ETV Bharat / lifestyle

అమ్మో.. నాకు.. కరోనా వస్తుందేమో..!

author img

By

Published : Apr 29, 2021, 9:00 AM IST

fear-of-corona-is-not-good-for-mental-health
అమ్మో.. నాకు.. కరోనా వస్తుందేమో..!

కరోనా మహమ్మారి ప్రజల ఆర్థిక స్థితిగతులనే కాదు.. మానసిక పరిస్థితులపైనా ప్రభావం చూపుతోంది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు పక్కింట్లో ఉన్నారనో.. వీధిలో ఉన్నారనో.. కార్యాలయంలో నిన్నటివరకు కలిసి పనిచేశామోనన్న భయంతో తమకు సోకుతుందేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు. నిత్యం 104 టోల్‌ ఫ్రీ నంబరుకు వస్తున్న కాల్స్‌లో 40శాతం ఇదే తరహావి ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.

కొండాపూర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకుడి ఇంటి పక్కన ఉండే వాళ్లకు కరోనా సోకింది. ఆ అధ్యాపకుడు సైతం పరీక్షలు చేయించుకుందామని వెళ్లాడు. నెగెటివ్‌ వచ్చింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకున్నా, నెగెటివ్‌ వచ్చింది. అయినా వారం రోజులుగా ఆందోళన నుంచి బయటపడలేకపోయారు. చివరికి ఓ మానసిక వైద్య నిపుణుడిని కలవగా.. కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో కాస్త కుదురుకున్నాడు.

భయం.. ఆందోళనకు దారితీయొద్దు!

ప్రస్తుత పరిస్థితుల్లో భయం ఉండటం మంచిదేనని విశ్లేషిస్తున్నారు. కొంతవరకు ఉంటే మేలు. అతిగా భయపడుతూ ఆందోళనకు గురికావడం మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

* పక్కన కొవిడ్‌ ఉంది, తనకు వస్తుందనుకోవడం హేతుబద్ధమైనదో లేదో చూడాలి. ఎంతవరకు జాగ్రత్తలు తీసుకున్నామో ఆలోచన చేయాలి.

* కరోనా వచ్చిన వారితో ఎన్నిసార్లు కాంటాక్టు అయ్యామో బేరీజు వేసుకోవాలి.

* ప్రతి ఆలోచనకు ప్రత్యామ్నాయం ఉంటుంది. వాటిపై దృష్టి పెట్టాలి. కొవిడ్‌ వస్తుందనుకునే బదులు వచ్చేందుకు అవకాశాలున్నాయా.. లేదా.. చూడాలి.

* టెస్టు చేయించుకుని అనుమానాలు నివృత్తి చేసుకోవాలి. కొవిడ్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామా.. లేదా పరిశీలించుకోవాలి.

* ఒకవేళ పొరపాటున వస్తే ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నామనేది చూడాలి. ఇంట్లో అవసరమైన మందులు పెట్టుకున్నామా.. లేదా చూడాలి.

* అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి. మనిషి వయసు, ఆందోళన స్థాయిలను బట్టి కౌన్సిలింగ్‌ ఇస్తారు.

భయపడితే సాధించేది కాదు

చుట్టూ ఉన్న పరిసరాల వల్ల ప్రస్తుత తరుణంలో కరోనా రావొచ్ఛు. రాకపోవచ్ఛు భయపడి ఆందోళనకు గురైతే ఏదీ సాధించలేమన్నది గుర్తించాలి. మానసికంగా దృఢంగా ఉంటూ ఆలోచనలు వేరొక పనులపై మళ్లించుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ కార్యకలాపాలు నిర్వర్తిస్తుండాలని ఓయూ సైకాలజీ ఆచార్యులు ప్రొ.సి.బీనా చెప్పారు.

ఒత్తిడికి గురికావద్ధు.

భయానికి ఆందోళనకు మధ్య వ్యత్యాసం గుర్తించాలి. కరోనా పరీక్షలు చేయించుకున్నాక నెగెటివ్‌ వచ్చినా భయపడుతూ ఒత్తిడికి గురవుతుంటే.. ఆందోళనలో ఉన్నారని భావించాలి. మనోధైర్యంతో అధిగమించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్‌సీయూ హెల్త్‌ సైకాలజీ ఆచార్యురాలు ప్రొ.మీనాహరిహరన్‌ సూచించారు.

ఇదీ చూడండి: పల్లెవిస్తున్న టీకాస్త్రం...వ్యాక్సినేషన్‌లో గ్రామీణుల స్ఫూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.