ETV Bharat / opinion

ఒకే సీటు.. ఒకే పేరు.. ఇద్దరికి మించి అభ్యర్థులు.. పార్టీల 'కన్​ఫ్యూజన్' వ్యూహమిది!

author img

By

Published : May 3, 2023, 6:26 AM IST

karnataka-assembly-election-2023
karnataka-assembly-election-2023

Election rivals same name : ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తే.. ఈవీఎంలోని అభ్యర్థి పేరునే ముందుగా చూస్తుంటాం. ఆ అభ్యర్థి పేరును పరిశీలించి ఓటు వేస్తుంటాం. కానీ ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు ఉంటే?... అవగాహన ఉన్నవారైతే పార్టీ గుర్తును బట్టి అభ్యర్థికి ఓటు వేస్తారు. కానీ.. కాస్త ఏమరపాటుగా ఉంటే మాత్రం ఆ ఓటు వేరే వ్యక్తికి వెళ్లిపోయినట్టే! ప్రస్తుతం కర్ణాటకలో ఇదే పరిస్థితి ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగినట్లు కనిపిస్తున్నా.. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Karnataka assembly election 2023 : ఒకే నియోజకవర్గం.. వేర్వేరు పార్టీలు.. అభ్యర్థుల పేర్లు మాత్రం సేమ్! ఓటరు కాస్త ఏమరపాటుగా ఉంటే ఇక అంతే! ఒకరికి పడే ఆ ఓటు ఇంకొకరి ఖాతాలోకి చేరడం ఖాయం. కర్ణాటకలోని 20 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. త్రిముఖ పోరు నడుస్తున్న ఈ ఎన్నికల్లో ఒకే పేరుతో పలువురు అభ్యర్థులు బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్న పలు నియోజకవర్గాల్లో.. అదే పేరుతో ఉన్న కొందరు నామినేషన్లు వేయడం చర్చనీయాంశమవుతోంది. ఇలా నామినేషన్ వేయడానికి కారణమేంటి? దీని వెనుక ప్రధాన పార్టీల హస్తం ఉందా? ఉంటే.. దాని వల్ల వచ్చే లాభమేంటో చూద్దాం. అంతకుముందు ఇలా ఏఏ నియోజకవర్గాల్లో ఉన్నారో పరిశీలిద్దాం.

హొసకోటె
ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన శరత్​ బాచెగౌడ.. ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎంటీబీ నాగరాజ్.. శరత్​ను ఢీకొడుతున్నారు. బలమైన అభ్యర్థులుగా ఉన్న వీరిద్దరికీ.. అదే తరహా పేరు ఉన్న ప్రత్యర్థుల నుంచి సవాల్ ఎదురవుతోంది. శరత్ బాచెగౌడ పేరుతోనే మరో అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా నాగరాజ్ పేరుతో మరో ఇద్దరు బరిలో నిలిచారు. ఎన్ నాగరాజ్, టీ నాగరాజ్ అనే వ్యక్తులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

కుమారస్వామికీ అదే ఇబ్బంది
మాజీ సీఎం కుమారస్వామి పోటీ చేస్తున్న చన్నపట్టణ స్థానం నుంచి వైసీ కుమారస్వామి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థి బరిలోకి దిగారు. ఇక్కడ కుమారస్వామే ఫేవరెట్ అయినప్పటికీ.. పేరును చూసి అయోమయానికి గురై ఎవరైనా రెండో అభ్యర్థికి ఓటు వేసే అవకాశం లేకపోలేదు.

karnataka-assembly-election-2023
కుమారస్వామి

శ్రీనివాస్​పుర్ నియోజకవర్గం
ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత కేఆర్ రమేశ్ కుమార్​ మరోసారి ఇక్కడ అదృష్టం పరీక్షించుకోనున్నారు. బీజేపీ నుంచి గుంజూర్ ఆర్ శ్రీనివాస రెడ్డి, జేడీఎస్ నుంచి జీకే వెంకటశివారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని పోలిన మరో ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎన్​ఆర్ రమేశ్ కుమార్, ఎస్ రమేశ్ కుమార్ పేర్లతో బరిలో నిలిచిన ఇద్దరు.. కాంగ్రెస్ ఓట్లు చీల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జేడీఎస్​ అభ్యర్థి పేరును పోలిన వ్యక్తులూ బరిలో ఉన్నారు. అచ్చం జీకే వెంకటశివారెడ్డి అనే పేరుతో ఒకరు.. టీఎన్ వెంకటశివారెడ్డి అనే పేరుతో మరొకరు పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ స్వతంత్రులే.

