ETV Bharat / opinion

భారత్‌- ఇరాన్‌ మధ్య పెరుగుతున్న దూరం

author img

By

Published : Sep 5, 2021, 5:15 AM IST

india iran relations
భారత్​ ఇరాన్​ మధ్య సంబంధాలు

ఇరు దేశాల మధ్య విభేదాలు లేకపోయినా, అంతర్జాతీయ పరిణామాల కారణంగా దూరం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సంస్కరణవాద నేతగా పేరున్న ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ ఆగస్టు మూడో తేదీన పదవిని వీడనున్నారు. అగ్రనేత అలీ ఖమేనీలా కరడుగట్టిన సంప్రదాయవాదిగా పేరున్న ఇబ్రహీం రైసీ ఆ పదవిలోకి రానున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీతో టెహరాన్‌ సంబంధాలు నిర్ణయాత్మకంగా మారనున్నాయి.

ఇరాన్‌లో చోటు చేసుకొంటున్న రాజకీయ మార్పులు దిల్లీతో టెహరాన్‌ సంబంధాలను నిర్ణయాత్మక దిశగా నడిపించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య విభేదాలు లేకపోయినా, అంతర్జాతీయ పరిణామాల కారణంగా దూరం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సంస్కరణవాద నేతగా పేరున్న ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ ఆగస్టు మూడో తేదీన పదవిని వీడనున్నారు. అగ్రనేత అలీ ఖమేనీలా కరడుగట్టిన సంప్రదాయవాదిగా పేరున్న ఇబ్రహీం రైసీ ఆ పదవిలోకి రానున్నారు. ఇరాన్‌ కీలక నాయకత్వం ఇప్పుడు సంప్రదాయవాదం వైపు మొగ్గింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే నాయకత్వ మార్పులు భారత్‌కు చాలా కీలకంగా మారాయి.

అతివాదులదే ప్రాబల్యం

తాజాగా ఇరాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ భవిష్యత్తును కొన్ని దశాబ్దాలపాటు శాసించనున్నాయి. ఈసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం రైసీ భవిష్యత్తులో 'అగ్రనేత' (సుప్రీం లీడర్‌) పదవిని అందుకోవడానికి ఇదొక సోపానం. ప్రస్తుత అగ్రనేత అలీ ఖమేనీ కూడా ఇదే కోరుకుంటున్నట్లుంది. గతంలో ఆయన కూడా 1981-89 మధ్య అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన తరవాతే రుహొల్లా ఖొమైనీ వారసత్వాన్ని అందుకొన్నారు. ప్రస్తుతం 'అగ్రనేత' వయస్సు 82 ఏళ్లు. రైసీ రెండుసార్లు అధ్యక్ష పదవిని పూర్తి చేసుకొనేసరికి ఖమేనీ 90 ఏళ్లకు చేరుకొంటారు. అధ్యక్షుడిగా అనుభవం ఉండటంతో 'అగ్రనేత'గా బాధ్యతలు స్వీకరించడం రైసీకి తేలికవుతుంది. వాస్తవానికి ఈసారి అధ్యక్ష ఎన్నికలు మొత్తం అలీ ఖమేనీ కనుసన్నల్లోనే జరిగాయి. అధ్యక్ష ఎన్నికలకు దరఖాస్తు చేసుకొన్న మొత్తం అభ్యర్థుల్లో ఒక్క శాతం మాత్రమే తుదిపోరులో ఉండేలా 'గార్డియన్‌ కౌన్సిల్‌' సాయంతో మంత్రాంగం నడిపారు. ఇదంతా కేవలం అత్యంత విశ్వాసపాత్రుడైన రైసీని అధ్యక్షుడిని చేయడానికే. 1988లో దాదాపు నాలుగు వేల మంది ఎంఈకే తిరుగుబాటుదారులకు మరణ శిక్ష విధించిన 'డెత్‌ కమిటీ' న్యాయమూర్తుల్లో రైసీ ఉన్నారు. ఆ తరవాత ఏడాది అలీ ఖమేనీ సాఫీగా అత్యున్నత అధికారం దక్కించుకొన్నారు. నాటి శిక్షలు ఇప్పటికీ ఇరానీలను పీడకలలా వెంటాడుతుంటాయి. దీనికి సంబంధించి రైసీ ఇప్పటికీ అమెరికా సహా పలు దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్నారు. 2019లో విద్యార్థుల ఆందోళనల అణచివేతలో కూడా ఆయన పాత్ర ఉంది. ఎన్నికల్లో గెలుపు ఖాయం కాగానే 'ఇరాన్‌ ప్రజల జీవితాలు అణు ఒప్పందం (జేసీపీఓఏ)పై ఆధారపడి ఉండకూడదు' అని రైసీ వ్యాఖ్యానించారు. ఆంక్షలను లెక్కచేయకుండా రష్యా, చైనాలు ఆర్థికంగా, ఆయుధ పరంగా అండగా ఉండటంతో ఇరాన్‌ కూడా ఈ ఒప్పందం కోసం పెద్దగా వెంపర్లాడటం లేదు. ఈ అణు ఒప్పంద భవిష్యత్తుపైనే భారత్‌, ఇరాన్‌ సంబంధాలు ఆధారపడి ఉంటాయి.

