ETV Bharat / opinion

కశ్మీర్​ 'సమాచార యుద్ధం'లో విజయం ఎలా?

author img

By

Published : May 19, 2020, 6:05 PM IST

information warfare in kashmir
సమాచార యుద్ధం: కశ్మీర్​ సమస్యకు పరిష్కారమేది?

కశ్మీర్​... సువిశాల భారతావనికి మకుటం. అందాల లోయలు, హిమపాతాల సోయగాల సమాహారం. అయితే ఇందతా ఒకవైపే. నాణానికి మరోవైపు చూస్తే.. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్​లో తుపాకీ తూటా వినిపించని రోజు లేదు. ఉగ్రవాదుల కుతంత్రాలు, వేర్పాటువాదుల నినాదాలు, అమాయక కశ్మీరీ​ యువతను హింసకు పురిగొల్పుతున్నాయి. మరి ఎన్నో ఏళ్లుగా నలుగుతోన్న కశ్మీర్​ సమస్యకు పరిష్కారమేంటి? అసలు అక్కడ ఏం జరుగుతోంది?

కశ్మీర్​లో ఎన్నో ఏళ్లుగా జరుగుతోన్న సంఘర్షణను 'పరోక్ష యుద్ధం'గా పిలుస్తుంటారు. ఈ మాటకు బలం చేకూర్చే కారణాలు లేకపోలేదు. పాకిస్థాన్​ సైన్యం.. శిక్షణ పొందిన ఉగ్రవాదులను కశ్మీర్​లోకి ఉసిగొల్పుతుంటే.. మనవైపు ఉన్న వేర్పాటువాదులు, అవినీతి రాజకీయ నాయకులు అందుకు మద్దతిస్తున్నారు. స్థానిక యువతను తుపాకులు పట్టేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చిక్కుముళ్ల మధ్య కశ్మీర్​ సమస్యకు పరిష్కారమేది? కశ్మీర్​ సమస్య పూర్తి చిత్రాన్ని తెలిపే విశ్లేషణాత్మక సమాచారాన్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నారు రిటైర్డ్​ లెఫ్టినెంట్​ జనరల్ డీఎస్​ హూడా. ఈయన 2016 లక్షిత దాడుల​కు నాయకత్వం వహించిన సైనికాధికారి.

ప్రజామద్దతు ఉందా?

ప్రజామద్దతు లేకుండా దాదాపు 30 ఏళ్ల నుంచి సాయుధ తిరుగుబాటు సాధ్యం కాదు. అయితే కశ్మీర్‌కు దీర్ఘకాలిక పరిష్కారం అందించడానికి... ఉగ్రవాదానికి పాకిస్థాన్​ మద్దతును బలహీనపరిచడం, హింసాత్మక సంఘటనలను నివారించడం చేస్తున్నాము. వీటితో పాటు అక్కడి ప్రజలపైనా ఎక్కువ దృష్టి పెట్టాలి. కశ్మీర్‌లో 'ఉగ్రవాదం' అనే పదానికి బదులుగా 'తిరుగుబాటు' అని అనే వాళ్లకు చెప్పేది ఒక్కటే. ఉగ్రవాదం కూడా 'తిరుగుబాటు'లో భాగమే.

పాక్​ అస్త్రమిదే...

తిరుగుబాటుదారులను ఎదుర్కోవడాన్ని "హార్ట్స్ అండ్ మైండ్స్" అని పిలుస్తుంటాం. వాస్తవం ఏంటంటే ఈ తిరుగుబాటును అణిచివేయడానికి మనసు కన్నా బుర్ర ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. తప్పుడు సమాచార వ్యాప్తి, నకిలీ వార్తల ప్రచారం వెనుక ఉద్దేశం ప్రజల మనసులను ప్రభావితం చేయడమే. జనాలను తమ వైపునకు తిప్పుకొని వారి విశ్వాసం, మద్దతు పొందేందుకు.. సమాచార వ్యూహాల ద్వారా ప్రయత్నాలు చేస్తుంటాయి ఉగ్ర సంస్థలు. దీన్ని సైన్యం పరిభాషలో 'సమాచార యుద్ధం' అని పిలుస్తారు.

ఈ యుద్ధంలో ప్రధానంగా నకిలీ వార్తలపై ఆధారపడే ఉగ్రవాదులే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. "నిజం గడప దాటేలోపు... అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టేస్తుంది" అన్న విన్​స్టన్​ చర్చిల్ మాటలు అక్షరసత్యాలు. ఆ కాలంలో సమాచార వ్యవస్థ ప్రధానంగా రేడియోలు, టెలిగ్రాఫ్​పై ఆధారపడి ఉండేది. ఈ రోజు స్మార్ట్​ఫోన్​ల సాయంతో ప్రపంచంలో ఎక్కడికైనా వేగంగా సమాచారాన్ని చేరవేయొచ్చు.

2018లో చేసిన 'మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' అధ్యయనం ప్రకారం.. నిజమైన వార్తల కంటే తప్పుడు సమాచారం 70 శాతం అధికంగా రీట్వీట్ అవుతోంది. నకిలీ కథనాలు నిజమైన వార్తల కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని అధ్యయనంలో తేలింది.

