉన్నాయి. లదాఖ్‌ వంటి ఎత్తైన ప్రాంతాల నుంచీ ఎగరడానికి వీలుగా రఫేల్‌ ఇంజిన్‌లో భారత్‌ కోరిన మార్పుచేర్పులను చేసి ఫ్రాన్స్‌ పంపుతోంది. తక్కువ ఎత్తులోని స్థావరాల నుంచి మన విమానాలు పూర్తి బాంబు లోడుతో పైకెగిరి చైనా స్థావరాలపై దాడి చేసి తిరిగి రాగలవు. మళ్ళీ ఇంధనం, బాంబులు నింపుకొని దాడికి బయలుదేరగలవు. చైనా విమానాలకు ఆ వెసులుబాటు లేదు. ఫలితంగా భారత విమానాలకు చైనా ఫైటర్లకన్నా రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువసార్లు దాడులు జరిపే సత్తా ఉంది. చైనాను సమర్థంగా ఎదుర్కోవడంపై ఈ నెల 22-24 తేదీల్లో భారత వాయుసేన ప్రధానాధికారి ఆర్‌.కె.ఎస్‌. భధౌరియా తన ఏడుగురు కమాండర్లతో చర్చిస్తారు.

భూతల పోరాటంలో బలాబలాలు

గల్వాన్‌, అక్సాయ్‌ చిన్‌ వంటి హిమాలయ ప్రాంతాలు సముద్ర మట్టానికి 10,000 నుంచి 15,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. 10,000 కిలోమీటర్లకన్నా ఎక్కువ ఎత్తుకు వెళ్లినకొద్దీ మానవుడికి అదనపు ఆక్సిజన్‌ అవసరమవుతుంది. ఈ ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువ కాల నివసించినవారికి మాత్రం ఆ అవసరం ఉండదు. ఇంత ఎత్తులోని వాతావరణానికి అలవాటు పడాలటే సైనికులకు ఏడు నుంచి 20 రోజుల వ్యవధి పడుతుంది. భారతదేశ పర్వత పోరాట దళాలు ఎత్తైన ప్రాంతాల్లో పోరుకు ఇలానే అలవాటు పడి నిత్యం సమర సన్నద్ధంగా ఉంటాయి. పైగా సియాచిన్‌, కార్గిల్‌ వంటి పర్వత యుద్ధాల్లో ఆరితేరిన దళాలు మనవి. చైనా దళాలకు ఆ అనుభవం లేదు. చైనాకు మైదానాల్లో ఎన్ని లక్షల సైనికులు ఉన్నా, వారందరినీ ఉన్నపళాన హిమాలయాలకు తరలించడం కుదరదు.

భారతదేశం చైనాపై పోరుకు మొత్తం 2.25 లక్షల సైనికులను మోహరించగలదని అమెరికాకు చెందిన బెలఫర్‌ సెంటర్‌ అంచనా. చైనా ఇంతకన్నా ఎక్కువమందినే మోహరించగలిగినా, పైన చెప్పుకొన్న వాతావరణ పరిమితులు దానికి అడ్డుపడతాయి. భారతదేశం 1965 నుంచి పాకిస్థాన్‌తో పదేపదే ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు చేస్తూ అపార పోరాట అనుభవం గడించగా, చైనా పోరాట అనుభవం 1979లో వియత్నాం యుద్ధంతో సరి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనాపై భారత్‌ అనేక సైనిక, పారామిలిటరీ దళాలను మోహరించింది. వైమానిక స్థావరాలు, రహదారులు, వంతెనలు నిర్మించింది. రష్యా నుంచి ఏఎన్‌ 32 రవాణా విమానాలకు తోడు అమెరికా నుంచి భారీ సి 130 హెర్క్యులిస్‌, సి 17 గ్లోబ్‌ మాస్టర్‌ రవాణా విమానాలనూ సేకరించింది. వీటి ద్వారా భారీ సంఖ్యలో సైనికులను, మందుగుండును, ట్యాంకులు, కవచ శకటాలను కూడా మెరుపు వేగంతో చైనా సరిహద్దుకు తరలించవచ్చు. ఎల్‌ఏసీ సమీపంలో చైనా 101 యుద్ధవిమానాలను మోహరిస్తే, భారత్‌ 122 విమానాలను సిద్ధంగా ఉంచింది. భారత్‌ తాజాగా అమెరికన్‌ అపాచీ అటాక్‌ హెలికాప్టర్లను, చినూక్‌ రవాణా హెలికాప్టర్లను కూడా సరిహద్దులో దించింది.

అణు పాటవంలో పోటాపోటీ

చైనాకు మొత్తం 320 అణ్వస్త్రాలు ఉంటే, భారత్‌ వద్ద 150 ఉన్నాయని స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతిశోధన సంస్థ (సిప్రి) 2020 సంవత్సర సంపుటి వెల్లడించింది. చైనా అణ్వస్త్రాలలో 104 భారత్‌లో ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగలవని బెలఫర్‌ సెంటర్‌ అంచనా. భారత్‌ అమ్ములపొదిలోని 10 అగ్ని-3 అణ్వస్త్రాలు చైనాలో ఏ లక్ష్యంపైనైనా, ఎనిమిది అగ్ని-2 అణుక్షిపణులు చైనా మధ్య ప్రాంతాల మీద విరుచుకుపడగలవు. ఇవి కాకుండా 51 జాగ్వార్‌, మిరేజ్‌ యుద్ధ విమానాల నుంచీ అణుబాంబులు కురిపించవచ్చునని బెలఫర్‌ సెంటర్‌ అంచనా. పరిస్థితి అక్కడి వరకు రాకూడదని ప్రపంచమంతా కోరుకొంటోంది. చైనా మొండిగా యుద్ధానికి దిగితే- ప్రపంచం భారత్‌కు మద్దతు పలకడం, చైనా ఒంటరి కావడం ఖాయం!

- ఏఏవీ ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.