ఇరాన్‌కు అమెరికా, ఐరోపా సమాఖ్య, యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌తో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ దేశాలతో భారత్‌కు బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఒక్క ఇరాన్‌ కోసం వీటిని దూరం పెట్టే పరిస్థితి లేదు. వాస్తవానికి భారత్‌ 2005లో అమెరికాతో పౌర అణు ఒప్పందానికి ముందే ఇరాన్‌ను దూరం పెట్టింది. తరవాత అమెరికా ఆంక్షల కారణంగా మోదీ సర్కారు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు ఆపేసింది. ఆ దేశానికి ఈ పరిణామాలు ఏమాత్రం రుచించలేదు. మరోపక్క భారత్‌ను అవసరానికి వాడుకొని పక్కనపెట్టే వైఖరిని ఇరాన్‌ సర్కారు తరచూ అనుసరిస్తోంది.

ఇండియా ముందు పరిమిత మార్గాలు

చైనా తెరవెనక కథ నడుపుతోందనే అనుమానాలు భారత్‌లో బలంగా ఉన్నాయి. ఫర్జాద్‌-బి సహజవాయు క్షేత్రం, చాబహార్‌ ఓడరేవులో విదేశీ పెట్టుబడులను ఛాందసవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు రైసీ అధ్యక్షుడు కావడంతో పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశలు లేవు. కశ్మీర్‌ ఉగ్రవాదానికి స్వాతంత్య్ర పోరాటం రంగు పూసేందుకు ఆ దేశ అగ్రనేత అలీ ఖమేనీ తరచూ ప్రయత్నిస్తుండటం భారత్‌ను చీకాకుపెడుతోంది. తాజాగా వచ్చిన రైసీ కూడా ఈ కోవకు చెందిన నాయకుడే. ఈ విషయంలో ఆయన వైఖరి అధికారికంగా బయటపడలేదు. ఇరుదేశాల మధ్య గతంలో మాదిరి పూర్తిస్థాయి సత్సంబంధాలు లేవన్నది చేదు నిజం. సంబంధాలను మెరుగుపరచుకోవడానికి భారత్‌ ఎదుట పరిమిత మార్గాలే ఉన్నాయి. మరికొన్ని నెలల్లో అణు ఒప్పందం కొలిక్కి వస్తే చమురు దిగుమతులను ప్రారంభించడంతో పాటు అక్కడి ప్రాజెక్టులను వేగిరం చేయాలి. ఆ దేశం చైనాపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది. అదే సమయంలో చైనా-పాకిస్థాన్‌-రష్యా కూటమిలోకి ఇరాన్‌ వెళ్ళకుండా పశ్చిమదేశాలను కలుపుకొని పనిచేయాలి. ముఖ్యంగా గతంలో ఇరాన్‌లో ప్రాజెక్టులను వదులుకొని వెళ్ళిపోయిన ఫ్రాన్స్‌వంటి దేశాలు ఉపయోగపడతాయి. రష్యాతో కలిసి అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా నడవా (ఐఎన్‌ఎస్‌టీసీ) ప్రాజెక్టునూ ముందుకు తీసుకుపోవాలి.

- పెద్దింటి ఫణికిరణ్‌

ఇదీ చూడండి: అఫ్గాన్​లో 'పెద్దన్న' పాత్రపై చైనా​ కన్ను!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.