కశ్మీర్​లో పాక్​ కుయుక్తులు

  • కశ్మీర్​లో మతం, జాతిని కాపాడేందుకే ఉగ్రవాదులు ఉన్నారని.. దేశంలో పెరుగుతున్న హిందూ జాతీయవాదంతో ముప్పు పొంచి ఉందని పాక్​ జోరుగా వదంతులు పుట్టిస్తోంది.
  • కశ్మీరీ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని.. భద్రతా దళాలు మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నట్లు చెబుతోంది.

అయితే భారత ప్రభుత్వం తన సమాచార వ్యవస్థ ద్వారా ఈ రెండూ తప్పని బలంగా నిరూపించాలి. అలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇందుకు చేయాల్సినవివే..

  1. భద్రతా దళాలు ఇప్పటికే చూపిస్తోన్న క్రమశిక్షణ కొనసాగాలి.
  2. ఎన్​కౌంటర్ల సమయంలో పౌరుల ప్రాణ నష్టం తగ్గేలా చూడాలి.
  3. సైన్యంపైనా, ప్రజలపైనా దాడులు చేయాలనుకునే వారిని ఎంతమాత్రం సహించకూడదు. అయితే సైన్యాన్ని ఎక్కువగా మోహరించడం వల్ల స్థానికుల్లో అణిచివేతకు గురవుతున్నామనే భావన పెరుగుతుంది.
  4. మానవ హక్కులను కాపాడే విషయంలో భారత ప్రభుత్వం సరైన పారదర్శకత పాటించట్లేదని కొన్ని సంస్థలు ఆరోపిస్తుంటాయి. జాతి భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు. అయితే ఆ సంస్థల వ్యాఖ్యలను పూర్తిగా కొట్టేయాల్సిన అవసరం లేదు. ఆరోపణల అంశాలపై కాస్త దృష్టిపెడితే.. ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరుగుతుంది.

మరో సవాలు..

జమ్ముకశ్మీర్ ప్రజలకు వారి మత, జాతి గుర్తింపును కాపాడతామని భరోసా ఇవ్వడం ప్రభుత్వం ముందు ఉన్న పెద్ద సవాలు. పాకిస్థాన్​, వేర్పాటువాదులు ప్రజల్లోని ఈ భయాలనే ఆసరాగా తీసుకొంటున్నారు. ఆర్టికల్​ 370 రద్దు, పౌరసత్వ చట్ట సవరణ సహా దిల్లీలో ఫిబ్రవరిలో చెలరేగిన అల్లర్లను వారి వాదనలకు బలం చేకూర్చేలా మార్చుకుంటున్నారు.

అలసత్వం వద్దు..

పాకిస్థాన్​ జిత్తులమారి ప్రచారాలను నిలువరించడంలో ప్రభుత్వం చిన్నపాటి అలసత్వం ప్రదర్శిస్తోంది. జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ నిరోధించినా, నకిలీ వార్తల ప్రవాహాన్ని ఆపినా.. దేశంలోని మిగతా ప్రాంతాల్లో ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని అడ్డుకోవడానికి చేయాల్సింది చాలా ఉంది. ప్రభుత్వ సమాచార​ వ్యవస్థ.. స్థానికుల మనోభావాలను ఇతరులతో పంచుకోకుండా అడ్డుకోలేదు. కనుక ప్రభుత్వం స్థానిక ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు, చేసే అభివృద్ధి, ఆర్థిక తోడ్పాటు వంటివి క్షేత్రస్థాయి నుంచి అమలవ్వాలి. అప్పుడే తిరుగుబాటువాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించగలం.

సమాచారమే మన లక్ష్యం...

జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న సమాచార యుద్ధంలో పాక్​పై విజయం సాధించడంపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెట్టాలి. సామాజిక మాధ్యమాల్లో సాగే అసత్య ప్రచారాలపై నిఘా ఉంచేందుకు నిపుణులతో కూడిన సంస్థ అవసరం. స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వర్తించేలా మన విధివిధానాలు ఉండాలి. నకిలీ వార్తలు, ప్రచారాలను ఎదుర్కోవడానికి విశ్వసనీయ మీడియా భాగస్వామ్యం చాలా కీలకం.

అంతిమంగా ప్రజల మీద ప్రభావం చూపిస్తోన్న, తప్పుదోవ పట్టిస్తోన్న అంశాలను దీటుగా ఎదుర్కోవాలి. ప్రజలను ప్రభావితం చేయడానికి పాక్​ నకిలీ వార్తలను తొలి ఆయుధంగా ఉపయోగిస్తోంది. ఆ తర్వాత ప్రజల అసంతృప్తిని ఉగ్రవాదం రూపంలో మారుస్తోంది.

మనం ఎప్పుడూ ఉగ్రవాదుల వేటపైనే దృష్టిసారించడం వల్ల పెద్దగా ఫలితాలు రావడం లేదు. తొలి లక్ష్యమైన సమాచార వ్యవస్థపై మరింత దృష్టి సారిస్తే ఈ యుద్ధంలో భారత్​ విజయం తథ్యం. కశ్మీర్​ సమస్యకు శాస్వత పరిష్కారమైన శాంతి సాధ్యం.

- డీఎస్​ హూడా (విశ్రాంత లెఫ్టినెంట్​ జనరల్​).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.