యలహంక
యలహంక నుంచి మొత్తం 20 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ బరిలో ఉండగా.. అదే పేరును పోలి ఉన్న ఎస్​వీ విశ్వనాథ్, హెచ్​జే విశ్వనాథ్​ స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. జేడీఎస్ నుంచి 'మునెగౌడ ఎం' బరిలో ఉండగా.. మునెగౌడ ఎన్, బీఎం మునెగౌడ, మునెగౌడ వీ అనే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఆయనకు తలనొప్పిగా మారారు.

దసరాహళ్లి
ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే ఆర్ మంజునాథ్ ఇక్కడ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ తరఫున ఎస్ మునిరాజు, కాంగ్రెస్ తరఫున జీ ధనంజయ బరిలో ఉన్నారు. జేడీఎస్ అభ్యర్థి పేరును పోలిన ముగ్గురు అభ్యర్థులు ఇక్కడ పోటీ చేయడం గమనార్హం. ఎన్ మంజునాథ్, మంజునాథ్ ఆర్, ఆర్ మంజునాథ్ అనే స్వతంత్ర అభ్యర్థులు.. దసరాహళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

చిక్కబళ్లాపుర
రాష్ట్ర మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కే సుధాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో.. ఆయనతో పాటు కాంగ్రెస్ తరఫున ప్రదీప్ ఈశ్వర, జేడీఎస్ నుంచి కేపీ బాచెగౌడ పోటీ చేస్తున్నారు. కే సుధాకర్ పేరును తలపించేలా.. సుధాకర్ ఎన్ అనే వ్యక్తి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

karnataka-assembly-election-2023
డాక్టర్ కే సుధాకర్

కృష్ణారెడ్డికి స్వతంత్రుల సవాల్
11 మంది పోటీలో ఉన్న చింతామణి నియోజకవర్గానికి జేడీఎస్ ఎమ్మెల్యే జేకే కృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కృష్ణారెడ్డితో పాటు బీజేపీ నుంచి వేణుగోపాల్, కాంగ్రెస్ నుంచి ఎంసీ సుధాకర్ పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా కృష్ణారెడ్డి కే, ఎన్​సీ కృష్ణారెడ్డి బరిలో నిలిచి.. జేడీఎస్​కు తలపోటుగా మారారు.

బొమ్మనహళ్లి నియోజకవర్గం
బొమ్మనహళ్లి నుంచి 14 మంది పోటీ చేస్తుండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ సతీశ్ రెడ్డి ఇక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి ఉమాపతి ఎస్ గౌడ ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్​ను కలవరపాటుకు గురిచేస్తూ.. ఉమాపతి బాబు అనే వ్యక్తి బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు.

హసన్
తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్న హసన్ నియోజకవర్గంలోనూ ఒకే పేరు గల అభ్యర్థులు ఉన్నారు. జేడీఎస్ నుంచి పోటీ చేస్తున్న స్వరూప్ ప్రకాశ్​ పేరును తలపించేలా.. స్వరూప్ బీఎం అనే వ్యక్తి సైతం ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.

రేవణ్నదీ అదే కథ
హసన్ జిల్లాలోని హోళెనరసిపుర నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దేవెగౌడ కుమారుడు హెచ్​డీ రేవణ్న ఇక్కడి ప్రధాన అభ్యర్థి. అయితే, హెచ్ఆర్ రేవణ్న అనే స్వతంత్ర అభ్యర్థి సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.

karnataka-assembly-election-2023
దేవెగౌడతో రేవణ్న (కుడి)

కారణం ఇదే..
రాజకీయ వ్యూహంలో భాగంగానే కొన్ని పార్టీలు.. ప్రధాన అభ్యర్థిని పోలినట్లు పేరున్న వ్యక్తులను రంగంలోకి దించాయని విశ్లేషకులు చెబుతున్నారు. పరోక్షంగా మద్దతిస్తూ స్వతంత్రులను ఇలా నిలబెడుతున్నాయని అంటున్నారు. ప్రత్యర్థిని పరోక్షంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యూహాలకు పదునుపెడుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఓటర్లను అయోమయానికి గురిచేసి ప్రధాన అభ్యర్థికి రావాల్సిన ఓట్లను పక్కదారి పట్టించడమే లక్ష్యంగా ఈ పని చేస్తున్నాయని.. ఓట్లు చీలడం వల్ల తమకు లాభం చేకూరుతుందని లెక్కలు వేసుకుంటున్నాయని వివరిస్తున్నారు. మరి ఈ కన్​ఫ్యూజన్ ప్లాన్ ఎవరికి లాభం చేకూరుస్తుందో చూడాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.